Electricity: నేపాల్‌ నుంచి.. భారత్‌కు విద్యుత్‌ ఎగుమతి

మిగులు విద్యుత్తు (electricity)ను భారత్‌లోని విద్యుత్తు ఎక్స్ఛేంజిలకు విక్రయించాలని నేపాల్‌ (Nepal) నిర్ణయించింది. శనివారం నుంచే జలవిద్యుత్‌ ఎగుమతులను ప్రారంభించింది.

Published : 27 May 2023 20:29 IST

కాఠ్‌మాండూ: హిమాలయ దేశం నేపాల్‌ (Nepal)లో జల విద్యుత్‌ (Hydroelectricity) ఉత్పత్తి పెరగడంతో ఈ ఏడాది కూడా మిగులు నమోదైంది. దీంతో పొరుగుదేశమైన భారత్‌ (India)కు ఆ మిగులు విద్యుత్‌ ఎగుమతులను ప్రారంభించింది. ఈ మేరకు నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ అధికార ప్రతినిధి సురేశ్‌ భట్టరాయ్‌ వెల్లడించారు. శనివారం నుంచి భారత్‌కు 600 మెగావాట్ల విద్యుత్‌ విక్రయాలు మొదలుపెట్టినట్లు ఆయన తెలిపారు.

నేపాల్‌లోని హైడ్రోపవర్‌ ప్రాజెక్టు (hydropower projects)ల్లో అత్యధిక శాతం.. నదులపై ఆధారపడినవే. సాధారణంగా ఈ దేశంలో శీతాకాలంలో విద్యుత్‌కు డిమాండ్‌ ఎక్కువగా ఉండగా.. ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. కానీ, వేసవి సమయంలో డిమాండ్‌ తగ్గడంతో పాటు ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో మిగులు విద్యుత్‌ నమోదవుతుంది. గతేడాది కూడా నేపాల్‌ ఇలాగే జూన్‌ నుంచి నవంబరు వరకు భారత్‌కు జలవిద్యుత్‌ను ఎగుమతి చేసింది. తద్వారా దాదాపు రూ.1200 కోట్లను ఆర్జించింది.

భారత్‌ పర్యటనకు నేపాల్‌ ప్రధాని..

ఇదిలా ఉండగా.. నేపాల్‌ ప్రధాని పుష్ప కుమార్‌ దహల్ (Pushpa Kamal Dahal) ‘ప్రచండ’ వచ్చే వారంలో భారత పర్యటనకు రానున్నారు. మే 31 (బుధవారం) నుంచి నాలుగు రోజుల పాటు ఆయన భారత్‌లో పర్యటించనున్నారు. గతేడాది డిసెంబరులో ప్రచండ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విదేశీ పర్యటన చేపట్టడం ఇదే తొలిసారి. ప్రధానితో పాటు ఆయన కుమార్తె గంగా దహల్‌ కూడా భారత్‌కు రానున్నారు. భారత ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు ఆయన దిల్లీకి రానున్నట్లు నేపాల్ విదేశాంగ శాఖ వెల్లడించింది. పర్యటనలో భాగంగా ఆయన భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌, ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. దిల్లీతో పాటు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌, ఉజ్జయినీలో ఆయన పర్యటించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని