Ocean Gate Sub : టైటాన్ ప్రయాణం.. విషాదాంతమైందిలా!

సముద్ర గర్భంలో అధిక పీడనం కారణంగా టైటాన్‌ మినీ జలాంతర్గామి విచ్ఛిన్నం అయినట్లు రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టిన అమెరికా కోస్ట్‌గార్డ్‌ వెల్లడించింది.

Updated : 23 Jun 2023 13:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టైటానిక్‌ (Titanic) శిథిలాల సందర్శనకు కొందరు ఔత్సాహికులు చేసిన సాహసం విషాదాంతమైంది. కొన్ని గంటల్లోనే తిరిగి వస్తామని భావించిన ఆ ప్రయాణికుల కల చెదిరిపోయింది. వేల అడుగుల లోతులోకి వెళ్లిన ఐదుగురు సాహసప్రియులు.. జలాంతర్గామి విచ్ఛిన్నం కావడంతో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ క్రమంలో టైటాన్‌ మినీ జలాంతర్గామి (Titan Submarine) ప్రయాణం తీరును ఓసారి పరిశీలిస్తే..

  • సముద్ర గర్భంలో సుమారు 13వేల అడుగుల లోతులో ఉన్న టైటానిక్‌ శిథిలాలను చూసి వచ్చేందుకు టైటాన్‌ మినీ జలాంతర్గామికి సుమారు ఏడు గంటలు పడుతుంది. ఓషన్‌గేట్‌ నిర్వాహకులు ఆన్‌లైన్‌లో పేర్కొన్న సమాచారం ప్రకారం, ఆదివారం ఉదయం 8 గంటలకు (బ్రిటన్‌ కాలమాన ప్రకారం) టైటాన్‌ తన ప్రయాణాన్ని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ, కొన్ని కారణాలతో ఆ మధ్యాహ్నం 12 గంటలకు సముద్ర గర్భంలోకి దిగడం ప్రారంభించింది.
  • అలా వెళ్లిన 1.45 గంటల తర్వాత ఉపరితలంపై ఉన్న కమ్యూనికేషన్‌ వ్యవస్థతో టైటాన్‌ తన సంబంధాలను కోల్పోయింది. సాయంత్రం 7 గంటల వరకు నీటి ఉపరితలానికి తిరిగి చేరుకోవాల్సి ఉండగా అలా జరగలేదు. ఈ ప్రయాణాన్ని పర్యవేక్షిస్తున్న ఉపరితంలపై ఉన్న పోలార్‌ ప్రిన్స్‌ నౌక.. టైటాన్‌ ఆచూకీ లభించడం లేదనే విషయాన్ని రాత్రి 9.30 గంటలకు అమెరికా కోస్ట్‌ గార్డుకు తెలియజేసింది. దీంతో యూఎస్‌ కోస్ట్‌గార్డ్‌ ఆధ్వర్యంలో రెస్క్యూ ఆపరేషన్‌ మొదలైంది.
  • సోమవారం ఉదయం రంగంలోకి దిగిన అమెరికా, కెనడా విమానాలు, నౌకలతోపాటు ఇతర ప్రైవేటు నౌకలు కూడా రెస్క్యూలో పాల్గొన్నాయి. సోనార్‌ బాయిస్‌ల సహాయంతో నీటి అడుగున అన్వేషణ కొనసాగించాయి. 4వేల మీటర్ల (12వేల అడుగుల) లోతులో పర్యవేక్షించే సామర్థ్యం వీటికి ఉంది.
  • మంగళవారం మధ్యాహ్నం.. తాము కూడా రెస్క్యూలో సాయం చేస్తామని ఫ్రాన్స్‌ ప్రకటించింది. అత్యంత లోతుకు వెళ్లగలిగే అటలాంటే (Atalante) రోబో దోహదపడుతుందని తెలిపింది. అదే రోజు సముద్ర గర్భంలో కొన్ని శబ్దాలను కెనడా ఎయిర్‌క్రాఫ్ట్‌ గుర్తించింది. ప్రతి 30 నిమిషాలకు ఒకసారి ఇవి వినిపిస్తున్నట్లు చెప్పింది.
  • బుధవారం రెస్క్యూ ఆపరేషన్‌ మరింత ముమ్మరమైంది. అమెరికా కోస్ట్‌గార్డుతో పాటు యూఎస్‌ నేవీ, కెనడా కోస్ట్‌ గార్డ్‌, ఓషన్‌గేట్‌ సిబ్బంది కూడా ఆపరేషన్‌పై పట్టుసాధించాయి. అదేరోజు సముద్రగర్భంలో మళ్లీ కొన్ని శబ్దాలు వినిపిస్తున్నట్లు గుర్తించారు. ఆ ప్రాంతానికి  ఆర్‌ఓవీ (రీమోట్లీ ఆపరేటెడ్‌ వెహికిల్‌)ను తరలించి గాలింపు చేపట్టారు. అదేరోజు సాయంత్రం ఫ్రాన్స్‌ రోబో కూడా రెస్క్యూ ప్రదేశానికి చేరుకుంది.
  • గురువారం ఉదయానికి రెస్క్యూ ఆపరేషన్‌ కీలక ఘట్టానికి చేరుకుంది. మినీ జలాంతర్గామిలో ఉన్న ఆక్సిజన్‌ కొన్ని గంటలకే సరిపడా ఉండటంతో ప్రపంచమంతా ఈ ఆపరేషన్‌పై ఉత్కంఠ నెలకొంది. మధ్యాహ్నం 12 గంటలకు రెండు ఆర్‌ఓవీలను రంగంలోకి దించారు.
  • కొంత సేపటికి రెస్క్యూ ప్రాంతానికి వైద్యుల బృందంతో కూడిన కెనడా నేవీ నౌక చేరుకుంది. సెర్చ్‌ చేస్తున్న ప్రాంతంలోనే శకలాలు కనుగొన్నామని 3.48 గంటలకు అమెరికా కోస్ట్‌గార్డ్‌ వెల్లడించింది. అనంతరం మరికొన్ని గంటలకు మీడియా సమావేశం నిర్వహించి.. టైటాన్‌ విచ్ఛిన్నం కావడంతో అందులోని ఐదుగురు ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చని ప్రకటించింది. మినీ జలాంతర్గామి తోక భాగంతో పాటు ల్యాండింగ్‌ ఫ్రేమ్‌లు లభ్యం కావడంతో అది విచ్ఛిన్నమైందనే నిర్ధారణకు వచ్చామని తెలిపింది. అయితే, అందులో ఐదుగురి శరీర భాగాలకు సంబంధించి మాత్రం ఎటువంటి ఆచూకీ లభించలేదు.
  • టైటాన్‌ మినీ జలాంతర్గామిలో ఓషన్‌గేట్‌ సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి స్టాక్టన్‌ రష్‌, ఆయనతో పాటు వెళ్లిన షెహ్‌జాదా దావూద్‌, సులేమాన్‌ దావూద్‌, హమీష్‌ హర్డింగ్‌, పాల్‌ హెన్రీలు ప్రాణాలు కోల్పోయినట్లు ‘ఓషన్‌గేట్‌ ఎక్స్‌పెడిషన్స్‌’ కూడా ప్రకటించింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని