Pakistan: గుణపాఠం నేర్చుకున్నాం.. భారత్తో శాంతిని కోరుకుంటున్నాం : పాకిస్థాన్ ప్రధాని
మూడు యుద్ధాలు చేసిన తర్వాత పాకిస్థాన్ (Pakistan) గుణపాఠం నేర్చుకుందని ఆ దేశ ప్రధానమంత్రి షెహబాజ్ (Shehbaz Sharif) షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ తరుణంలో భారత్తో పాక్ శాంతిని కోరుకుంటోందని.. ఇందులో భాగంగా చర్చలు జరిపేందుకు సిద్ధమని పేర్కొన్నారు.
ఇస్లామాబాద్: ఆర్థిక సంక్షోభంతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న పాకిస్థాన్ (Pakistan).. తమకు సహాయం చేయాలని ప్రపంచ దేశాలను వేడుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్తో మూడుసార్లు యుద్ధాలు చేసిన తర్వాత పాకిస్థాన్ గుణపాఠం నేర్చుకుందని అంగీకరించారు. అంతేకాకుండా పొరుగు దేశంతో శాంతిని కోరుకుంటున్నట్లు వెల్లడించిన ఆయన.. కశ్మీర్లో జరుగుతున్న వాటిని మాత్రం ఆపాలని సూచించారు. దుబాయ్ కేంద్రంగా పనిచేసే ఓ వార్తా ఛానల్తో మాట్లాడిన పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్.. ఇరు దేశాల మధ్య నెలకొన్న వివాదాలపై నిజాయితీగా చర్చలు జరగాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పిలుపునిచ్చారు.
‘భారత నాయకత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నా సందేశం ఏమిటంటే.. ఇరు దేశాల మధ్య ఎంతో కాలంగా నడుస్తోన్న కశ్మీర్ వంటి వివాదాలపై నిజాయితీ, నిబద్ధతతో చర్చలు జరుపుదాం. శాంతియుతంగా జీవనం సాగిస్తూ ప్రగతి సాధించడం లేదా ఒకరికొకరు తగువులాడుతూ సమయం, వనరులను వ్యర్థం చేసుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంది’ అని భారత్ను ఉద్దేశిస్తూ పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
‘భారత్తో మేం మూడు యుద్ధాలు చేశాం. వాటితో ప్రజలకు చివరకు మిగిలింది పేదరికం, వేదన, నిరుద్యోగం మాత్రమే. మేం గుణపాఠం నేర్చుకున్నాం. భారత్తో శాంతిని కోరుకుంటున్నాం. దీంతో మా దేశంలో నెలకొన్న అసలు సమస్యలను పరిష్కరించుకునేందుకు వీలు కలుగుతుంది’ అని పాక్ ప్రధాని అన్నారు. ఉభయదేశాల దగ్గర ఇంజినీర్లు, డాక్టర్లు, నైపుణ్యం కలిగిన కార్మికులు ఉన్నారన్న ఆయన.. దక్షిణాసియా కోసం ఈ వనరులను ఉపయోగించుకొని ఇక్కడ శాంతిని నెలకొల్పాలని కోరుకుంటున్నామని చెప్పారు. తద్వారా రెండు దేశాలు ప్రగతిని సాధించవచ్చని అభిప్రాయపడ్డారు. బాంబులు, మందుగుండు సామగ్రి వంటివాటిపై తమ వనరులను వృథా చేసుకోవాలని కోరుకోవడం లేదని పాక్ ప్రధాని పేర్కొన్నారు.
మరోవైపు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాకిస్థాన్ తమ పౌరులకు కనీస నిత్యావసర వస్తువులను కూడా సబ్సిడీ కింద అందించలేకపోతోంది. ఇతర వస్తువుల ధరలు రికార్డు స్థాయిలో పెరగడమే కాకుండా గోధుమ పిండి కోసం ప్రజలు కొట్లాడుకుంటున్న పరిస్థితులు తలెత్తాయి. మరోపక్క తెహ్రీక్-ఎ-తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) నుంచి కూడా తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. ఇలా వివిధ రూపాల్లో సవాళ్లను ఎదుర్కొంటున్న పాకిస్థాన్కు.. విదేశాల నుంచి సహాయం మాత్రం అంతంతగానే అందుతోంది. ఇటువంటి దారుణ పరిస్థితుల్లో శాంతిపేరుతో భారత్తో చర్చలు జరిపేందుకు సిద్ధమని ప్రకటిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్