
తాజా వార్తలు
అంగారకుడిపై జీవం ఉండే అవకాశం..
కొంతకాలం సజీవంగా సూక్ష్మజీవులు
బెర్లిన్: భూమిపై ఉన్న కొన్ని రకాల సూక్ష్మజీవులు అంగారకుడిపై జీవించే అవకాశాలున్నాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా, జర్మన్ ఏరోస్పేస్ సెంటర్ సంయుక్తంగా ఈ పరిశోధనలు నిర్వహించారు. ఇటీవల దీనికి సంబంధించిన పరిశోధనా పత్రాలు ఫ్రంటైర్స్ ఇన్ మైక్రోబయాలజీ జర్నల్లో ప్రచురితమయ్యాయి. భూమిపై కాకుండా ఇతర గ్రహాలపై జీవం నిలిచి ఉంటుందా లేదా అన్న అంశంపై వీరు పరిశోధనలు నిర్వహించారు. రానున్న రోజుల్లో మనం ఎక్కువగా అంగారకుడిపైకి ప్రయోగాలు నిర్వహించనున్న నేపథ్యంలో ఆయా పరిస్థితులను కృత్రిమంగా నెలకొల్పి ఈ పరిశోధనలు నిర్వహించినట్లు పరిశోధకులు వెల్లడించారు. భూమి స్ట్రాటో ఆవరణంలో అంగారక గ్రహంపై ఉన్న పరిస్థితులను కల్పించి ఈ పరిశోధనలు నిర్వహించినట్లు వారు వెల్లడించారు. కొన్ని రకాల ఫంగస్ల నుంచి సేకరించిన సూక్ష్మజీవులు యూవీ రేడియేషన్ను దాటుకొని జీవించగలిగాయని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన మార్టా ఫిలిపా కార్టెసావ్ పేర్కొన్నారు. ‘‘అంగారకునిపై జీవం ఎలా ఉంటుందో పరిశీలించకపోతే అక్కడికి వెళ్లే వ్యోమగాములు ప్రమాదంలో పడతారు. ఇతర గ్రహాలపై జీవం పెరగాలన్నా, ఆహారం తయారవ్వాలన్నా సూక్ష్మజీవులే కీలకం. మనలాగే సూక్ష్మజీవులు కూడా.’’ అని మరో పరిశోధకురాలు కాథరీనా సెయిమ్స్ అన్నారు.
రెండు బుడగల్లో అంగారక గ్రహంపై పరిస్థితులు, ఉష్ణోగ్రతలు కృత్రిమంగా సృష్టించి సూక్ష్మజీవులను అందులో ప్రవేశపెట్టామని పరిశోధకులు వెల్లడించారు. ఒక బుడగను రేడియేషన్ను తట్టుకొనేలా, మరొకటి సాధారణంగా తయారుచేసి భూమి స్ట్రాటో ఆవరణలో ప్రవేశపెట్టినట్లు వారు తెలిపారు. రేడియేషన్ ద్వారా ఇవి వెళ్లినపుడు వాటిలో వచ్చే మార్పులను అధ్యయనం చేశామన్నారు. అన్ని పరిస్థితుల్లో ఇవి ఏ విధంగా స్పందిస్తున్నాయో పరిశీలించామని వారు తెలిపారు. ఈ ప్రయోగంలో పరీక్షించిన అన్ని సూక్ష్మజీవుల్లో ఆస్పెర్గిల్లస్ నైగర్ అనే ఒక రకమైన సూక్ష్మజీవులు మాత్రమే సజీవంగా ఉన్నట్టు గుర్తించామని వారు వెల్లడించారు.