హైకోర్టు న్యాయమూర్తులుగా వెంకట జ్యోతిర్మయి, గోపాలకృష్ణారావు

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు ఇద్దరు అదనపు న్యాయమూర్తులు నియమితులయ్యారు. న్యాయాధికారులుగా పని చేస్తున్న పి.వెంకట జ్యోతిర్మయి, వి.గోపాలకృష్ణారావుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదముద్ర వేశారు.

Updated : 25 Jan 2023 06:55 IST

నియామకానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర
నోటిఫికేషన్‌ జారీ చేసిన కేంద్ర న్యాయశాఖ

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు ఇద్దరు అదనపు న్యాయమూర్తులు నియమితులయ్యారు. న్యాయాధికారులుగా పని చేస్తున్న పి.వెంకట జ్యోతిర్మయి, వి.గోపాలకృష్ణారావుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ మంగళవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. వీరితో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్ర.. త్వరలో ప్రమాణం చేయిస్తారు. న్యాయాధికారులుగా పని చేస్తున్న వీరికి హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని కొలీజియం ఈనెల 10న కేంద్రానికి సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. 37 మంది న్యాయమూర్తులు ఉండాల్సిన ఏపీ హైకోర్టులో 30 మంది సేవలందిస్తున్నారు. ఏడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తాజాగా ఈ ఇద్దరి నియామకంతో న్యాయమూర్తుల సంఖ్య 32కు చేరుతుంది.

న్యాయాధికారి పి.వెంకట జ్యోతిర్మయి

న్యాయాధికారి వెంకట జ్యోతిర్మయి స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి. ఈమె బాల త్రిపుర సుందరి, పీవీకే శాస్త్రి దంపతులకు జన్మించారు. డిగ్రీ వరకూ తెనాలిలో విద్యాభ్యాసం చేశారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 2008లో నేరుగా జిల్లా జడ్జి కేడర్‌కు ఎంపికయ్యారు. ఫ్యామిలీ కోర్టు, ఎస్సీ ఎస్టీ కోర్టు, సీబీఐ కోర్టు, వ్యాట్‌ ట్రైబ్యునల్‌ ఛైర్మన్‌, విశాఖపట్నం, ప్రకాశం జిల్లాలకు ప్రధాన న్యాయమూర్తిగా (పీడీజే) సేవలు అందించారు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పీడీజేగా పని చేస్తున్నారు.

న్యాయాధికారి వి.గోపాలకృష్ణారావు

న్యాయాధికారి వెణుతురుమల్లి గోపాలకృష్ణారావు స్వస్థలం కృష్ణా జిల్లా చల్లపల్లి గ్రామం. తల్లిదండ్రులు కోటేశ్వరమ్మ, సోమయ్య. తండ్రి విశ్రాంత సబ్‌ రిజిస్ట్రార్‌. గోపాలకృష్ణారావు అవనిగడ్డ బార్‌ అసోసియేషన్‌లో సభ్యుడిగా చేరి అక్కడ న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. 1994లో జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపికయ్యారు. 2007లో సీనియర్‌ సివిల్‌ జడ్జిగా పదోన్నతి పొందారు. 2016 నుంచి అదనపు జిల్లా జడ్జిగా శ్రీకాకుళం, తిరుపతిలో న్యాయ సేవలు అందించారు. ప్రస్తుతం గుంటూరు మొదటి అదనపు జిల్లా జడ్జిగా పని చేస్తున్నారు. ఆయన కుమారుడు వి.రఘునాథ్‌ ఇటీవల జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపికై నంద్యాల జిల్లా ఆత్మకూరు కోర్టులో విధులు నిర్వహిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని