బైపీసీ దారిలో భేషైన కోర్సులు!

బయాలజీతో ఇంటర్మీడియట్‌ చేస్తే తర్వాత ఏం చేయాలి? ఆలోచిస్తే డాక్టర్‌ కోర్సులు తప్ప వేరే ఏమీ వెంటనే తోచవు. వాస్తవానికి కాస్త పరిశీలిస్తే ఇతర విభాగాలు ఎన్నో కనిపిస్తాయి. మెడికల్‌ రంగం అంటే ఒక్క వైద్యులే కాదు. వారితోపాటు ఎంతోమంది పనిచేస్తుంటారు. ఆ అనుబంధ ఉద్యోగాలన్నింటినీ చాలా వరకు బైపీసీ  కొనసాగింపు కోర్సుల ఆధారంగానే భర్తీ చేస్తారు. వాటితోపాటు అగ్రికల్చర్‌ వంటి ఇతర మార్గాలు ఉన్నాయి.

Published : 09 Apr 2020 00:25 IST

ఇంటర్‌ తర్వాత?

బయాలజీతో ఇంటర్మీడియట్‌ చేస్తే తర్వాత ఏం చేయాలి? ఆలోచిస్తే డాక్టర్‌ కోర్సులు తప్ప వేరే ఏమీ వెంటనే తోచవు. వాస్తవానికి కాస్త పరిశీలిస్తే ఇతర విభాగాలు ఎన్నో కనిపిస్తాయి. మెడికల్‌ రంగం అంటే ఒక్క వైద్యులే కాదు. వారితోపాటు ఎంతోమంది పనిచేస్తుంటారు. ఆ అనుబంధ ఉద్యోగాలన్నింటినీ చాలా వరకు బైపీసీ  కొనసాగింపు కోర్సుల ఆధారంగానే భర్తీ చేస్తారు. వాటితోపాటు అగ్రికల్చర్‌ వంటి ఇతర మార్గాలు ఉన్నాయి.

బైపీసీ గ్రూప్‌తో ఇంటర్‌ పరీక్షలు పూర్తయిన తర్వాత ఏం చేయాలి? చాలామంది విద్యార్థుల దృష్టి ప్రధానంగా వైద్యవిద్యపైనే ఉంటుంది. ఇంకొందరు సంబంధిత సబ్జెక్టులతో ఉన్న డిగ్రీల వైపు వెళతారు. ఇవే కాకుండా ఇంకా ఎన్నో దారులు ఉన్నాయి. పలు సంస్థలు అందిస్తున్న విభిన్నమైన కోర్సులు చేయవచ్చు.


మెడికల్‌ కోర్సులు

వైద్యవిద్య అనగానే గుర్తొచ్చేది ఎంబీబీఎస్‌ (బ్యాచిలర్‌ ఆఫ్‌ మెడిసిన్‌ అండ్‌ బ్యాచిలర్‌ ఆఫ్‌ సర్జరీ). ఏడాది ఇంటర్న్‌షిప్‌తో కలిపి కోర్సు కాలవ్యవధి అయిదున్నరేళ్లు. దంత వైద్యంపై ఆసక్తి ఉన్నవారికి బ్యాచిలర్‌ ఆఫ్‌ డెంటల్‌ సర్జరీ (బీడీఎస్‌) ఉంది. ఇది నాలుగేళ్ల కోర్సు. నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (నీట్‌) ద్వారా వీటిలోకి ప్రవేశాలను కల్పిస్తారు. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) దీన్ని నిర్వహిస్తోంది. ఈ రెండూ కాస్త ఖర్చుతో కూడుకున్న కోర్సులు. ప్రత్యామ్నాయంగా వైద్యరంగంలోనే డిగ్రీని ప్రసాదించే ఆయుష్‌ కోర్సులూ ఉన్నాయి. ఆయుర్వేద (బీఏఎంఎస్‌), నేచురోపతి (బీఎన్‌వైఎస్‌), యునానీ (బీయూఎంఎస్‌), సిద్ధ (బీఎస్‌ఎంఎస్‌), హోమియోపతి (బీహెచ్‌ఎంఎస్‌) వైద్యాలన్నింటినీ కలిపి ఆయుష్‌ కోర్సులంటారు. వీటికీ నీట్‌ ద్వారానే ప్రవేశాలను కల్పిస్తారు.


నర్సింగ్‌

తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు నర్సింగ్‌ కోర్సులను అందిస్తున్నాయి. సాధారణంగా ఏఎన్‌ఎం (యాక్సిలరీ నర్సింగ్‌ మిడ్‌వైఫరీ), జీఎన్‌ఎం (జనరల్‌ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌వైఫరీ), బీఎస్‌సీ నర్సింగ్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మొదటి రెండు కోర్సులను ఏ గ్రూపు వారైనా ఎంచుకోవచ్చు. బీఎస్‌సీ నర్సింగ్‌కు మాత్రం ఇంటర్‌లో బైపీసీ చదివినవారే అర్హులు. అన్ని కోర్సుల్లోకెల్లా బీఎస్‌సీ నర్సింగ్‌కు ప్రాధాన్యమెక్కువ. జాతీయ, రాష్ట్ర స్థాయుల్లో ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేటు విద్యాసంస్థలు బీఎస్‌సీ నర్సింగ్‌లో ప్రవేశాలను కల్పిస్తున్నాయి. జాతీóŸస్థాయిలో ఎయిమ్స్‌ వంటి సంస్థలు ప్రవేశపరీక్షలను నిర్వహిస్తున్నాయి. రాష్ట్ర స్థాయిలో మెరిట్‌ లేదా ప్రవేశపరీక్ష ఆధారంగానే ప్రవేశాలు కల్పిస్తున్నాయి. బీఎస్‌సీ నర్సింగ్‌ తర్వాత ప్రాధాన్యం ఉన్న కోర్సు జీఎన్‌ఎం. దీనికి చివరి అడ్మిషన్లు 2020లో మాత్రమే జరుగుతాయి. 2021 నుంచి ఈ కోర్సు ఉండదు. కాలవ్యవధి మూడేళ్లు. ఏఎన్‌ఎం కోర్సు కాలవ్యవధి రెండేళ్లు. ఇది చేసినవారు గ్రామీణ ప్రాంతాల్లో చిన్నారులు, మహిళలు, వృద్ధులకు అవసరమైన ప్రాథమిక వైద్యసేవలను అందిస్తారు.


పారామెడికల్‌

అనారోగ్యం వస్తే అందరూ సంప్రదించేది వైద్యులనే. కానీ ఆ వైద్యులకు రోగ నిర్థారణ, చికిత్సల్లో సాయమందించేవారు పారామెడికల్‌ సిబ్బంది. రోగ నిర్ధారణ పరీక్షలు, స్కానింగ్‌, ఎక్స్‌రేలు, అల్ట్రాసౌండ్‌, అనస్తీషియా, ఎంఆర్‌ఐ తదితరమైనవి ఈ విభాగం కిందికి వస్తాయి. వీటికి సంబంధించి రెండు రకాల కోర్సులు- బ్యాచిలర్‌ డిగ్రీ, డిప్లొమాలు అందుబాటులో ఉన్నాయి. డిప్లొమా కోర్సుల కాలవ్యవధి రెండేళ్లు; బ్యాచిలర్‌ కోర్సులకు మూడేళ్లు. బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆక్యుపేషనల్‌ థెరపీ (బీఓటీ), ఆడియాలజీ అండ్‌ స్పీచ్‌ థెరపీ, ఫిజియోథెరపీ, ఆపరేషన్‌ థియేటర్‌ టెక్నాలజీ, డయాలసిస్‌ టెక్నాలజీ, మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ, అనస్తీషియా టెక్నాలజీ, ఆప్టోమెట్రీ, రేడియాలజీ, ఎక్స్‌రే టెక్నాలజీ, మెడికల్‌ రికార్డ్‌ టెక్నాలజీ మొదలైన కోర్సులు అందుబాటులో ఉన్నాయి. చాలావరకూ సంస్థలు మెరిట్‌ ఆధారంగానే ప్రవేశాలు కల్పిస్తున్నాయి. కొన్ని ప్రముఖ సంస్థలు మాత్రం ప్రవేశపరీక్ష నిర్వహించి, వాటిలో సాధించిన మార్కుల ఆధారంగా అడ్మిషన్లు ఇస్తున్నాయి.


ఫార్మసీ

బీ ఫార్మసీ, ఫార్మా-డీ కోర్సులకు ఎంసెట్‌ ర్యాంకు ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. బీఫార్మసీ కాలవ్యవధి నాలుగేళ్లు. దీన్ని పూర్తిచేసినవారు ఫార్మసిస్ట్‌, డ్రగిస్ట్‌, పేషెంట్‌ కౌన్సెలింగ్‌/ ఫార్మా సంస్థల్లో ప్రొడక్షన్‌, క్వాలిటీ విభాగాల్లో ఉద్యోగావకాశాలను పొందవచ్చు. ఔషధ వినియోగం, వ్యాధి నిర్ధారణ చికిత్స, ఔషధ ప్రతికూల ప్రభావాల సేకరణ, పర్యవేక్షణకు సంబంధించిన అంశాల గురించి చదివేది ఫార్మా-డీ. దీని కాలవ్యవధి ఆరేళ్లు.


బీఎస్‌సీ దిశగా..!

బైపీసీ తరువాత డిగ్రీ కోర్సులు అనగానే బయాలజీ, జువాలజీ, కెమిస్ట్రీ వంటి సంప్రదాయ కోర్సులే గుర్తుకువస్తాయి. కానీ బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, బయో ఇన్ఫర్మాటిక్స్‌, అగ్రికల్చర్‌ జియాలజీ, జెనెటిక్స్‌, ఫోరెన్సిక్‌ సైన్స్‌, ఫుడ్‌ టెక్నాలజీ, హోంసైన్స్‌, కమ్యూనిటీ సైన్స్‌, స్పోర్ట్స్‌ అండ్‌ ఫిట్‌నెస్‌, క్లినికల్‌ మైక్రోబయాలజీ, ఆక్వాకల్చర్‌, ఫిషరీస్‌ అండ్‌ వైల్డ్‌ సైన్సెస్‌, ఫారెస్ట్రీ, న్యూట్రిషన్‌ అండ్‌ డైటెటిక్స్‌ మొదలైన స్పెషలైజ్‌డ్‌ కోర్సులూ అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో చాలావరకూ మెరిట్‌ ఆధారంగానే ప్రవేశాలున్నాయి. చాలాకొద్ది సంస్థలు ఎంచుకున్న కోర్సునుబట్టి ప్రవేశపరీక్ష నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తున్నాయి.


అగ్రికల్చర్‌

వ్యవసాయ, దాని అనుబంధ రంగాలది దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రధాన పాత్ర.
* వ్యవసాయ ఉత్పాదకతను పెంచే పద్ధతులు, ఆధునిక సాంకేతిక పరికరాలు మొదలైనవాటిపై ఆసక్తి ఉన్నవారు బీఎస్‌సీ అగ్రికల్చర్‌ను ఎంచుకోవచ్చు. ఈ కోర్సు సీట్లను ఎంసెట్‌ ద్వారా భర్తీ చేస్తారు. చేపల పెంపకం, సేకరణ పద్ధతులపై ఆసక్తి ఉన్నవారికి బీఎస్‌సీ ఫిషరీస్‌ అనుకూలం. పశువులు, కోళ్లు, బాతుల పెంపకం, వాటి పోషణ, అభివృద్ధి, ఆహారం, పోషణ ప్రమాణాలు మొదలైనవాటి గురించి బీవీఎస్‌సీ- యానిమల్‌ హజ్బెండరీలో తెలుసుకోవచ్చు. ఈ కోర్సులకు ఎంసెట్‌ ర్యాంకు ఆధారంగా ప్రవేశాలను కల్పిస్తారు.
* తోటలు, ఉద్యానవనాలపై ఆసక్తి ఉన్నవారు బీఎస్‌సీ హార్టికల్చర్‌ను ఎంచుకోవచ్చు. హార్టిసెట్‌ ద్వారా దీనిలో ప్రవేశం పొందవచ్చు.
* ముడి పట్టును ఉత్పత్తి చేసే పట్టు పురుగులకు సంబంధించిన కోర్సు- బీఎస్‌సీ సెరీకల్చర్‌. పట్టు పురుగుల పెంపకం, సిల్క్‌ గ్రేడింగ్‌, సీడ్‌ టెక్నాలజీ వంటివి ఇందులో భాగంగా ఉంటాయి. ఈ కోర్సుకు చాలావరకూ సంస్థలు నేరుగానే ప్రవేశాలు కల్పిస్తున్నాయి. కొద్ది సంస్థలు మాత్రం ప్రవేశపరీక్షలను నిర్వహిస్తున్నాయి.

ఇంకా.. దేశంలో వివిధ వ్యవసాయ విశ్వవిద్యాలయాలు వ్యవసాయం, దాని అనుబంధ విభాగాల్లో అందించే కోర్సులకు రాష్ట్రాలవారీగా పరీక్షలుంటాయి. కానీ దేశంలోని ప్రతి సంస్థలోనూ ఆయా డిగ్రీలవారీగా 15-25% సీట్లను జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్షలతో భర్తీ చేస్తారు. కొన్ని జాతీయ సంస్థల్లో మొత్తం సీట్లకూ ఈ స్కోరే ప్రమాణికం. అందులో ప్రముఖమైనది ఐకార్‌ (ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ అగ్రికల్చరల్‌ రిసెర్చ్‌) నిర్వహించే పరీక్ష. దీని ద్వారా ప్రవేశం పొందినవారికి ప్రతినెలా స్టైపెండ్‌నూ అందిస్తారు. దేశంలోని 74 వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో 15% యూజీ సీట్లకు పోటీ పడటానికి  ఈ పరీక్ష రాయడం తప్పనిసరి. దీని ద్వారా మొత్తం 11 రకాల బ్యాచిలర్‌ డిగ్రీ కోర్సుల్లో చేరవచ్చు.


పదో తరగతి తర్వాత ఇంటర్మీడియట్‌లో బైపీసీ తీసుకోవాలని భావించేవారూ ఈ రంగాలపై అవగాహన పెంచుకోవాలి. అప్పుడే స్పష్టమైన ప్రణాళికతో కెరియర్‌ను నిర్మించుకోవడం సాధ్యమవుతుంది.


ఈ ఏడాది నుంచి ఎయిమ్స్‌, జిప్‌మర్‌ ప్రవేశపరీక్షలను రద్దు చేసి, ఎయిమ్స్‌ల్లోని 1207 సీట్లనూ, జిప్‌మర్‌ల్లోని 200 సీట్లనూ నీట్‌ ర్యాంకు ద్వారానే భర్తీ చేయనున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని