స్వాధీనం చేసుకున్న వాటిని తిరిగిచ్చేలా ఆదేశించండి

ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్‌, ఇతర రికార్డులను కాపీ చేసుకోకుండా తిరిగి ఇచ్చేలా ఆదేశాలు జారీచేయాలంటూ తెలంగాణ హైకోర్టుకు బ్రహ్మయ్య అండ్‌ కొ విజ్ఞప్తి చేసింది.

Updated : 02 Apr 2023 05:03 IST

చట్టవిరుద్ధమైన సోదా ఉత్తర్వులను రద్దు చేయండి
సంబంధం లేని సమాచారాన్ని తీసుకెళ్లారు
తెలంగాణ హైకోర్టులో బ్రహ్మయ్య అండ్‌ కొ అనుబంధ పిటిషన్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్‌, ఇతర రికార్డులను కాపీ చేసుకోకుండా తిరిగి ఇచ్చేలా ఆదేశాలు జారీచేయాలంటూ తెలంగాణ హైకోర్టుకు బ్రహ్మయ్య అండ్‌ కొ విజ్ఞప్తి చేసింది. తమ కార్యాలయంలో సోదాల నిమిత్తం ఇచ్చిన నోటీసులను రద్దుచేయాలని కోరింది. ఈ మేరకు బ్రహ్మయ్య అండ్‌ కొ తెలంగాణ హైకోర్టులో శుక్రవారం అనుబంధ పిటిషన్‌ దాఖలుచేసింది. వివరాలిలా ఉన్నాయి.. ‘గత వారం అత్యవసరంగా పిటిషన్‌ దాఖలు చేసినప్పుడు పూర్తి సమాచారం అందుబాటులో లేదు. మార్చి 28 మధ్యాహ్నం 2.30 నుంచి 29న 5 గంటల వరకూ భాగస్వామి కోటేశ్వరరావును సీఐడీ అధికారులు తమ నియంత్రణలో ఉంచుకోవడంతో సమాచారం లేకపోయింది. కార్యాలయంలో సోదాల నిమిత్తం 30-35 మంది వచ్చినా, ఇద్దరే యూనిఫాం వేసుకుని, మిగిలినవారు మఫ్టీలో వచ్చారు. స్థానిక పోలీసులు ఎవరూ లేకుండా ప్రవేశించి బలవంతంగా ఇంటర్నెట్‌, సీసీటీవీ కనెక్షన్లను కట్‌ చేశారు. ఏపీ పోలీసులకు ఇక్కడ సోదా చేసే పరిధి లేదని అభ్యంతరం చెబుతున్నా పట్టించుకోకుండా కార్యాలయంలో ఉన్నవారందరి ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మార్గదర్శి సమాచారాన్ని ఇస్తామని చెబుతున్నా పట్టించుకోకుండా కంప్యూటర్లలోని సమాచారాన్ని కాపీ చేసుకుని, రికార్డులను స్వాధీనం చేసుకోవడం ప్రారంభించారు. సీఐడీ జారీచేసిన సోదా ఉత్తర్వులు ఏపీ పోలీసులు నమోదు చేసిన కేసుకు సంబధించినవే తప్ప, మార్గదర్శి చట్టబద్ధ ఆడిటర్‌ పాత్రకు చెందినవి కావు. కంపెనీ చట్టం కింద మార్గదర్శికి చెందిన ఫైనాన్షియల్‌ స్టేట్‌మెంట్‌ను రూపొందించడమే మా బాధ్యత. చిట్‌ఫండ్‌ కింద ఎలాంటి ఆడిట్‌ నిర్వహించట్లేదు’ అని తెలిపింది.

సమాచారం తీసుకెళ్లిన వ్యక్తి అరెస్టు

మార్గదర్శి సమాచారాన్ని సమర్పించాలంటూ సీఐడీ అదనపు ఎస్పీ మార్చి 18న నోటీసు జారీచేశారని, అయితే ఆర్థిక సంవత్సరాంతం కావడంతో మూడు వారాల గడువు కావాలని కోరినట్లు బ్రహ్మయ్య అండ్‌ కొ తెలిపింది. దీనికి వారు నిరాకరించడంతో 28న ఉదయం 10 గంటలకు కె.శ్రావణ్‌ ల్యాప్‌టాప్‌తో విజయవాడ సీఐడీ కార్యాలయానికి వెళ్లగా ఆయనతో పాటు వెళ్లిన రజత్‌ను నిర్బంధించి ఫోన్లను స్వాధీనం చేసుకున్నారంది. 29న శ్రావణ్‌ను అరెస్టుచేసి రిమాండుకు తరలించారని తెలిపింది. సమాచారం ఇచ్చినా హైదరాబాద్‌ కార్యాలయంలో బలవంతంగా సోదాలు ప్రారంభించారంది. ముగ్గురు భాగస్వాములు, 18 మంది ఉద్యోగులను నిర్బంధించి ఫోన్లను జప్తు చేశారని, మహిళా ఉద్యోగులను సాయంత్రం 5 గంటలకు, మధుమేహం ఉన్న ఒక భాగస్వామిని సాయంత్రం, మరొకరిని రాత్రి వదిలిపెట్టారన్నారు. 80 ఏళ్ల పి.కోటేశ్వరరావు ఆరోగ్యాన్నీ పట్టించుకోకుండా సోదాలు పూర్తయ్యేదాకా వారితోనే ఉంచుకున్నారని తెలిపింది. మార్గదర్శివే కాకుండా, ఖాతాదారులందరికీ చెందిన 12 ల్యాప్‌టాప్‌లు, 2 డేటా బ్యాకప్స్‌, 7 డెస్క్‌టాప్‌లలోని సమాచారాన్ని కాపీ చేసుకున్నారంది. మార్గదర్శితో సంబంధంలేని డాల్ఫిన్‌ హోటల్స్‌, ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్‌, ఉషోదయ పబ్లికేషన్స్‌, ఈటీవీ, మార్గదర్శి ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ లీజింగ్‌ కంపెనీ లిమిటెడ్‌, ఎల్‌.చిమన్‌లాల్‌ ఇండస్ట్రీస్‌లకు చెందిన సమాచారాన్ని తీసుకెళ్లారంది.

పంచనామాలో తప్పులు

సోదాల తర్వాత రూపొందించిన పంచనామాలో తప్పులుండటంతో అందులో సంతకం చేయడానికి కోటేశ్వరరావు నిరాకరించారంది. అయితే పంచనామా కాపీని ఇవ్వడం గానీ, వదిలిపెట్టి వెళ్లడం గానీ చేయలేదని తెలిపింది. సీఆర్‌పీసీ సెక్షన్‌ 165, 166లకు విరుద్ధంగా సోదాలు జరిగాయంది. చట్టప్రకారం కేసుతో సంబంధం ఉన్న వివరాలను తీసుకెళ్లాలని, దానికి విరుద్ధంగా సంబంధం లేని వాటిని, ఇతర ఖాతాదారుల సమాచారాన్ని తీసుకెళ్లారని సంస్థ తెలిపింది. అందువల్ల ప్రధాన పిటిషన్‌లోని అభ్యర్థనను సవరించడానికి అనుమతించాలని, తీసుకెళ్లిన సమాచారాన్ని కాపీ చేసుకోకుండా తిరిగి ఇచ్చేలా ఆదేశించాలని కోరింది. లేనిపక్షంలో తమకు తీవ్రనష్టం వాటిల్లుతుందని పేర్కొంది. సోదా నోటీసులను రద్దుచేయాలని కోరింది. దీనిపై ఏపీ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేస్తూ కౌంటరు దాఖలు చేస్తామనడంతో న్యాయమూర్తి జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి అనుమతిస్తూ విచారణను ఈ నెల 13కు వాయిదా వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని