
తాజా వార్తలు
హౌస్మోషన్ పిటిషన్ దాఖలు చేసిన ఎస్ఈసీ
అమరావతి: ఏపీలో పరిషత్ ఎన్నికలను నిలుపుదల చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) డివిజన్ బెంచ్లో సవాల్ చేసింది. ఈ మేరకు హౌస్మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై అత్యవసరంగా విచారణ జరపాల్సిందిగా న్యాయస్థానాన్ని కోరింది. దీనిపై కాసేపట్లో విచారణ ప్రారంభమయ్యే అవకాశముంది.
ఎస్ఈసీ తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ తెదేపా, భాజపా, జనసేన వేసిన పిటిషన్లపై మంగళవారం మధ్యాహ్నం ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. పోలింగ్కు నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్ అమలు కావాలంటూ సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందంటూ పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆ నిబంధనలను బేఖాతరు చేస్తూ పదవీ బాధ్యతలు చేపట్టగానే ఎస్ఈసీ తాజాగా నోటిఫికేషన్ ఇవ్వడం.. వెంటనే ఎన్నికల ప్రక్రియ ప్రారంభించారనే అభ్యంతరాలను హైకోర్టు ముందుంచారు. ప్రధానంగా సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయకపోడాన్ని ప్రస్తావించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ఉన్నత న్యాయస్థానం.. పరిషత్ ఎన్నికలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.