China: చైనాలో కొవిడ్‌ విలయం.. శ్మశానాల వద్ద మృతదేహాలతో బారులు..?

చైనాలో కొవిడ్‌ మరణాలు భారీ స్థాయిలో చోటుచేసుకుంటున్నాయనే వార్తలు కలవరపెడుతున్నాయి. అధికారికంగా గత మూడు వారాల్లో కేవలం పదిలోపే మరణించినట్లు చైనా అధికారులు పేర్కొన్నారు. కానీ, శ్మశానాల వద్ద మృతదేహాలతో బారులు తీరిన పరిస్థితిని చూస్తే వాస్తవ పరిస్థితులు అర్థమవుతున్నాయని అమెరికాకు చెందిన ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు పేర్కొన్నారు.

Published : 27 Dec 2022 01:12 IST

బీజింగ్‌: చైనాలో(China) కరోనా మారణహోమం సృష్టిస్తోంది. నిత్యం వేల మంది కొవిడ్‌ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారని వార్తలు అంతర్జాతీయ మీడియాలో వస్తున్నా గత వారం రోజుల్లో కేవలం ఒకే ఒక్క మరణం చోటుచేసుందని చైనా ప్రకటించడం గమనార్హం. ఈ క్రమంలో శ్మశానాల (crematoriums) వద్ద భయానక పరిస్థితులు ఉన్నాయని.. మృతదేహాలతో కుటుంబీకులు బారులు తీరిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. చైనాలో కొవిడ్‌ మరణాల పరిస్థితిని తెలియజేస్తూ అమెరికాకు చెందిన ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు ఎరిక్‌ ఫీగల్‌ డింగ్‌  షేర్‌ చేసిన వీడియోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

చైనాలో కరోనా వైరస్‌ తీవ్రతపై ఆయన వరుస ట్వీట్‌లలో వివరించారు. ‘మృతదేహాలతో శ్మశానాల వద్ద బారులు తీరిన కుటుంబీకులు.. గంటలపాటు వేచిచూస్తున్న దారుణ పరిస్థితి. మరోవైపు ఆస్పత్రి మార్చురీలు నిండిపోయి.. కారిడార్లలోనే వరుసగా పెట్టిన మృతదేహాలు కనిపిస్తున్నాయ్‌’ అని పేర్కొంటూ అందుకు సంబంధించిన వీడియోలను షేర్‌ చేశారు. వచ్చే ఏడాది చివరి నాటికి అక్కడ 20లక్షల కొవిడ్‌ మరణాలు సంభవించవచ్చనే అంచనాలకు తాజా పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి.  ఇక ప్రతి నగరంలో రోజువారీ కొవిడ్‌ కేసుల సంఖ్య లక్షల్లో ఉంటోందని చెబుతున్నాయి.

కొవిడ్‌కు సంబంధించిన సమాచారం ఇలా బయటకు వస్తుంటే.. చైనా అధికారిక లెక్కలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. జీరో కొవిడ్‌ ఆంక్షలు ఎత్తివేసిన డిసెంబర్‌ 7 తర్వాత కేవలం ఏడుగురు మాత్రమే కొవిడ్‌తో మరణించారని అధికారికంగా వెల్లడించింది. ఇలా గత మూడేళ్ల నుంచి ఇప్పటివరకు మొత్తంగా 5241 మంది మాత్రమే చనిపోయినట్లు పేర్కొనడం గమనార్హం. ఇలా మరణాల సంఖ్యను గణించకపోవడం, తక్కువ చేసి చూపడం పట్ల ఇటీవల ఆందోళన వ్యక్తం చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. కచ్చితమైన సమాచారం ఇవ్వాలంటూ చైనాకు సూచించింది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని