Chandrababu: గుడివాడ క్యాసినోపై జాతీయ దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు

స్వాతంత్య్ర సమరయోధులు, మేధావులు, ప్రముఖులు జన్మించిన గుడివాడను మంత్రి కొడాలి నాని కాసుల కోసం కక్కుర్తిపడి క్యాసినో క్యాపిటల్‌గా మారుస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. నిజనిర్ధారణకు వెళ్లిన తెదేపా నేతలపై దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు.

Updated : 25 Jan 2022 03:37 IST

తెదేపా వ్యూహ కమిటీ సమావేశంలో నిర్ణయం
కొడాలి నాని బూతులతో తప్పించుకోలేరని మండిపాటు
పీఆర్సీ, కొవిడ్‌, రైతు సమస్యలపై చర్చ

ఈనాడు, అమరావతి: స్వాతంత్య్ర సమరయోధులు, మేధావులు, ప్రముఖులు జన్మించిన గుడివాడను మంత్రి కొడాలి నాని కాసుల కోసం కక్కుర్తిపడి క్యాసినో క్యాపిటల్‌గా మారుస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. నిజనిర్ధారణకు వెళ్లిన తెదేపా నేతలపై దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. చంద్రబాబు అధ్యక్షతన సోమవారం ఆన్‌లైన్‌లో జరిగిన పార్టీ వ్యూహ కమిటీ సమావేశంలో క్యాసినో వ్యవహారంపై ముఖ్యనేతలంతా మండిపడ్డారు. ‘నాని గుడివాడకు జూద సంస్కృతిని తీసుకొచ్చి అడ్డంగా దొరికిపోయారు. వీడియోలతో సహా అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు. వైకాపా నేతల కనుసన్నల్లో, మంత్రికి చెందిన కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన ఈ ఘటనపై ముఖ్యమంత్రి స్పందించాలి. నాని బూతులు, ఎదురుదాడితో తప్పుల్ని కప్పిపుచ్చలేరు’ అని నేతలు పేర్కొన్నారు. వందల కోట్ల రూపాయలు చేతులు మారిన ఈ జూదక్రీడపై జాతీయ ఏజెన్సీలు, దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. తెదేపా నేతల పోరాటాన్ని చంద్రబాబు ప్రశంసించారు. సమావేశంలో నాయకులు కె.అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, వర్ల రామయ్య, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, నిమ్మకాయల చినరాజప్ప, లోకేశ్‌, పయ్యావుల కేశవ్‌, కాలవ శ్రీనివాసులు, దేవినేని ఉమామహేశ్వరరావు, కొనకళ్ల నారాయణ, బండారు సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. చర్చించిన కీలక అంశాలు, నిర్ణయాలివీ!

* చిత్తూరు జిల్లాలో ఎస్సీ మహిళను పోలీసు కస్టడీలో చిత్రహింసలకు గురి చేయడాన్ని సమావేశం ఖండించింది. ఈ దారుణానికి ఒడిగట్టిన పోలీసుల్ని సస్పెండ్‌తో సరిపెట్టకుండా, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి విచారించాలి. చిత్తూరు జిల్లాలో ఇప్పటికే ఇలాంటి ఘటనలు నాలుగు జరిగాయి.

* వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య ఘటనలో తెర వెనుక సూత్రధారులెవరో తేల్చకుండా, కేసును నలుగురికే పరిమితం చేసే ప్రయత్నం జరుగుతోంది.

* ఉద్యోగుల జీతాలు పెంచకపోగా ప్రభుత్వం వారిని బ్లాక్‌మెయిల్‌ చేస్తోంది. సామాజిక మాధ్యమాల్లో, మీడియాలో ప్రభుత్వమే తప్పుడు ప్రచారం చేయిస్తూ తన నైజాన్ని చాటుకుంటోంది. ఉద్యోగుల డిమాండ్లకు తెదేపా మద్దతు ఉంటుంది.

* ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తూ, రైతులకు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. రైతుల ఇబ్బందులపై ప్రభుత్వం వెంటనే స్పందించాలి.

* రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు భారీగా నమోదవుతున్నందున పాఠశాలలకు సెలవులివ్వాలి. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్ని ప్రమాదంలో పడేసేలా, ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం సరికాదు.

* తెదేపా, ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో అమెరికాకు చెందిన ప్రముఖ వైద్యుల ద్వారా టెలిమెడిసిన్‌ విధానంలో కొవిడ్‌ బాధితులకు అందిస్తున్న వైద్య సాయాన్ని మరింత విస్తృతం చేయాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని