తీర రక్షకదళంలో కొలువుదీరతారా?
350 నావిక్, యాంత్రిక్ పోస్టులు కేంద్ర రక్షణ శాఖ పరిధిలోని భారతీయ తీర రక్షకదళం (ఇండియన్ కోస్ట్గార్డ్) 350 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
350 నావిక్, యాంత్రిక్ పోస్టులు కేంద్ర రక్షణ శాఖ పరిధిలోని భారతీయ తీర రక్షకదళం (ఇండియన్ కోస్ట్గార్డ్) 350 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా విద్యార్హతలతో వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. అన్ని విభాగాల్లోనూ కలిపి 350 ఖాళీలు ఉన్నాయి. రాత, శరీర దార్ఢ్య, వైద్య పరీక్షల ద్వారా నియామకాలు చేపడతారు. ఎంపికైనవారికి శిక్షణ అందిస్తారు. అనంతరం వీరు నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్, నావిక్ జనరల్ డ్యూటీ, యాంత్రిక్ విభాగాల్లో సేవలు అందిస్తారు. వేతనం ఆకర్షణీయం. దశలవారీగా వృత్తిలో పదోన్నతులకూ అవకాశం ఉంది.
ఇండియన్ కోస్టు గార్డు ఏటా దాదాపు రెండు సార్లు నావిక్ (జనరల్ డ్యూటీ, డొమెస్టిక్ బ్రాంచ్), యాంత్రిక్ పోస్టుల భర్తీకి ప్రకటనలు వెలువరిస్తోంది. వీటికి పురుషులే అర్హులు. నాలుగు దశల్లో నిర్వహించే పరీక్షలతో నియామకాలుంటాయి.
నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్: ఈ విభాగంలో 30 ఖాళీలు ఉన్నాయి. వీటికి పదో తరగతి విద్యార్హతతో పోటీ పడవచ్చు.
నావిక్ జనరల్ డ్యూటీ: 260 ఖాళీలు ఉన్నాయి. వీటికి మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణులు అర్హులు.
యాంత్రిక్: ఈ పోస్టులకు ఎలక్ట్రికల్ /మెకానికల్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ (రేడియో/పవర్) విభాగాల్లో ఎందులోనైనా మూడేళ్ల డిప్లొమా కోర్సు పూర్తిచేసుకున్నవారు అర్హులు. మెకానికల్లో 25, ఎలక్ట్రికల్ 20, ఎలక్ట్రానిక్స్ 15 ఖాళీలున్నాయి.
వయసు: పై మూడు పోస్టులకూ 18 నుంచి 22 ఏళ్లలోపు ఉండాలి. అంటే మే 1, 2002 - ఏప్రిల్ 30, 2006 మధ్య జన్మించినవారు అర్హులు. అన్ని పోస్టులకూ ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు వర్తిస్తుంది.
శిక్షణ, వేతనం
నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్, జనరల్ డ్యూటీ, యాంత్రిక్ విభాగాలవారికి ప్రాథమిక శిక్షణ మే, 2024 నుంచి ఐఎన్ఎస్ చిల్కలో ప్రారంభమవుతుంది. అనంతరం సంబంధిత కేంద్రాల్లో ట్రేడ్ శిక్షణ నిర్వహిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారిని ఉద్యోగంలోకి తీసుకుంటారు.
యాంత్రిక్ ఉద్యోగాలకు ఎంపికైనవారికి రూ.29,200 మూలవేతనం చెల్లిస్తారు. దీంతోపాటు రూ.6200 యాంత్రిక్ పే ఉంటుంది. ఉద్యోగంలో చేరిన మొదటి నెల నుంచే వీరు సుమారు రూ.50,000 వరకు అందుకోవచ్చు. పదోన్నతుల ద్వారా అసిస్టెంట్ చీఫ్ ఇంజినీర్ హోదా వరకు చేరుకోవచ్చు.
నావిక్ పోస్టుల్లో చేరినవారికి రూ.21,700 మూలవేతనం చెల్లిస్తారు. అన్ని ప్రోత్సాహకాలతో వీరు రూ.35 వేలకుపైగా వేతన రూపంలో పొందవచ్చు. భవిష్యత్తులో ప్రధానాధికారి హోదా వరకు చేరుకోవచ్చు.
నావిక్ డొమెస్టిక్ బ్రాంచీకి ఎంపికైనవారు కుక్, స్టివార్డ్ సేవలు అందిస్తారు. నావిక్ జీడీ విభాగంలో చేరినవారు వారికి కేటాయించిన ట్రేడుల్లో విధులు నిర్వర్తించాలి. యాంత్రిక్ ఉద్యోగులు షిప్ నిర్వహణ, మరమ్మతులు వారి డిప్లొమా బ్రాంచీల ప్రకారం చూసుకుంటారు.
ఆన్లైన్ పరీక్ష
అన్ని పోస్టులకూ ఆన్లైన్ ఆబ్జెక్టివ్ పరీక్షలు నిర్వహిస్తారు. రుణాత్మక మార్కులు లేవు. నాలుగు ఆప్షన్ల నుంచి సరైన సమాధానం గుర్తించాలి. మొత్తం 5 సెక్షన్లలో ప్రశ్నలు అడుగుతారు.
అన్ని పోస్టులకూ సెక్షన్-1 ఉమ్మడిగా ఉంటుంది. ఈ విభాగంలో ప్రశ్నలు పదో తరగతి స్థాయిలోనే వస్తాయి. మొత్తం 60 మార్కులకు 60 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో మ్యాథ్స్ 20, సైన్స్ 10, ఇంగ్లిష్ 15, రీజనింగ్ 10, జీకే 5 ప్రశ్నలుంటాయి. పరీక్ష వ్యవధి 45 నిమిషాలు.
నావిక్ డొమిస్టిక్ బ్రాంచ్ పోస్టులకు పోటీ పడేవాళ్లు ఈ ఒక్క సెక్షన్ రాసుకుంటే సరిపోతుంది.
నావిక్ జనరల్ డ్యూటీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారు సెక్షన్-2 అదనంగా రాయాలి. ఈ విభాగానికి 50 మార్కులు. 50 ప్రశ్నలు వస్తాయి. వ్యవధి 30 నిమిషాలు. ఇంటర్ సిలబస్ నుంచి మ్యాథ్స్, ఫిజిక్స్ ఒక్కో సబ్జెక్టులో 25 చొప్పున ప్రశ్నలు అడుగుతారు.
యాంత్రిక్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారు సెక్షన్-1తో పాటు సెక్షన్ 3, 4, 5ల్లో తాము చదివిన డిప్లొమా బ్రాంచీ ప్రకారం ఏదో ఒకటి రాయాలి.
ఎలక్ట్రికల్ విభాగంవాళ్లు సెక్షన్-3, ఎలక్ట్రానిక్స్ బ్రాంచీవారు సెక్షన్-4, మెకానికల్ డిప్లొమా అభ్యర్థులు సెక్షన్-5లో ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ఒక్కో సెక్షన్కూ 50 మార్కులు. 50 ప్రశ్నలు వస్తాయి. వీటికి వ్యవధి 30 నిమిషాలు. అభ్యర్థులు ఎంచుకున్న బ్రాంచీలవారీ డిప్లొమా సిలబస్ నుంచే ఈ ప్రశ్నలు అడుగుతారు.
సెక్షన్ల వారీ సిలబస్ వివరాలు కోస్టు గార్డు వెబ్సైట్లో ఉన్నాయి. ప్రతి సెక్షన్లోనూ కనీస మార్కులు పొందడం తప్పనిసరి. జనరల్ అభ్యర్థులు సెక్షన్-1లో 30, మిగిలిన సెక్షన్లలో 20 చొప్పున మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీలు సెక్షన్-1లో 27, మిగిలిన సెక్షన్లలో 17 చొప్పున మార్కులు పొందితే అర్హులగా పరిగణిస్తారు. ఇలా అర్హత సాధించినవారి జాబితా నుంచి మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం ఖాళీలకు అనుగుణంగా స్టేజ్-2కు ఎంపిక చేస్తారు.
స్టేజ్-2 పరీక్షలు
వీటిని ఒకటి లేదా రెండు రోజుల వ్యవధితో నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధిస్తే సరిపోతుంది. మార్కులు ఉండవు. ఇందులో భాగంగా 7 నిమిషాల్లో 1.6 కి.మీ.దూరం పరుగెత్తాలి. 20 గుంజీలు, 10 పుష్అప్స్ తీయగలగాలి. అభ్యర్థి ఎత్తు కనీసం 157 సెం.మీ. ఉండాలి. ఊపిరి పీల్చక ముందు, పీల్చిన తర్వాత ఛాతీ కొలత వ్యత్యాసం కనీసం 5 సెం.మీ. తప్పనిసరి.
స్టేజ్-3 ఎంపిక
ఇది స్టేజ్-1, స్టేజ్-2లో చూపిన ప్రతిభతో ఉంటుంది. స్టేజ్-2లో అర్హత సాధించినవారిని స్టేజ్-1 మెరిట్తో స్టేజ్-3కి ఎంపిక చేస్తారు. వీరికి ఐఎన్ఎస్ చిల్కలో వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో అర్హులు తర్వాతి దశకు చేరతారు. స్టేజ్-4లో భాగంగా అభ్యర్థుల ఒరిజినల్ ధ్రువపత్రాలు పరిశీలించి, అన్నీ సరిగా ఉంటే శిక్షణకు తీసుకుంటారు.
ముఖ్య సమాచారం
ఆన్లైన్ దరఖాస్తులు: సెప్టెంబరు 22 సాయంత్రం 5:30 వరకు స్వీకరిస్తారు.
ఫీజు: రూ.300. ఎస్సీ, ఎస్టీలు చెల్లించ నవసరం లేదు.
పరీక్షలు: స్టేజ్-1 డిసెంబరులో నిర్వహిస్తారు.స్జేజ్-2 జనవరిలో, స్టేజ్-3 ఏప్రిల్ చివర లేదా మే ప్రారంభంలో ఉంటాయి.
స్టేజ్-1 పరీక్ష కేంద్రాలు: తెలంగాణలో.. హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్. ఏపీలో.. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, కాకినాడ.
వెబ్సైట్: https://joinindiancoastguard.cdac.in/
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
డ్రగ్ తయారీ మాఫియా గుట్టురట్టు.. 300 కేజీలు స్వాధీనం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
పోరాడి ఓడిన ముంబయి.. దిల్లీ ఖాతాలో ఐదో విజయం
-
టాప్లో ప్రభాస్ మూవీ.. ప్రేక్షకులు వీటి కోసమే వేచి చూస్తున్నారట
-
లోన్ యాప్ వేధింపులకు బీటెక్ విద్యార్థి బలి
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..