సంక్షిప్త వార్తలు(3)

ఉపాధ్యాయుల పదోన్నతులను మాన్యువల్‌గా నిర్వహించాలని, బదిలీల్లోని అసంబద్దాలను తొలగించాలని డిమాండ్‌ చేస్తూ ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) ఆదివారం నిరసనలకు పిలుపునిచ్చింది.

Updated : 28 May 2023 05:44 IST

ఫ్యాప్టో ఆధ్వర్యంలో నేడు నిరసనలు

ఈనాడు, అమరావతి: ఉపాధ్యాయుల పదోన్నతులను మాన్యువల్‌గా నిర్వహించాలని, బదిలీల్లోని అసంబద్దాలను తొలగించాలని డిమాండ్‌ చేస్తూ ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) ఆదివారం నిరసనలకు పిలుపునిచ్చింది. జిల్లా విద్యాధికారుల కార్యాలయ వద్ద నిరసనలు నిర్వహించి, వినతిపత్రాలు సమర్పించాలని నిర్ణయించింది. బదిలీల్లో ప్రధానోపాధ్యాయులకు ఐదేళ్లు సర్వీసు ఉంటే తప్పనిసరి బదిలీ అనే నిబంధన పెడతామని చర్చల సందర్భంగా చెప్పి, ఇప్పుడు ఐదు అకడమిక్‌ సంవత్సరాలుగా పెట్టారని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ఎంపీడీవోలుగా తాత్కాలిక పదోన్నతులు

ఈనాడు, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా వివిధ మండల పరిషత్‌ కార్యాలయాల్లో పనిచేస్తున్న 205 మంది పరిపాలనాధికారులు, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి విస్తరణాధికారులకు తాత్కాలిక ప్రాతిపదికన మండల పరిషత్‌ అభివృద్ధి అధికారులు(ఎంపీడీవో)గా పదోన్నతులు కల్పించినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ ఎ.సూర్యకుమారి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పదోన్నతులు పొందిన వారిలో 112 మంది పరిపాలనాధికారులు, 93 మంది విస్తరణాధికారులు ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు.


షార్లెట్‌లో తెలుగు వారసత్వ దినోత్సవంగా మే 28

ఈనాడు, అమరావతి: అమెరికాలోని షార్లెట్‌ నగర మేయర్‌ వీఐ అలెగ్జాండర్‌ లైల్స్‌ మే 28ని ‘తెలుగు వారసత్వ దినోత్సవం’గా ప్రకటించారు. ఈ మేరకు ఆయన తాజాగా ప్రకటన విడుదల చేశారు. తెలుగు సుదీర్ఘకాలంగా మనుగడలో ఉన్న భాష అని, భారత ప్రభుత్వం గుర్తించిన ఆరు సంప్రదాయ భాషల్లో తెలుగు ఒకటిగా ఉందని అన్నారు. ‘తెలుగు మాట్లాడేవారు ప్రపంచవ్యాప్తంగా దాదాపు ప్రతి దేశంలోనూ ఉన్నారు. అమెరికా రాష్ట్రాల్లో 2018 నాటికే వేగంగా అభివృద్ధి చెందుతున్న భాషగా తెలుగు నిలిచింది. గ్రేటర్‌ షార్లెట్‌ ప్రాంతంతో పాటు దేశవ్యాప్తంగా తెలుగు సంఘాలు ఉన్నాయి. ఈ ప్రాంతానికి చెందిన తెలుగు అసోసియేషన్‌ అనేక కార్యక్రమాలకు విరాళాలు అందిస్తోంది’’ అని ఉత్తర్వుల్లో అలెగ్జాండర్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని