Nancy Pelosi: డ్రాగన్‌ హెచ్చరిక బేఖాతరు.. తైవాన్‌లో అడుగుపెట్టిన నాన్సీ పెలోసీ!

తైవాన్‌ అంశంలో అమెరికా- చైనా దేశాల మధ్య వివాదం తారస్థాయికి చేరింది. అగ్రరాజ్యం అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ ఆసియా పర్యటన నేపథ్యంలో......

Updated : 02 Aug 2022 22:04 IST

తైపీ: తైవాన్‌ అంశంలో అమెరికా- చైనా దేశాల మధ్య వివాదం తారస్థాయికి చేరింది. అగ్రరాజ్యం అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ ఆసియా పర్యటన నేపథ్యంలో ఈ వివాదం మరింత ముదిరింది. తైవాన్‌లో అడుగుపెడితే అమెరికా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని డ్రాగన్‌ హెచ్చరించిన నేపథ్యంలో నాన్సీ పెలోసీ తైపీ విమానాశ్రయంలో అడుగు పెట్టారు. నాన్సీ పెలోసీ తైపీలో పర్యటన విషయంలో వెనక్కి తగ్గేదే లే అంటూ అమెరికా తేల్చి చెప్పడంతో చైనా సైన్యం దూకుడుగా వ్యవహరిస్తోంది. చైనా యుద్ధ విమానాలు తైవాన్‌ జలసంధి దాటినట్లు స్థానికంగా వార్తలు వెలువడుతున్నాయి. పెలోసీ తైవాన్‌ పర్యటనపై చైనా మొదటి నుంచీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. ఈ పరిణామలతో అమెరికా- చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో చైనాకు చెందిన ఎస్‌యూ-35 యుద్ధ విమానాలు తైవాన్‌ స్ట్రెయిట్‌ను దాటి వెళ్లినట్టు సీజీటీఎన్‌ పేర్కొంది. మరోవైపు, నాన్సీ పెలోసీ తైవాన్‌ పర్యటన అత్యంత ప్రమాదకరమని చైనా మండిపడుతోంది.  అయితే, డ్రాగన్‌ హెచ్చరికలతో అప్రమత్తమైన అమెరికా.. నాన్సీ పెలోసీ పర్యటనకు ముందే అక్కడ నాలుగు యుద్ధ నౌకలను తైపీ సమీపంలోని సముద్ర జలాల్లో మోహరించినట్టు తెలుస్తోంది.

నా పర్యటన అమెరికా నిబద్ధతను చాటుతోంది: పెలోసీ ట్వీట్‌
తన పర్యటన.. తైవాన్ ప్రజాస్వామ్యానికి మద్దతు విషయంలో అమెరికా నిబద్ధతను చాటుతోందని నాన్సీ పెలోసీ ట్వీట్‌ చేశారు. నిరంకుశత్వం, ప్రజాస్వామ్యాల మధ్య ఏదో ఒకదాన్ని ఎంచుకోవాల్సి వస్తోన్న ప్రస్తుత తరుణంలో.. తైవాన్‌లోని 23మిలియన్ల మంది ప్రజలకు అమెరికా సంఘీభావం ఇప్పుడు చాలా ముఖ్యమని అన్నారు. ‘తైవాన్ నాయకత్వంతో చర్చలు.. మా మద్దతును పునరుద్ఘాటిస్తాయి. స్వేచ్ఛాయుత ఇండో- పసిఫిక్ ప్రాంత అభివృద్ధి, ఉమ్మడి ప్రయోజనాల దిశగా సాగుతాయి’ అని పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని