Andhra News: 26 జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీల నియామకం!

రాష్ట్రంలో కొత్త జిల్లాలు సోమవారం నుంచి అమల్లోకి వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం శనివారం రాత్రి భారీ ఎత్తున ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేసింది. 26 జిల్లాలకు కలెక్టర్లను, సంయుక్త కలెక్టర్లను, ఎస్పీలను నియమించింది.

Updated : 03 Apr 2022 05:09 IST

పలువురు సీనియర్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌లకూ బదిలీలు

ఈనాడు - అమరావతి

రాష్ట్రంలో కొత్త జిల్లాలు సోమవారం నుంచి అమల్లోకి వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం శనివారం రాత్రి భారీ ఎత్తున ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేసింది. 26 జిల్లాలకు కలెక్టర్లను, సంయుక్త కలెక్టర్లను, ఎస్పీలను నియమించింది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాల కలెక్టర్లలో నలుగురు తప్ప మిగతా 9 మందినీ వారు పని చేస్తున్న చోటే కలెక్టర్లుగా కొనసాగించింది. గుంటూరు, కృష్ణా, ప్రకాశం, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్లుగా ఉన్న వివేక్‌ యాదవ్‌, నివాస్‌, ప్రవీణ్‌ కుమార్‌, హరికిరణ్‌లను రాష్ట్ర స్థాయి పోస్టుల్లోకి బదిలీ చేసింది. ప్రస్తుతం జేసీలుగా, మున్సిపల్‌ కమిషనర్లుగా, వివిధ రాష్ట్ర స్థాయి పోస్టుల్లో పని చేస్తున్న ఐఏఎస్‌ అధికారుల్లో కొందరిని జిల్లాల కలెక్టర్లుగా నియమించింది. కొన్ని జిల్లాల సంయుక్త కలెక్టర్లను వారు పని చేస్తున్న చోటే కొనసాగించింది. ప్రస్తుతం జిల్లాల్లో జేసీ (హౌసింగ్‌), జేసీ (గ్రామ, వార్డు) సచివాలయాలుగా పని చేస్తున్న వారిలో పలువురిని కొత్త జిల్లాలకు జేసీలుగా నియమించింది. ఐఏఎస్‌ల బదిలీలపై శనివారం రాత్రి వెలువడిన ముసాయిదా జీవోల్లో ఆ వివరాలున్నాయి. బదిలీ అయినవారిలో పలువురు సీనియర్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులున్నారు. శనివారం అర్ధరాత్రి వరకూ ప్రభుత్వ గెజిట్‌లో జీవోల్ని అధికారికంగా అప్‌లోడ్‌ చేయలేదు. చివరి నిమిషంలో ఈ జాబితాలో కొన్ని మార్పులు ఉండే అవకాశం లేకపోలేదు.

రవాణాశాఖ కమిషనర్‌గా కాటమనేని భాస్కర్‌

ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం శనివారం పలువురు ఐఏఎస్‌ అధికారుల్ని బదిలీ చేసింది. రవాణా శాఖ కమిషనర్‌గా కాటమనేని భాస్కర్‌ను, సీఆర్‌డీఏ కమిషనర్‌గా వివేక్‌ యాదవ్‌ను, వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్‌గా చేవూరి హరికిరణ్‌ను, వైద్య, ఆరోగ్యశాఖ డైరెక్టర్‌గా జె.నివాస్‌ను, రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శిగా కె.ఆర్‌.బిహెచ్‌.ఎన్‌.చక్రవర్తిని నియమించింది. దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న జి.వాణీమోహన్‌ను యువజన వ్యవహారాలు, పర్యాటకశాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించింది. ఇవన్నీ శనివారం రాత్రి వెలువడిన ముసాయిదా జీవోల్లోని వివరాలు. శనివారం అర్ధరాత్రి వరకు ఏపీ ఈ-గెజిట్‌ వెబ్‌సైట్‌లో జీవోల్ని అప్‌లోడ్‌ చేయలేదు. తుది జీవోల్లో కొన్ని మార్పులు ఉండే అవకాశం లేకపోలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని