శుక్రగ్రహం ఎందుకు పొడిగా ఉందంటే..

భూమికి పొరుగునున్న శుక్రగ్రహం చాలా పొడిగా ఉంటుంది. దీనికి కారణాలను అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. అక్కడి వాతావరణంలోని హైడ్రోజన్‌.. అంతరిక్షంలోకి వెళ్లిపోతోందని వారు పేర్కొన్నారు.

Published : 08 May 2024 05:44 IST

గుర్తించిన తాజా అధ్యయనం

దిల్లీ: భూమికి పొరుగునున్న శుక్రగ్రహం చాలా పొడిగా ఉంటుంది. దీనికి కారణాలను అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. అక్కడి వాతావరణంలోని హైడ్రోజన్‌.. అంతరిక్షంలోకి వెళ్లిపోతోందని వారు పేర్కొన్నారు. నీరు ఏర్పడటానికి అవసరమైన రెండు మూలకాల్లో ఇదొకటి. రెండోది ఆక్సిజన్‌. ‘‘భూమి మీద నీరు మొత్తాన్నీ సేకరించి, ఈ గ్రహంపైన పరిస్తే 3 కిలోమీటర్ల లోతైన నీటి పొర ఏర్పడుతుంది. శుక్ర గ్రహం విషయంలో ఇలాగే చేస్తే నీరంతా గాల్లోకి వెళ్లిపోతుంది. నేలమీద 3 సెంటీమీటర్ల లోతైన నీటి పొర మాత్రమే మిగులుతుంది’’ అని పరిశోధనలో పాలుపంచుకున్న ఎరిన్‌ కాంగి చెప్పారు. శుక్రుడిపై ప్రస్తుతం అలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ గతంలో అనువైన వాతావరణమే ఉండేదని తెలిపారు. ‘‘దాదాపు 100 కోట్ల ఏళ్ల కింద ఈ గ్రహం ఏర్పడినప్పుడు దానిపై కూడా భూమి మీదున్న స్థాయిలో నీరు ఉండేది. అయితే అక్కడి వాతావరణంలోని కార్బన్‌ డైఆక్సైడ్‌ మేఘాల కారణంగా ఒకదశలో శక్తిమంతమైన గ్రీన్‌హౌస్‌ ప్రభావం తలెత్తింది. దీనివల్ల ఆ గ్రహంపై ఉష్ణోగ్రతలు 500 డిగ్రీల సెల్సియస్‌కు పెరిగిపోయాయి. ఫలితంగా అక్కడి నీరు మొత్తం ఆవిరై, అంతరిక్షంలోకి వెళ్లిపోయింది. అయితే నేడు శుక్ర గ్రహం ఎందుకంత పొడిగా ఉంది? లేదా ఇప్పటికీ ఆ గ్రహం ఎందుకు నీటిని కోల్పోతోందన్నదానిపై నాటి పరిణామం ఎలాంటి వివరణను ఇవ్వడంలేదు’’ అని ఎరిన్‌ తెలిపారు. తాజా అధ్యయనంలో కంప్యూటర్‌ సిమ్యులేషన్లను ఉపయోగించి అసలు విషయాన్ని కనుగొన్నట్లు చెప్పారు. శుక్రుడి ఎగువ వాతావరణంలో ఉన్న ఒక అణువు ఇందుకు కారణమని గుర్తించారు. కార్బన్‌ డైఆక్సైడ్‌తో నీరు కలిసినప్పుడు ఇది ఏర్పడుతుంది. దీన్ని హెచ్‌సీవో+గా అభివర్ణిస్తున్నారు. ఈ రేణువులకు ధనావేశం ఉండటం వల్ల వాతావరణంలోని ఎలక్ట్రాన్లతో బంధాన్ని ఏర్పరుస్తాయి. ఈ క్రమంలో హెచ్‌సీవో+ అణువులు.. రెండుగా విడిపోతాయి. ఈ ప్రక్రియలో హైడ్రోజన్‌ పరమాణువులు పూర్తిగా అంతరిక్షంలోకి జారుకుంటాయి. ఫలితంగా.. నీరు ఏర్పడటానికి అవసరమైన రెండు మూలకాల్లో ఒకటి అక్కడ లభ్యం కావడంలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు