
తాజా వార్తలు
హత్యకు కుట్ర భగ్నం
● 23 నాటు బాంబులు స్వాధీనం
● ఆరుగురి అరెస్టు
నాటు బాంబులను పరిశీలిస్తున్న ఎస్పీ సత్యఏసుబాబు
అనంత నేరవార్తలు, న్యూస్టుడే: నాటు బాంబులతో ప్రతికార హత్యలకు కుట్రపన్నారు. కుట్ర జరుగుతుందని తెలియడంతో పోలీసులు అప్రమత్తమై భగ్నం చేసి, నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ సత్యఏసుబాబు వివరాలను వెల్లడించారు. కనగానపల్లి మండలం వారాదికొట్టాలకు చెందిన ఈ.గోపాల్ వివాహేతర సంబంధం కారణంగా 2010లో హత్యకు గురయ్యాడు. ఈ కేసులో ఇ.చంద్రశేఖర్, ఇ.గంగాధర్తో పాటు మరి కొందరు నిందితులుగా ఉన్నారు. ఆ తర్వాత 2019లో కంబదూరు మండలం రాళ్ల అనంతపురం సమీపంలో మందుపాతర పేల్చి ఇ.దుర్గప్పను హత్య చేశారు. దుర్గప్ప ప్రస్తుతం అరెస్టైన రాజశేఖర్, రామచంద్రకు సమీప బంధువులు. గోపాల్, దుర్గప్పను హతమార్చిన నిందితులు చంద్రశేఖర్, గంగాధర్పై ప్రతికారం తీర్చుకోవాలని, లేదంటే తమకు ప్రాణహాని తప్పదని భావించారు. ఇందులో రాజశేఖర్ తల్లి ముత్యాలమ్మ ప్రోద్బలం కూడా ఉంది.
వ్యూహరచన ఇలా..
రాజశేఖర్, రామచంద్ర కలిసి హత్యకు వ్యూహరచన చేశారు. చంద్రశేఖర్, గంగాధర్ను చంపాలని కనగానపల్లి మండలం వేపకుంటకు చెందిన హరితో చర్చించారు. జిల్లా కేంద్రంలో ఉంటున్న సిండికేట్ నగర్కు చెందిన నగేష్, పాపంపేటకు చెందిన నగేష్తో నాటు బాంబుల తయారీ కోసం ముడి సరకు సమకూర్చుకున్నారు. తిప్పేపల్లి శివారులోని లింగరాజు తోటలో నాటు బాంబులు తయారు చేయించారు. ఈ క్రమంలో పోలీసులకు సమాచారం రావడంతో అనంతపురం సీసీఎస్ డీఎస్పీ మహబూబ్బాషా, కళ్యాణదుర్గం సీఐ శివశంకర్నాయక్, కంబదూరు ఎస్సై రాజేష్ ప్రత్యేక బృందంగా ఏర్పడి ఆరుగురు నిందితులను తిప్పేపల్లి గ్రామ శివారులో పట్టుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో అప్రమత్తంగా వ్యవహరించి, సమర్థంగా పనిచేసిన అధికారులను ఎస్పీ సత్యఏసుబాబు ప్రశంసించారు.
అరెస్టైన వారు
అరెస్టయిన వారిలో ఇ.రాజశేఖర్ (తిప్పేపల్లి, కంబదూరు మండలం), దేవరకొండ రామచంద్ర(వేపకుంట, కనగానపల్లి మండలం), లింగరాజు(తిప్పేపల్లి, కంబదూరు మండలం), వి.హరి(వేపకుంట, కనగానపల్లి మండలం), వి.నగేష్(సిండికేట్నగర్, అనంతపురం), వి.నగేష్(పాపంపేట, అనంతపురం) ఉన్నారు.