Service Sector: తిరోగమనంలో సేవల రంగం

ఆంధ్రప్రదేశ్‌లో సేవల రంగం వృద్ధిరేటు భారీగా పడిపోయింది. గత మూడేళ్లుగా ఇది తిరోగమనంలో సాగుతోంది. 2018-19లో 8.24%, 2019-20లో 6.20%గా నమోదైన ఈ రంగం వార్షిక వృద్ధిరేటు 2020-21లో మైనస్‌ 6.71%కి పడిపోయినట్లు సోమవారం కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థికసర్వే వెల్లడించింది.

Updated : 01 Feb 2022 03:49 IST

విశాఖ పోర్టు నుంచి సరకు రవాణాకు దేశంలోనే అత్యధిక సమయం
కుటుంబాల్లో తగ్గుతున్న పారిశుద్ధ్య వాతావరణం
ఆర్థిక సర్వేలో వెల్లడి

ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో సేవల రంగం వృద్ధిరేటు భారీగా పడిపోయింది. గత మూడేళ్లుగా ఇది తిరోగమనంలో సాగుతోంది. 2018-19లో 8.24%, 2019-20లో 6.20%గా నమోదైన ఈ రంగం వార్షిక వృద్ధిరేటు 2020-21లో మైనస్‌ 6.71%కి పడిపోయినట్లు సోమవారం కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థికసర్వే వెల్లడించింది. రాష్ట్ర స్థూల అదనపు విలువలో ఈ రంగం వాటా 2018-19లో 42.25% ఉండగా, 2019-20లో అది 41.86%, 2020-21లో 41.64%కి పడిపోయింది. తెలంగాణలోనూ సేవల రంగం వృద్ధిరేటు మూడేళ్లుగా క్రమంగా తగ్గుతోంది. 2018-19లో 7.91% ఉన్న ఈ వృద్ధిరేటు 2019-20లో 5.69 శాతానికి చేరింది. 2020-21లో అది ఏకంగా మైనస్‌ 3.94 శాతానికి పడిపోయింది.
* ఆంధ్రప్రదేశ్‌లో మెరుగైన పారిశుద్ధ్య వాతావరణంలో జీవించే వారి సంఖ్య తగ్గిపోయింది. చక్కటి పారిశుద్ధ్య వసతులున్న ఇళ్లలో నివసించే జనసంఖ్య 2015-16 ఆరోగ్య సర్వే-4 ప్రకారం 77.3% ఉండగా 2019-21 ఆరోగ్య సర్వే-5 నాటికి 54.4%కి పడిపోయింది. వంట కోసం శుద్ధ ఇంధనం వాడే కుటుంబాల సంఖ్య ఇదివరకు 83.6% ఉండగా, తాజాగా 62%కి పడిపోయింది.
* ఏపీలో శిశుమరణాలు 34.9 నుంచి 30.3కి తగ్గిపోయాయి. అయిదేళ్లలోపు పిల్లల మరణాలు ఇదే సమయంలో 40.8 నుంచి 35.2కి తగ్గాయి. పొత్తిళ్లలోని పిల్లల (1 నుంచి 28 రోజుల్లోపు వయస్సున్న పిల్లలు) మరణాలు మాత్రం 19.9 నుంచి 23.6కి పెరిగాయి.
* ఆరోగ్య సర్వే 4-5ల మధ్యకాలంలో ఏపీలో సంతానసాఫల్య రేటు (ప్రతి మహిళకు జన్మించే పిల్లల సంఖ్య) 1.8 నుంచి 1.7కి తగ్గిపోయింది. లింగనిష్పత్తి 914 నుంచి 934కి పెరిగింది.
* విశాఖ పోర్టులో సరకు రవాణాకు వెచ్చించే రోజులు దేశంలోనే అత్యధికంగా ఉంది. ఇక్కడ ఒక్కో నౌక టర్న్‌ అరౌండ్‌ (సరకు లోడింగ్‌, అన్‌లోడింగ్‌)కు సగటున 3.15 రోజులు పడుతోంది. కోల్‌కతా, మర్మగోవా, వైజాగ్‌ పోర్టులు తప్ప దేశంలోని మిగిలిన అన్ని పోర్టుల్లో అత్యధిక సరకు రవాణా ట్రాఫిక్‌ నమోదైంది.
2022-25 మధ్యకాలంలో విజయవాడ, తిరుపతి, రాజమండ్రి విమానాశ్రయాలను ప్రైవేటీకరణ(మానిటైజ్‌) చేయాలని ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా నిర్ణయించింది.
* లక్ష హెక్టార్లలో ప్రకృతి సేద్యంతో ఆంధ్రప్రదేశ్‌ దేశంలో తొలిస్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, కేరళ, ఒడిశా, హిమాచల్‌ప్రదేశ్‌, ఝార్ఖండ్‌, తమిళనాడు ఉన్నాయి.
* నీతిఆయోగ్‌ విడుదల చేసిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచి 2020-21లో ఆంధ్రప్రదేశ్‌ 4వ స్థానంలో నిలిచింది. దేశంలోని కోస్తా రాష్ట్రాలపరంగా చూస్తే ఒడిశా తర్వాతి స్థానాన్ని ఏపీ దక్కించుకొంది.
ఆంధ్రప్రదేశ్‌, బిహార్‌లలో గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులకు డిమాండ్‌ కొన్ని నెలలుగా కొవిడ్‌ ముందుకాలం నాటి కంటే తగ్గిపోయింది. బయటి ప్రాంతాల నుంచి సొంత రాష్ట్రాలకు కార్మికులు వలస వచ్చినచోట పెరిగితే, సొంతరాష్ట్రాల నుంచి బయటి రాష్ట్రాలకు కార్మికులు వలస వెళ్లినచోట డిమాండ్‌ తగ్గింది.
* కేంద్రం ప్రారంభించిన నేషనల్‌ క్లీన్‌ ఎయిర్‌ ప్రోగ్రాం కింద 2020-21లో దేశంలోని అన్ని రాష్ట్రాలకంటే ఏపీకి అత్యధికంగా రూ.17 కోట్లు విడుదలయ్యాయి. 2019-20లో కేవలం రూ.6 కోట్లు రాగా... 2020-21లో అది 183% పెరిగింది. రాష్ట్రఃలో రూ.13 కోట్లతో నేషనల్‌ అడాప్టేషన్‌ ఆన్‌ క్లైమేట్‌ చేంజ్‌ కింద వివిధ ప్రాజెక్టులు అమలవుతున్నాయి.
* ఆంధ్రప్రదేశ్‌లో పొగాకు రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించే  ప్రయత్నం జరుగుతోంది.
* కేంద్రం 2019-20 నుంచి ప్రజాపంపిణీ వ్యవస్థ కింద పంపిణీ చేసే బియ్యం ఫోర్టిఫికేషన్‌ పైలెట్‌ స్కీంను దేశంలోని ఏపీతో సహా 15 రాష్ట్రాల్లోని ఒక్కో జిల్లాలో ప్రారంభించింది.
* వామపక్ష తీవ్రవాదానికి తీవ్రంగా ప్రభావితమైన ఆంధ్రప్రదేశ్‌తో సహా 9 రాష్ట్రాల్లోని 44 జిల్లాల్లో రహదారి అనుసంధానత మెరుగుపరిచారు.
* అటల్‌ పెన్షన్‌ యోజన కింద ఆంధ్రప్రదేశ్‌లో 20.5 లక్షల ఖాతాలు ఉన్నాయి.
* టమోటా రేట్లు పెరగడానికి ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకల్లో అత్యధిక వర్షాలు కురవడమే.
జీఎస్‌టీ కింద ఆంధ్రప్రదేశ్‌కు 2021 నవంబరు వరకు రూ.21,015 కోట్లు వచ్చాయి.


మైనస్‌లో నికర ఉత్పత్తి వృద్ధిరేటు

ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగిన తొలి ఆరేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ రెండంకెల మేర నమోదైన రాష్ట్ర నికర ఉత్పత్తి వృద్ధిరేటు 2020-21లో ఏకంగా 1.6%కి పడిపోయింది. 2011-22 సిరీస్‌ను అనుసరించి తాజా ధరల ప్రకారం ఏపీ నికర ఉత్పత్తి వృద్ధిరేటు... 2014-15లో 14%, 2015-16లో 15.7%, 2016-17లో 12.4%, 2017-18లో 15.3%, 2018-19లో 10.8%, 2019-20లో 11.3% నమోదుకాగా 2020-21లో మాత్రం 1.6%కి పడిపోయింది. రాష్ట్ర నికర ఉత్పత్తి విలువ 2019-20లో రూ.8,70,064 కోట్లుగా నమోదుకాగా, 2020-21లో రూ.8,84,199 కోట్లకు, తలసరి నికర ఉత్పత్తి విలువ రూ.1,68,480 నుంచి రూ.1,70,215కి చేరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని