Vaccine: విదేశీ టీకాలకు మరిన్ని మినహాయింపులు

భారతీయ నియంత్రణ సంస్థ అనుమతులు లేకుండానే విదేశీ టీకాల వినియోగానికి అనుమతి ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు వాటి వినియోగ అనంతరం క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహణ, బ్యాచ్‌లవారీగా కేంద్ర ఔషధ ప్రయోగశాలలో చేపట్టాల్సిన అధీకృత తనిఖీల నుంచి కూడా మినహాయింపునిచ్చింది.

Updated : 21 Dec 2022 14:53 IST

ఫైజర్‌, మోడెర్నాలకు మార్గం సుగమం చేయడానికేనన్న అభిప్రాయాలు

ఈనాడు, దిల్లీ: భారతీయ నియంత్రణ సంస్థ అనుమతులు లేకుండానే విదేశీ టీకాల వినియోగానికి అనుమతి ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు వాటి వినియోగ అనంతరం క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహణ, బ్యాచ్‌లవారీగా కేంద్ర ఔషధ ప్రయోగశాలలో చేపట్టాల్సిన అధీకృత తనిఖీల నుంచి కూడా మినహాయింపునిచ్చింది. ఈ మేరకు డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా వీజీ సోమాని బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ‘‘దేశీయంగా కొవిడ్‌-19 వ్యాక్సిన్ల ఉత్పత్తిని గరిష్ఠస్థాయికి పెంచుతున్నప్పటికీ జాతీయ అవసరాలు తీర్చడానికి విదేశాలనుంచి వ్యాక్సిన్లు దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇదివరకు నిపుణుల కమిటీ సిఫార్సులమేరకు యూఎస్‌ఎఫ్‌డీఏ, యూరోపియన్‌ మెడిసిన్స్‌ ఏజెన్సీ, యూకే మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ప్రొడక్ట్స్‌ రెగ్యులేటరీ ఏజెన్సీ, జపాన్‌ ఫార్మాస్యూటికల్స్‌ అండ్‌ మెడికల్‌ డివైజెస్‌ ఏజెన్సీలు అనుమతిచ్చిన, డబ్ల్యుహెచ్‌ఓ అత్యవసర వినియోగ విభాగ జాబితాలో ఉన్న వ్యాక్సిన్లను భారత ఔషధ నియంత్రణ మండలి అనుమతి లేకుండానే నేరుగా ఉపయోగించడానికి అనుమతి ఇచ్చాం. అవన్నీ సుస్థిరమైన నిబంధనల ప్రకారం రూపొందిన టీకాలు కావడంతోపాటు, అప్పటికే వాటిని కోట్లమంది ప్రజలకు అందించిన నేపథ్యంలో పోస్ట్‌ అప్రూవల్‌ బ్రిడ్జింగ్‌ క్లినికల్‌ ట్రయల్స్‌తోపాటు,   విదేశాల నుంచి వచ్చే టీకాల ప్రతి బ్యాచ్‌నూ కసౌలీలోని కేంద్ర ఔషధ ప్రయోగశాలలో పరీక్షించాలన్న నిబంధన నుంచి మినహాయింపునిస్తున్నాం. టీకా తయారైన దేశంలోని ప్రయోగశాలలో ఆ వ్యాక్సిన్‌ బ్యాచ్‌, లాట్‌లను పరీక్షించి, విడుదల చేయడానికి అనుమతి ఇచ్చి ఉంటే భారత్‌లో పరీక్షించాల్సిన అవసరం లేదు’’ అని వీజీ సోమాని ఈ నోటీసులో పేర్కొన్నారు.

ఫైజర్‌, మోడెర్నాల కోసమేనా?
అమెరికాకు చెందిన ఫైజర్‌, మోడెర్నా వ్యాక్సిన్‌లకు మార్గం సుగమం చేయడానికే డీజీసీఏ ఉత్తర్వులు జారీ చేసిందన్న ప్రచారం జరుగుతోంది. భారత్‌కు వ్యాక్సిన్లు అందించాలంటే తమకు ఇండెమ్నిటీ (ఏదైనా ప్రతికూల ప్రభావం ఏర్పడితే నష్టపరిహారం కోరడం), అనుమతుల అనంతరం బ్రిడ్జింగ్‌ ట్రయల్స్‌ నిర్వహించాలన్న నిబంధన నుంచి మినహాయింపునివ్వాలని ఆ సంస్థలు గతంలో ప్రభుత్వాన్ని కోరాయి. దీనిపై ఇప్పటివరకూ భారత్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ ప్రస్తుతం నిబంధనల మినహాయింపు ఇచ్చిన తీరును బట్టి ఆ దిశగా అడుగులేస్తోందన్న అభిప్రాయం నిపుణుల్లో వ్యక్తమవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని