రైతులది ఏం తప్పుందని.. కన్నెర్ర చేస్తారు?

‘పాదయాత్రను అడ్డుకోవడం 5 నిమిషాల పని అని, కన్నెర్ర చేస్తామని ఉత్తరాంధ్రకు చెందిన మంత్రి హెచ్చరిస్తున్నారు. రైతులది ఏం తప్పుందని మీరు  కన్నెర్ర చేస్తారు? రూ.10 వేల కోట్లు ఉంటే చాలు విశాఖను అభివృద్ధి చేస్తాం అని

Published : 29 Sep 2022 03:33 IST

 పదవులు కాపాడుకునేందుకే మంత్రుల రెచ్చగొట్టే వ్యాఖ్యలు

అమరావతి ఐకాస నేతల ధ్వజం

ఈనాడు డిజిటల్‌, ఏలూరు: ‘పాదయాత్రను అడ్డుకోవడం 5 నిమిషాల పని అని, కన్నెర్ర చేస్తామని ఉత్తరాంధ్రకు చెందిన మంత్రి హెచ్చరిస్తున్నారు. రైతులది ఏం తప్పుందని మీరు  కన్నెర్ర చేస్తారు? రూ.10 వేల కోట్లు ఉంటే చాలు విశాఖను అభివృద్ధి చేస్తాం అని ప్రకటిస్తున్నారు. ఇప్పటికే రూ.లక్షల కోట్లు అప్పులు తెచ్చిన ప్రభుత్వం ఈ మూడేళ్లలో ఆ పని ఎందుకు చేయలేదు?’ అని అమరావతి ఐకాస నేతలు ధ్వజమెత్తారు. ఏలూరు జిల్లాలో రెండోరోజు పాదయాత్ర సందర్భంగా బుధవారం వారు విలేకరులతో మాట్లాడారు. ‘అమరావతి రైతుల మహా పాదయాత్రను చూసి మంత్రులు ఓర్వలేకపోతున్నారు. అందుకే ఒకరు శవయాత్ర అంటే మరొకరు ఒళ్లుబలిసిన వారి యాత్ర అంటున్నారు. ప్రజలే వారికి బుద్ధి చెబుతారు’ అని అమరావతి ఐకాస కన్వీనర్‌ శివారెడ్డి ధ్వజమెత్తారు. పాదయాత్ర ఉత్తరాంధ్ర వస్తే ప్రజలు తిరగబడతారని మంత్రులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని, రైతులకు వ్యతిరేకంగా గ్రామాల్లో ఫ్లెక్సీలు  పెట్టి వివాదాలు సృష్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. కోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినా మంత్రులతో అమరావతిపై విషం చిమ్మిస్తుండటం దుర్మార్గమన్నారు. పాదయాత్రపై మంత్రులు, ఎమ్మెల్యేలు ఆవాకులు చవాకులు పేలుతున్నా... ప్రజలు నీరాజనాలు పడుతున్నారని చెప్పారు. ‘మొదటి విడత పాదయాత్రలో రాయలసీమ వెళితే మాపై రాళ్లు పడతాయని బెదిరించారు. కానీ అక్కడి ప్రజలు పూలవర్షం కురిపించారు. మంత్రి బొత్స సత్యనారాయణ బయటకు వచ్చి ప్రస్తుతం సాగుతున్న  యాత్రను ఒకసారి చూడాలి’ అని శివారెడ్డి అన్నారు. 

జగన్‌ ఒళ్లు బలిసే పాదయాత్ర చేశారా?

రైతులు ఒళ్లు బలిసి యాత్ర చేస్తున్నారు అని మంత్రులు వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి, జగన్‌, షర్మిల కూడా ఒళ్లు బలిసే పాదయాత్రలు చేశారా? రైతులు రాష్ట్ర భవిష్యత్తు కోసం యాత్ర చేస్తున్నారు. పాదయాత్రలో పాల్గొంటున్న మహిళలపై పేటీఎం కూలీలు సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టులు పెడుతున్నారు. మీ ఇంట్లో మహిళలతోనూ ఇలాగే ప్రవర్తిస్తారా? పాదయాత్రకు విశేష స్పందన వస్తోంది. కచ్చితంగా అమరావతే రాజధానిగా కొనసాగుతుంది.

- తిరుపతిరావు, జేఏసీ కోకన్వీనర్‌

మూడు రూపాయలైనా ఖర్చు చేశారా?

రాష్ట్రం కోసం భూములిచ్చి కష్టాలు పడుతుంటే మాపై విషం చిమ్ముతున్నారు. రాష్ట్రం కోసం మహిళా రైతులు పాదయాత్ర చేస్తుంటే.. కిరాయి కుక్కలు వారిపై అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నాయి. మూడేళ్లుగా మూడు రాజధానులు అంటున్నారు... ఈ మూడు ప్రాంతాల్లో మూడు రూపాయలైనా ఖర్చు చేశారా? మంత్రులే ఒళ్లు బలిసి న్యాయస్థానాల గురించి, న్యాయమూర్తుల గురించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు.

- రాయపాటి శైలజ, మహిళా ఐకాస నాయకురాలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని