US Shooting: అమెరికా ఫిలడెల్ఫియాలో కాల్పులు.. ముగ్గురి మృతి

అగ్రరాజ్యంలో మరోసారి తుపాకుల మోత మోగింది! ఫిలడెల్ఫియాలోని సౌత్‌ స్ట్రీట్‌లో వారాంతాన్ని ఆస్వాదిస్తున్న జనంపై గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. మరో 11 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు...

Published : 05 Jun 2022 23:45 IST

వాషింగ్టన్‌: అగ్రరాజ్యంలో మరోసారి తుపాకుల మోత మోగింది! ఫిలడెల్ఫియాలోని సౌత్‌ స్ట్రీట్‌లో వారాంతాన్ని ఆస్వాదిస్తున్న జనంపై గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. మరో 11 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఒక మహిళ ఉన్నట్లు పోలీసు అధికారి డీఎఫ్‌ పేస్ స్థానిక మీడియాకు వెల్లడించారు. వారాంతంతోపాటు ఫిలడెల్ఫియా ప్రైడ్‌ సంబరాల సందర్భంగా శనివారం రాత్రి వందలాది పౌరులు వీధుల్లోకి చేరుకున్నారు. ఈ క్రమంలోనే.. కాల్పుల ఘటన జరిగినట్లు పేస్‌ తెలిపారు.

ఈ ఘటనలో అనేక మంది దుండగుల పాత్ర ఉందని, వారు వేర్వేరుగా జనాలపై కాల్పులు జరుపుతుండగా తమ సిబ్బంది గమనించారని చెప్పారు. ఓ నిందితుడిపై సిబ్బంది కాల్పులు జరిపారని.. అయితే, అతనికి తగిలిందా లేదా అనేది అస్పష్టంగా ఉందన్నారు. ఘటనాస్థలం నుంచి రెండు తుపాకులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుల గుర్తింపునకు సీసీ కెమెరా ఫుటేజీలు పరిశీలించాల్సి ఉందని చెప్పారు. ఆ ప్రాంతంవైపు వెళ్లొద్దని పౌరులకు సూచనలు జారీ చేశారు. అంతకుముందు.. శుక్రవారం రాత్రి సైతం నగరంలో తొమ్మిది వేర్వేరు కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నట్లు ఓ వార్తాసంస్థ వెల్లడించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని