
తాజా వార్తలు
దూసుకొస్తున్న నివర్ తుపాను
అమరావతి: తమిళనాడు-పుదుచ్చేరి మధ్య తీరం దాటనున్న నివర్ తుపాను దూసుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. ప్రస్తుతం ఇది పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 410 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి ఆగ్నేయంగా 450 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. కొద్దిగంటల్లో తుపానుగా తరువాత 12 గంటల్లో తీవ్ర తుపానుగాను మారుతుందని వాతావరణశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
25 తేదీ సాయంత్రం ఇది తమిళనాడు లోని మమాళ్ల్లపురం- కరైకల్ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్టు ఐఎండీ అంచనా వేస్తోంది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని అంచనా వేస్తున్నారు. తుపాను కారణంగా కడలూరు, విల్లుపురం, పుదుచ్చేరిలోని తీరప్రాంత జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల్లోకి సముద్రపునీరు చొచ్చుకొని వచ్చే అవకాశముందని ఐఎండీ వివరించింది. తమిళనాడు తీరంలో ముందుజాగ్రత్తగా రెండు కోస్టు గార్డు నౌకలు, ఎన్డీఆర్ ఎఫ్ బృందాలను మోహరించారు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఇవాళ్టి నుంచే తమిళనాడులోని కోస్తా జిల్లాలు సహా దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్ల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. 26వ తేదీ నుంచి తెలంగాణలోను భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది