అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి

అమెరికాలోని శాన్‌ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్‌ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు.

Published : 27 Apr 2024 04:19 IST

న్యూయార్క్‌: అమెరికాలోని శాన్‌ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్‌ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. అరెస్టు సమయంలో సాహు తమను అడ్డుకొనేందుకు ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. ఈ నెల 21న ఈ సంఘటన జరిగింది. ఓ మహిళపై దాడి జరిగిందన్న ఫిర్యాదుతో పోలీసులు సాహు ఉంటున్న ప్రాంతానికి చేరుకున్నారు. ఓ 51 ఏళ్ల మహిళను సాహు ఉద్దేశపూర్వకంగా వాహనంతో ఢీకొని పారిపోయినట్లు తెలుసుకున్నారు. బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. కొన్ని గంటల అనంతరం ఘటనా స్థలానికి నిందితుడు చేరుకున్నారన్న సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆ సమయంలో తన బీఎండబ్ల్యూ ఎస్‌యూవీ వాహనంతో సాహు పోలీసులను ఢీకొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఓ పోలీసు అధికారికి గాయాలయ్యాయి. మరో అధికారి కాల్పులు జరిపారు. దీంతో సంఘటనా స్థలంలోనే ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సాహు ప్రాణాలు కోల్పోయారు. బైపోలార్‌ డిజార్డర్‌తో సాహు బాధపడుతున్నట్లు ఆయన మాజీ భార్య గోల్డ్‌స్టీన్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని