గ్రామాలకు జ్వరం!

పంచాయతీల్లో నిధుల కొరత గ్రామాల్లో పారిశుద్ధ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కార్మికులకు జీతాల్లో చెల్లింపుల్లో జాప్యం కారణంగా ప్రజారోగ్యానికి సంబంధించిన పనుల నిర్వహణ

Published : 25 Sep 2022 05:50 IST

పల్లెల్లో అధ్వానంగా పారిశుద్ధ్యం

ఈనాడు, అమరావతి: పంచాయతీల్లో నిధుల కొరత గ్రామాల్లో పారిశుద్ధ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కార్మికులకు జీతాల్లో చెల్లింపుల్లో జాప్యం కారణంగా ప్రజారోగ్యానికి సంబంధించిన పనుల నిర్వహణ అంతంత మాత్రంగానే ఉంటోంది. దీంతో రాష్ట్రంలో నమోదవుతున్న జ్వరాల కేసుల్లో అత్యధికం గ్రామాల్లోనే ఉంటున్నాయి. గత రెండు, మూడు నెలల్లో డెంగీ కేసుల తీవ్రత పెరిగింది. 3 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో అంతకంటే ఎక్కువ సంఖ్యలో రోగులు చికిత్స పొందుతున్నారు. డెంగీ జ్వర పీడితులు ఎక్కువగా గ్రామాల నుంచే వస్తున్నారు. పారిశుద్ధ్య సమస్యే ఇందుకు ప్రధాన కారణమని వైద్యులు అంటున్నారు. చాలా గ్రామాల్లో దోమల నియంత్రణకు ఫాగింగ్‌ నామమాత్రంగా చేస్తున్నారు. పంచాయతీలకు సరఫరా చేసిన ఫాగింగ్‌ యంత్రాలు అనేకచోట్ల మూలన పడ్డాయి. ఆర్థిక సంఘం నిధులను విద్యుత్తు ఛార్జీలకు రాష్ట్ర ప్రభుత్వం మళ్లించడంతో పంచాయతీలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

* గ్రామాల్లో ఇళ్ల నుంచి చెత్త సేకరించే 36,700 మంది క్లాప్‌ మిత్రలకు గత ఐదు నెలలుగా జీతాల్లేవు. ఇదిగో, అదిగో అంటూ అధికారులు కాలయాపన చేస్తున్నారు. చెత్త నుంచి సంపద సృష్టించే కేంద్రాలను గత ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో ఏర్పాటు చేశారు. ఇళ్ల నుంచి చెత్త సేకరించేందుకు అప్పట్లో గ్రీన్‌ అంబాసిడర్ల పేరుతో వీరిని నెలకు రూ.6వేల జీతానికి నియమించారు. ప్రస్తుత ప్రభుత్వంలో వీరి పేర్లను క్లాప్‌ మిత్రలుగా మార్చారు. పంచాయతీల్లో నిధుల కొరత కారణంగా వీరికి స్వచ్ఛాంధ్ర సంస్థ నుంచి జీతాలు ఇప్పిస్తున్నారు. ఏప్రిల్‌ నుంచి వీరికి జీతాలు బకాయిపడ్డారు.

* వీధులు, కాలువలు శుభ్రం చేసేందుకు, దోమల నివారణకు ఫాగింగ్‌ కోసం పంచాయతీల ఆధ్వర్యంలో పని చేస్తున్న మరో 20వేల మంది ఒప్పంద కార్మికుల్లో అత్యధికులకు 5 నుంచి 8 నెలలుగా జీతాల్లేవు. దీంతో పారిశుద్ధ్య పనులు సవ్యంగా జరగడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని