USA: అమెరికాలో విమాన ప్రమాదం.. భారతీయ మూలాలున్న మహిళ మృతి..!

ఆదివారం న్యూయార్క్‌ సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో భారతీయ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె కుమార్తె తీవ్ర గాయాలతో చికిత్స పొందుతోంది. 

Updated : 07 Mar 2023 16:50 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికాలో జరిగిన ఓ విమాన ప్రమాదంలో భారతీయ మూలాలున్న మహిళ మరణించారు. ఆమె ప్రయాణిస్తున్న చిన్న విమానం ఆదివారం న్యూయార్క్‌ వద్ద ప్రమాదానికి గురైంది. డెమాన్‌స్ట్రేషన్‌ ఫ్లైట్‌లో భాగంగా తన కుమార్తెతోపాటు ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకొంది. 

రోమా గుప్తా (63), ఆమె కుమార్తె రేవా గుప్తా (33) వారి శిక్షకుడు కలిసి నాలుగు సీట్లు ఉన్న పైపర్‌ చెరోకీ విమానంలో లాంగ్‌ ఐలాండ్‌ నుంచి బయల్దేరారు. కానీ, విమానం కాక్‌పిట్‌లో పొగలు వ్యాపించాయి. దీంతో వారు తిరిగి అదే విమానాశ్రయానికి చేరుకొనే సమయంలో విమానం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో రోమా మరణించగా.. రేవా, 23 ఏళ్ల వయసున్న వైమానిక శిక్షకుడికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులు ప్రస్తుతం స్టోనీ బ్రూక్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ‘‘ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రమైన కాలిన గాయాలతో చికిత్స పొందుతున్నారు. కూలిపోయిన విమానంలో చిక్కుకుపోయిన వారిని ఒక పౌరుడు బయటకు లాగి కాపాడాడు’’ అని నార్త్‌ లిండెన్‌హర్స్ట్‌ ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌ చీఫ్‌ కెన్నీ స్టాలెన్‌ వెల్లడించారు. 

మౌంట్‌సినాయ్‌ సిస్టమ్స్‌లో రేవా ఫిజిషియన్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ప్రమాదానికి గురైన విమానం డెన్నీ వైజ్‌మెన్‌ ఫ్లైట్‌ స్కూల్‌కు చెందినదిగా గుర్తించారు. విమానం ఇటీవలే రెండు పూర్తి స్థాయి తనిఖీలు పూర్తి చేసుకొందని, శిక్షకుడికి కూడా పూర్తిస్థాయిలో  అనుభవం ఉందని పేర్కొన్నారు. రోమా,రేవా ప్రయాణించింది డెమాన్‌స్ట్రేషన్‌ ఫ్లైట్‌గా చెబుతున్నారు. ప్రజల ఆసక్తిని గమనించేందుకు దీనిని నిర్వహిస్తారని ఆ స్కూల్‌ పేర్కొంది. మరోవైపు సఫోల్క్‌ కౌంటీ పోలీసుల మాత్రం వీరు ప్రయాణించింది పర్యాటకుల విమానమని చెబుతున్నారు. విమానం దిశ కూడా సమీపంలోని దక్షిణ తీరాలవైపు ఉందన్నారు. కేబిన్‌లో పొగ వచ్చిందని పైలట్‌ ఏటీసీకి వెల్లడించాడంటున్నారు. మంగళవారం విమాన శకలాలను సేకరించి విశ్లేషణకు పంపారు.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని