AP Bhavan: పేరుకే ఏపీ భవన్‌లో అధికారులు.. పనిచేసేది సాయిరెడ్డి, సుబ్బారెడ్డిల కోసమే..

దిల్లీలోని ఏపీ భవన్‌లో మీడియా విభాగం ఓఎస్డీగా పని చేస్తున్న అరవింద్‌ యాదవ్‌కు ఏడాది, స్పెషల్‌ లైజనింగ్‌ అధికారిగా పని చేస్తున్న కె.చిన్నప్పన్నకు రెండేళ్లు పొడిగింపునిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Updated : 18 Nov 2022 09:56 IST

అరవింద్‌ యాదవ్‌, చిన్నప్పన్న సర్వీసు మళ్లీ పొడిగింపు

ఈనాడు, అమరావతి: దిల్లీలోని ఏపీ భవన్‌లో మీడియా విభాగం ఓఎస్డీగా పని చేస్తున్న అరవింద్‌ యాదవ్‌కు ఏడాది, స్పెషల్‌ లైజనింగ్‌ అధికారిగా పని చేస్తున్న కె.చిన్నప్పన్నకు రెండేళ్లు పొడిగింపునిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబరు 7, 10 తేదీల్లో జారీ చేసిన ఆ జీవోల్ని ఏపీ ఈ-గెజిట్‌ పోర్టల్‌లో గురువారం అప్‌లోడ్‌ చేశారు. అరవింద్‌ యాదవ్‌, చిన్నప్పన్న ఇద్దరూ రికార్డుల ప్రకారం ఏపీ భవన్‌ ఉద్యోగులుగా ఉన్నా.. వారిలో ఒకరు వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డికి, మరొకరు తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డికి సహాయకులుగా వ్యవహరిస్తూ వారి పనులు చక్కబెడుతుంటారు. విజయసాయిరెడ్డికి వ్యక్తిగత సహాయకుడైన అరవింద్‌ యాదవ్‌ను ప్రభుత్వం 2019 ఆగస్టు 28న ఏపీ భవన్‌లో మీడియా విభాగం ఓఎస్డీగా నెలకు రూ.లక్ష వేతనంపై నియమించింది. వేతనంతోపాటు నెలకు రూ.50వేల ఇంటి అద్దె భత్యం, వాహనం కోసం మరో రూ.50వేలు, సెల్‌ఫోన్‌ నిమిత్తం రూ.6 వేలు... మొత్తం నెలకు రూ.2.06 లక్షలు చెల్లిస్తోంది. ఆయనకు 2020 ఆగస్టు 28 నుంచి రెండేళ్ల పొడిగింపు ఇచ్చింది. అదీ ముగియడంతో మరో ఏడాదిపాటు పొడిగించింది. వై.వి.సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడైన చిన్నప్పన్నను 2019 ఆగస్టు 10న ఏపీ భవన్‌లో నెలకు రూ.75వేల వేతనంపై స్పెషల్‌ లైజనింగ్‌ ఆఫీసర్‌గా మూడేళ్ల కాలానికి ప్రభుత్వం నియమించింది. ఇతర ఎలవెన్సులూ చెల్లిస్తోంది. తన పోస్టును ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శిగా మారుస్తూ, మరో మూడేళ్ల పొడిగింపు ఇవ్వాలని ప్రభుత్వానికి చిన్నప్పన్న విజ్ఞప్తి చేశారు. దాన్ని పరిగణనలోకి తీసుకుని ఆయన పోస్టును ఏపీ భవన్‌ ప్రత్యేకాధికారిగా మారుస్తూ 2022 ఆగస్టు 10 నుంచి రెండేళ్లపాటు పొడిగింపు ఇస్తున్నట్లు ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది.

శైలజారెడ్ది సర్వీసు పొడిగింపు

రాష్ట్ర ప్రొటోకాల్‌ విభాగంలో ఓఎస్డీగా పని చేస్తున్న విశ్రాంత అధికారిణి కె.శైలజారెడ్డికి మరో రెండేళ్లు పొడిగింపునిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 2022 ఆగస్టు 1 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఈ జీవోనూ ప్రభుత్వం ఆగస్టు 1న జారీ చేసి, ఏపీ ఈ-గెజిట్‌లో గురువారం అప్‌లోడ్‌ చేసింది. ప్రొటోకాల్‌ విభాగంలో డిప్యూటీ డైరెక్టర్‌ హోదాలో పనిచేసి పదవీ విరమణ చేసిన శైలజారెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం 2020 ఆగస్టు 1 నుంచి రెండేళ్లపాటు ఓఎస్డీగా నియమించింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం, సచివాలయంలోని ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయాల్లో ప్రొటోకాల్‌ విధుల్ని పర్యవేక్షించే బాధ్యత ఆమెకు అప్పగించారు. ఆమె వేతనం నెలకు రూ.75 వేలు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని