ఎన్‌ఐటీల్లో ఎంసీఏ

దేశంలో సాంకేతిక విద్యకు ఐఐటీల తర్వాత ఎన్‌ఐటీలదే పేరు! వీటిలో చాలా సంస్థలు ఎంసీఏ కోర్సునూ అందిస్తున్నాయి. ఉమ్మడి పరీక్షతో ప్రవేశం కల్పిస్తున్నాయి. ఇందుకోసం ఏటా...

Published : 07 Apr 2022 00:44 IST

దేశంలో సాంకేతిక విద్యకు ఐఐటీల తర్వాత ఎన్‌ఐటీలదే పేరు! వీటిలో చాలా సంస్థలు ఎంసీఏ కోర్సునూ అందిస్తున్నాయి. ఉమ్మడి పరీక్షతో ప్రవేశం కల్పిస్తున్నాయి. ఇందుకోసం ఏటా జాతీయ స్థాయిలో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఎంసీఏ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (నిమ్‌సెట్‌) నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎంసీఏ చదవడానికీ ఈ స్కోరే ప్రామాణికం. అలాగే ఇతర సంస్థలూ ఈ స్కోరుతో అవకాశం కల్పిస్తున్నాయి. ఇటీవలే నిమ్‌సెట్‌ -2022 ప్రకటన వెలువడిన నేపథ్యంలో ఆ వివరాలు చూద్దాం!

నిమ్‌సెట్‌తో 9 నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌)ల్లో ప్రవేశం లభిస్తుంది. వీటిలో వరంగల్‌ ఒకటి. దేశీయ, విదేశీ ఐటీ సంస్థల అవసరాల ప్రకారం ఇక్కడి ఎంసీఏ సిలబస్‌ను రూపొందిస్తారు. అన్ని సంస్థలూ ఉమ్మడి కరిక్యులమ్‌ అనుసరిస్తాయి. ఈ ఏడాది నిమ్‌సెట్‌ను నిట్‌, జంషెడ్‌పూర్‌ నిర్వహిస్తోంది. నిట్‌ల్లో ఎంసీఏ కోర్సు వ్యవధి మూడేళ్లు. అయితే నిట్‌, వరంగల్‌ రెండేళ్లు కోర్సు అనంతరం వైదొలిగే అవకాశాన్నీ కల్పిస్తోంది. రెండేళ్ల చదువు విజయవంతంగా పూర్తిచేసుకున్నవారికి పోస్టు గ్రాడ్యుయేట్‌ అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా ఇన్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ డిగ్రీని ప్రదానం చేస్తుంది.

అర్హత: మ్యాథ్స్‌ లేదా స్టాటిస్టిక్స్‌ ఒక సబ్జెక్టుగా బీఎస్సీ, బీసీఏ, బీఐటీ, బీ వొక్‌(కంప్యూటర్‌ సైన్స్‌/ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌)ల్లో ఏదైనా కోర్సు చదివుండాలి లేదా ఏ బ్రాంచీలోనైనా బీటెక్‌/ బీఈ పూర్తిచేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏ కోర్సు చదివినప్పటికీ కనీసం 60 శాతం మార్కులు (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 55 శాతం) తప్పనిసరి. చివరి సంవత్సరం కోర్సుల్లో ఉన్నవారూ అర్హులే.

నిట్‌లలో సీట్ల వివరాలు: అగర్తలా- 30, అలహాబాద్‌ - 116, భోపాల్‌ - 115, జంషెడ్‌పూర్‌ - 115, కురుక్షేత్ర - 96 (వీటిలో 32 సెల్ఫ్‌ ఫైనాన్స్‌), రాయ్‌పూర్‌ - 110, సూరత్కల్‌ - 58, తిరుచురాపల్లి - 115, వరంగల్‌ - 58  

పరీక్ష ఇలా...

పరీక్ష వ్యవధి రెండు గంటలు. మొత్తం 120 ప్రశ్నలుంటాయి. ప్రశ్నపత్రం ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది. మ్యాథమేటిక్స్‌ నుంచి 50 ప్రశ్నలు, ఎనలిటికల్‌ ఎబిలిటీ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌ నుంచి 40, కంప్యూటర్‌ అవేర్‌నెస్‌ నుంచి 10, జనరల్‌ ఇంగ్లిష్‌ నుంచి 20 ప్రశ్నలడుగుతారు. ప్రతి సరైన జవాబుకు 4 మార్కులు. తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికీ ఒక మార్కు తగ్గిస్తారు.

సీట్ల కేటాయింపు: మెరిట్‌, రిజర్వేషన్ల ప్రాతిపదికన ఉమ్మడి కౌన్సెలింగ్‌ ద్వారా సీట్లను కేటాయిస్తారు. నిట్‌ల వారీగా విడిగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. రాష్ట్రాల వారీ కోటా ఉండదు. హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎంసీఏ చదవాలనుకున్నవారు ఈ స్కోరుతో ఆ సంస్థకు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి. ప్రైవేటు విద్యాసంస్థలు సైతం ఈ స్కోరుతో ఎంసీఏ కోర్సులోకి అవకాశం కల్పిస్తున్నాయి.

మార్కుల వెయిటేజీ: మొత్తం మార్కులను 1000గా పరిగణిస్తారు. అంటే మ్యాథ్స్‌ మొత్తం మార్కులకు 3 రెట్లు, ఎనలిటికల్‌ ఎబిలిటీ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌ మార్కులకు ఒకటిన్నర రెట్లు, కంప్యూటర్‌ అవేర్‌నెస్‌ విభాగంలో మార్కులకు 2 రెట్లు, ఇంగ్లిష్‌ మార్కులను యథావిధిగా ఉంచి లెక్కిస్తారు. ఈ లెక్కన మ్యాథ్స్‌ విభాగానికి 600 (50 ప్రశ్నలు, ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు కాబట్టి మొత్తం 200 మార్కులు. వీటికి 3 రెట్లు అంటే 600 మార్కులు) అలాగే ఎనలిటికల్‌ ఎబిలిటీ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌ 240 (మొత్తం 40 ప్రశ్నలు, ప్రతి ప్రశ్నకు 4 మార్కులు కాబట్టి 160 మార్కులు. వీటికి ఒకటిన్నర రెట్లు అంటే 160+80=240 మార్కులు), కంప్యూటర్‌ అవేర్‌నెస్‌ 80 (10 ప్రశ్నలకు 40 మార్కులు దానికి రెట్టింపు 80), ఇంగ్లిష్‌ విభాగానికి 80 (20 ప్రశ్నలు. ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు కాబట్టి 80) మార్కులు కేటాయించారు.


ముఖ్య తేదీలు

ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ: మే 4 సాయంత్రం 5 గంటల వరకు
పరీక్ష తేది: జూన్‌ 20 మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.1250. మిగిలిన అందరికీ రూ.2500
వెబ్‌సైట్‌: https://www.nimcet.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని