ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలిక

ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్‌ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు.

Updated : 26 Apr 2024 07:42 IST

దాతలు ఆదుకోవాలని తల్లిదండ్రుల వినతి

ఈనాడు, హైదరాబాద్‌: ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్‌ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఇప్పటికే చికిత్స కోసం రూ.40 లక్షల వరకు ఖర్చుచేసి ఆర్థికంగా చితికిపోయారు. ఇప్పుడు మరో రూ.20 లక్షలు అవసరమని వైద్యులు చెప్పడంతో ఏంచేయాలో దిక్కుతోచక ఆదుకునే చేతుల కోసం అర్థిస్తున్నారు. హైదరాబాద్‌ ఎల్‌బీనగర్‌లో ఉంటున్న ఎ.రఘు, మంజుల దంపతులకు ఇద్దరు కుమార్తెలు. రఘు ఓ ప్రైవేటు కంపెనీ ఉద్యోగి. సాఫీగా సాగిపోతున్న వారి జీవితంలో పెద్ద కుదుపు. మూడో తరగతి చదువుతున్న పెద్ద కుమార్తె వేదవల్లికి 2022 నవంబరులో తీవ్ర జ్వరం వచ్చింది. వైద్యులకు చూపిస్తే మందులు ఇచ్చారు. పది రోజులు గడిచినా జ్వరం తగ్గలేదు. ఆ చిన్నారి ఆరోగ్యం క్రమేపీ క్షీణిస్తుండటంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అనేక పరీక్షల అనంతరం ఆమెకు రక్త క్యాన్సర్‌గా వైద్యులు ధ్రువీకరించారు. అయితే అది ఏ తరహా క్యాన్సర్‌ అనేది నిర్ధరించేందుకు ముంబయిలోని టాటా మెమోరియల్‌ క్యాన్సర్‌ ఆసుపత్రికి రిఫర్‌ చేశారు. అక్కడ ఆమెకు అత్యంత అరుదైన ‘అనాప్లాస్టిక్‌ లార్జ్‌ సెల్‌ లింఫోమా’ నాలుగో దశలో ఉన్నట్లు గుర్తించారు. సాధారణంగా 60 ఏళ్లు పైబడిన పురుషుల్లో ఎక్కువగా బయటపడే ఈ వ్యాధి చిన్నారికి సోకడంతో వైద్యులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ముంబయి వైద్యుల సూచనల మేరకు వేదవల్లిని మళ్లీ హైదరాబాద్‌ తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే అత్యంత క్లిష్టమైన కీమోథెరపీతోపాటు రేడియేషన్‌ 5 సైకిల్స్‌ పూర్తిచేశారు. తర్వాత వైద్యుల సూచనలతో బోన్‌మ్యారో మార్పిడి కూడా చేశారు. ఇప్పుడు పాపకు అధునాతన ‘కార్‌ టి సెల్‌ థెరపీ’ చేయాలని వైద్యులు సూచించినట్లు చిన్నారి తండ్రి రఘు తెలిపారు. ఇప్పటికే పాప చికిత్స కోసం తమవద్ద ఉన్నదంతా పెట్టేయడంతో పాటు బంధువులు, స్నేహితుల వద్ద అప్పులు తీసుకొని వెచ్చించారు. ఇకముందు చికిత్సకు తన వద్ద ఏమీలేదని, సాయం చేసే చేతులే తమ బిడ్డను ఆదుకోవాలని రఘు కన్నీటి పర్యంతమవుతూ అర్థిస్తున్నారు. సాయం చేయాలనుకునే దాతలు ఫోన్‌ నం.70326 42552ను సంప్రదించగలరు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని