Memory Tips: చదివింది మర్చిపోతున్నారా.. ఇవిగో మెమొరీ టిప్స్‌!

ఎంత కష్టపడి చదివినా కొందరు త్వరగా మరిచిపోతుంటారు. అలాంటి వారికి పరీక్షల సమయంలో ఇబ్బంది రాకుండా ఉండాలంటే నిపుణులు సూచించే కొన్ని టిప్స్‌ ఇవే..

Published : 04 Mar 2024 12:44 IST

Memory Tips | ఏమాత్రం సమయం వృథా చేయకుండా ఎప్పుడు చూసినా చదువుతూనే ఉంటారు కొందరు విద్యార్థులు. కానీ, కొద్ది రోజులకే నేర్చుకున్నదంతా మర్చిపోతుంటారు. దీంతో పరీక్షలు దగ్గరపడేసరికి తీవ్ర ఒత్తిడికి గురై ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్యకు నిపుణులు సూచిస్తున్న కొన్ని టిప్స్‌ ఇవే.. 

  • చదివే ప్రదేశాన్ని నిశ్శబ్దంగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండేలా చూసుకోవాలి. ఇలా ఉంటే మీ దృష్టిని పూర్తిగా చదివే అంశం మీదే కేంద్రీకరించడానికి వీలవుతుంది. చదివింది గుర్తుండాలంటే ఏకాగ్రత చాలా ముఖ్యం. ఏకాగ్రత నిలవాలంటే ప్రశాంతమైన వాతావరణం ఎంతో అవసరం. అందువల్ల ప్రశాంతంగా ఉండే ప్రదేశాన్ని ఎంచుకుని చదవడం అలవాటు చేసుకోండి.
  • మీ దగ్గరున్న సమాచారాన్ని చిన్న పదాలు, వాక్యాలుగా విభజించుకోవచ్చు. పదాల్లోని మొదటి అక్షరాన్ని గుర్తుంచుకుంటే మొత్తం పదం, ఆ తర్వాత సంబంధిత వాక్యం వెంటనే గుర్తొచ్చే అవకాశం ఉంటుంది.
  • సబ్జెక్టుల్ని బట్టీపట్టడానికే ప్రాధాన్యం ఇవ్వొద్దు.  అర్థంచేసుకుంటూ చదివితే ఎక్కువ కాలంపాటు గుర్తుండిపోతుంది. సమాచారం అంతటినీ ఒకేసారి చదివి గుర్తుపెట్టుకోవాలని అనుకోవద్దు.  వ్యాసాన్ని చిన్నచిన్న భాగాలుగా విభజించుకుని చదివితే గుర్తుంచుకోవడం సులువు.
  • కొన్ని పేర్లను వాటి వెనుక ఉండే అంతర్‌సూత్రం ఆధారంగా చదివితే ఎక్కువ కాలం గుర్తుంటాయి. ఉదాహరణకు రాష్ట్రాల పేర్లను ఆల్ఫాబెటికల్‌ క్రమంలో గుర్తుపెట్టుకోవచ్చు. ఇలాచేస్తే మధ్యలో ఏ ఒక్క రాష్ట్రం పేరునూ మర్చిపోయే అవకాశం ఉండదు. అలాగే గ్రహాల పేర్లను వాటి పరిమాణం ఆధారంగా చిన్నవాటి నుంచి పెద్దవాటిని గుర్తుపెట్టుకోవచ్చు.
  • ప్రముఖుల పేర్లను గుర్తుంచుకునే క్రమంలో వారి రూపాన్ని జ్ఞాపకం పెట్టుకోవడం అలవాటు చేసుకోండి. ఆ పేరున్న వ్యక్తి ఇలా ఉంటారు.. అని ఒకసారి అనుకుంటే.. సంబంధిత వ్యక్తి ఫోటో చూడగానే వారి పేరు టక్కున గుర్తుకొస్తుంది.
  • పాఠాలను ఎప్పుడూ పరీక్షల దృష్టితోనే చదవకండి. ఇష్టంగా చదివితే నేర్చుకోవడం ఎప్పుడూ కష్టంగా ఉండదని తెలుసుకోండి. నేర్చుకోవడంలోని ముఖ్యోద్దేశం.. పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవడమే కాకూడదు.
  • కొత్త విషయాలను తెలుసుకోవాలనే జిజ్ఞాస ఎప్పుడూ మీలో ఉండాలి. అలాగైతే పాఠాలేవీ విసుగ్గా అనిపించవు. కొత్త విషయాలనూ ఎంతో ఇష్టంగా నేర్చుకోగలుగుతారు.
  • విద్యా సంవత్సరం ప్రారంభ సమయంలో కొన్ని పాఠాలను చదువుతారు. తిరిగి సంవత్సరాంతంలో మాత్రమే మళ్లీ వాటిని చదువుతారు కొందరు. అలాకాకుండా సమయం ఉన్నప్పుడు మధ్యలో ఒకసారి సమీక్షించుకుంటే మంచిది. దీంతో అవన్నీ మీకు ఎంతవరకు గుర్తున్నాయో తెలుస్తుంది. మర్చిపోతే మళ్లీ ఒకసారి చదవడానికి అవకాశం ఉంటుంది.
  • ప్రతి పాఠంలోని ముఖ్యాంశాలతో నోట్సు రాయడాన్ని అలవాటు చేసుకోండి. పరీక్షల ముందు వీటిని ఒకసారి చదువుకుంటే ఒత్తిడికి గురికాకుండా ఉంటారు. అలాగే చదివిన వాటిని ఎప్పటికప్పుడు చూడకుండా రాయడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల విషయం ఎంతవరకు గుర్తుందో తెలుస్తుంది. సగం మాత్రమే గుర్తుంటే మిగతా సగాన్ని మళ్లీ చదువుకుని, చూడకుండా రాయొచ్చు.
  • ఎప్పుడూ ఒకేచోట కూర్చుని చదవడం వల్ల ఒక్కోసారి కాస్త విసుగ్గా అనిపించొచ్చు. చదివే ప్రదేశాన్ని అప్పుడప్పుడూ మారుస్తుండాలి. కుటుంబ సభ్యుల మాటలు, టీవీ, స్మార్ట్‌ఫోన్‌ వల్ల మీ ఏకాగ్రతకు ఏమాత్రం భంగం కలగకుండా చూసుకోండి.
  • గాలి, వెలుతురు ఉండే ప్రదేశాన్ని ఎంచుకుంటే మంచిది. అలాగే మధ్యలో కాస్త చిరాగ్గా అనిపించినప్పుడు పరిసరాలను గమనించడం ద్వారా సేదతీరొచ్చు. ఆ తర్వాత మళ్లీ చదవడం మొదలు పెట్టొచ్చు.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని