UK Currency: కరెన్సీ నోట్లపై ‘బ్రిటన్‌ కింగ్‌’ ఛార్లెస్‌ III

బ్రిటన్‌లో కొత్త కరెన్సీ నోట్లు అందుబాటులోకి రానున్నాయి. రాణి ఎలిజబెత్‌ II మరణాంతరం నూతన రాజుగా బాధ్యతలు చేపట్టిన కింగ్‌ ఛార్లెస్‌ III ముఖ చిత్రంతో వీటిని రూపొందించనున్నారు. ఇందుకు సంబంధించిన నమూనా కరెన్సీని అక్కడి బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ విడుదల చేసింది.

Published : 21 Dec 2022 01:40 IST

లండన్‌: బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ II (Queen Elizabeth II) మరణం తర్వాత కింగ్‌ ఛార్లెస్‌ III (74) ఆ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా రాజు (King Charles III) ఫొటోతో కూడిన కొత్త కరెన్సీ నోట్లు అక్కడ చెలామణిలోకి రానున్నాయి. 5, 10, 20, 50 పౌండ్ల (Pound Sterling) నోట్లపై కింగ్‌ ఛార్లెస్‌ చిత్రంతో వాటిని ముద్రిస్తున్నారు. నమూనా నోట్లను బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ (Bank of England) విడుదల చేసింది. ఇవి 2024 నుంచి చలామణిలోకి వస్తాయని.. పాత నోట్లు కూడా చెల్లుబాటు అవుతాయని తెలిపింది.

‘కింగ్‌ ఛార్లెస్‌ III చిత్రంతో కూడిన బ్యాంకు నోట్లను విడుదల చేయడం గర్వంగా ఉంది. నోట్లపై కనిపించే రెండో రాజు ఈయనే. అందుకే ఇది ఎంతో అపురూపమైన క్షణం. 2024లో ఇవి చలామణిలోకి రానున్నాయి. వీటితోపాటు రాణి చిత్రం ఉన్న నోట్లు కూడా వినియోగంలో ఉంటాయి’ అని బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ (Bank of England) గవర్నర్‌ ఆండ్రూ బైలీ పేర్కొన్నారు.

బ్రిటన్‌లో గతంలో బ్యాంకు నోట్లను పేపర్‌తో తయారు చేయగా.. కొంత కాలంగా పాలిమర్‌ కరెన్సీ నోట్లను ముద్రిస్తున్నారు. ఇక కొత్తగా ప్రవేశపెట్టనున్న బ్యాంకు నోట్ల ముందు భాగంతోపాటు సెక్యూరిటీ విండోలోనూ రాజు (King Charles III) చిత్రం కనిపించేలా రూపొందించారు. పర్యావరణంతోపాటు ఆర్థిక వ్యవస్థపై తాజా మార్పు ప్రభావాన్ని తగ్గించేందుకుగానూ ప్రస్తుతం చిరిగిన నోట్ల స్థానంలోనే కొత్త వాటిని ప్రింట్‌ చేస్తున్నట్లు బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని