
తాజా వార్తలు
క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ అభిప్రాయం
సిడ్నీ: టీమిండియా ప్రస్తుత బౌలింగ్ కన్నా ఆస్ట్రేలియా బౌలింగ్ అత్యుత్తమంగా ఉందని ఆ జట్టు మాజీ సారథి రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. టెస్టు ఛాంపియన్షిప్లో భారత్ అగ్రస్థానానికి చేరుకోవడంలో బౌలర్లు కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే, ఆసీస్ బౌలింగ్ త్రయం ఎలాంటి పరిస్థితుల్లోనైనా రాణించగలదని.. అందుకే టీమిండియా కన్నా ఆ జట్టు బౌలింగే బాగుందని పాంటింగ్ పేర్కొన్నాడు. ‘భారత జట్టు అద్భుతంగా ఉంది. బుమ్రా, షమి కొన్నేళ్లుగా బాగా రాణిస్తున్నారు. వారికి ఉమేశ్యాదవ్, ఇషాంత్శర్మ జత కలిశారు. దీంతో టీమిండియా బౌలింగ్ పటిష్టంగా మారింది. ఇక అశ్విన్, జడేజాలను కలుపుకొంటే.. ఆ బౌలింగ్ అటాక్ మరింత బాగుంటుంది’ అని వివరించాడు.
‘అయితే, భారత స్పిన్నర్లు ఆసీస్ గడ్డపై ఇబ్బంది పడతారు. వారి కన్నా ఆసీస్ బౌలర్ నాథన్ లైయన్కు ఇక్కడ మంచి రికార్డు ఉంది. అలాగే మిచెల్ స్టార్క్ బౌలింగ్లో వైవిధ్యం ఉంటుంది. అది నాకెంతో ఇష్టం. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే ఆసీస్ జట్టే పైచేయి సాధిస్తుంది’ అని పాంటింగ్ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా ఇటీవల బంగ్లాదేశ్ను 2-0తో మట్టి కరిపించిన టీమిండియా టెస్టు ఛాంపియన్షిప్లో 360 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. తాజాగా ఆసీస్.. పాకిస్థాన్పై 2-0తో టెస్టు సిరీస్ గెలుపొంది 176 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.