ఎయిడెడ్‌ అధ్యాపకుల పోస్టింగ్‌లలో అయోమయం

ఎయిడెడ్‌ డిగ్రీ, జూనియర్‌ కళాశాలల నుంచి వచ్చిన అధ్యాపకుల పోస్టింగ్‌లలో గందరగోళం నెలకొంది. డిగ్రీ వ్యాయామ సంచాలకులు (పీడీ), లైబ్రేరియన్‌లకు వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించకుండా ఫోన్లలో 2, 3 ఐచ్ఛికాలు ఇచ్చి, ఎంపిక చేసుకోవాలని చెప్పారు.

Updated : 07 Oct 2021 06:25 IST

వెబ్‌ కౌన్సెలింగ్‌లో కనిపించని ఖాళీలు

ఈనాడు, అమరావతి: ఎయిడెడ్‌ డిగ్రీ, జూనియర్‌ కళాశాలల నుంచి వచ్చిన అధ్యాపకుల పోస్టింగ్‌లలో గందరగోళం నెలకొంది. డిగ్రీ వ్యాయామ సంచాలకులు (పీడీ), లైబ్రేరియన్‌లకు వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించకుండా ఫోన్లలో 2, 3 ఐచ్ఛికాలు ఇచ్చి, ఎంపిక చేసుకోవాలని చెప్పారు. అభ్యర్థి కోరిన చోట కాకుండా ఇష్టం వచ్చిన చోట పోస్టింగ్‌ ఇచ్చారు. ఏడాదిలో పదవీ విరమణ పొందే వారిని, మహిళలను దూరంగా వేశారు. వీటిని రద్దుచేసి, వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించాలని అధ్యాపకులు కోరుతున్నారు. వెబ్‌ కౌన్సెలింగ్‌లో పాల్గొన్న వారికీ అన్ని ఖాళీలనూ చూపించలేదు. గుంటూరు జిల్లాలో 48 మంది ఆంగ్ల అధ్యాపకులు ఉంటే వీరందరికీ ఒంగోలులోని నాలుగు ఖాళీలనే చూపించారు. రాజనీతిశాస్త్రం వారికి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ఒక్కటే ఆన్‌లైన్‌లో ఉంది. సూపరింటెండెంట్లకు అసలు ఖాళీలే చూపించలేదు. వారు వెబ్‌ కౌన్సెలింగ్‌లో ఐచ్ఛికాల నమోదుకు వెళ్లగా ఖాళీలు కనిపించలేదు. దీంతో వెబ్‌ కౌన్సెలింగ్‌ను రద్దు చేయాలని అధ్యాపకులు కోరుతున్నారు. ఈ సమస్యలపై ఎమ్మెల్సీలు లక్ష్మణరావు, సాబ్జీతో కలిసి ఎయిడెడ్‌ అధ్యాపకులు ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌ చంద్రను కలిశారు.  

* ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలల లెక్చరర్లను పోస్టులు మంజూరు లేని వాటిల్లో నియమించాలని ఇంటర్‌ విద్యాశాఖ భావిస్తోంది. దీనిపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోస్టులు మంజూరు లేనిచోట నియమిస్తే తమకు జీతాలు రావంటున్నారు. రాష్ట్రంలో పోస్టులు లేని జూనియర్‌ కళాశాలలు 84 ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం ప్రిన్సిపల్‌ మాత్రమే శాశ్వత ఉద్యోగి. గతంలో ఒప్పంద లెక్చరర్లను నియమించగా.. వేతనాలు ఇవ్వడం కష్టమై వారందర్నీ పోస్టులు మంజూరు ఉన్న వాటిలోకి బదిలీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని