
తాజా వార్తలు
బేకరీ దొంగలు.. బెంగాల్లో దొరికారు!
హైదరాబాద్: జూబ్లీహిల్స్లో బేకరీ చోరీ ఘటనలో ముగ్గురు నిందితులను జూబ్లీహిల్స్ నేరపరిశోధన విభాగ పోలీసులు అరెస్ట్ చేశారు. ఠాణాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్రెడ్డి డిఐ రమేష్, డీఎస్ఐ హరీశ్వర్రెడ్డి, క్రైం సిబ్బందితో కలిసి వివరించారు.
అస్సాంలోని మాట్ల సుల్తార్పర ప్రాంతానికి చెందిన, వెంకటగిరిలో నివసించే సొహిదుల్ ఇస్లాం(23) వాక్స్ బేకరీలో కాపలాదారుగా పనిచేస్తున్నాడు. గతంలో ఇదే బేకరీలో పనిచేసిన అస్సాంవాసి అలీముద్దీన్ షేక్(23), అతని సోదరుడు అక్సుదుల్ అలీ(19)తో కలిసి పథకం ప్రకారం ఈ నెల 18న బేకరీ యజమాని అమర్ చౌదరి అల్మారాలో పెట్టిన రూ.7లక్షలు దొంగిలించాడు. ముగ్గురు కలిసి విజయవాడకు చేరుకొని అక్కడి నుంచి బస్సులో కోల్కతకు బయలుదేరారు. సాంకేతికంగా వీరి జాడ గుర్తించిన పోలీసులు విమానంలో ముందుగానే కోల్కతకు చేరుకున్నారు. బస్సులో వెళుతున్న ఈ ముగ్గురిని పట్టుకున్నారు. వారి నుంచి రూ.6.43లక్షలను స్వాధీనం చేసుకున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. కేసును ఛేదించిన నేర పరిశోధన విభాగ అధికారులు, సిబ్బందిని ఇన్స్పెక్టర్ రాజశేఖర్రెడ్డి అభినందించారు.