జైల్లో భాస్కరరెడ్డికి ప్రత్యేక వసతులు

మాజీమంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన వై.ఎస్‌.భాస్కరరెడ్డికి చంచల్‌గూడ జైలులో ప్రత్యేక కేటగిరీ కింద వసతులు కల్పించాలని హైదరాబాద్‌ జిల్లా మేజిస్ట్రేట్‌కు శుక్రవారం సీబీఐ కోర్టు సిఫారసు చేసింది.

Updated : 03 Jun 2023 06:48 IST

సీబీఐ కోర్టు న్యాయమూర్తి సిఫారసు

ఈనాడు, హైదరాబాద్‌: మాజీమంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన వై.ఎస్‌.భాస్కరరెడ్డికి చంచల్‌గూడ జైలులో ప్రత్యేక కేటగిరీ కింద వసతులు కల్పించాలని హైదరాబాద్‌ జిల్లా మేజిస్ట్రేట్‌కు శుక్రవారం సీబీఐ కోర్టు సిఫారసు చేసింది. నిబంధనల మేరకు భాస్కరరెడ్డికి ప్రత్యేక వసతులపై జైలు అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేయాలని ఆదేశించింది. వివేకా హత్య కేసులో ఏప్రిల్‌ 16న అరెస్టయిన భాస్కరరెడ్డి తనకు ప్రత్యేక కేటగిరీ కింద వసతులు కల్పించాలని పిటిషన్‌ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన సీబీఐ ప్రత్యేక కోర్టు ప్రధాన న్యాయమూర్తి సీహెచ్‌.రమేశ్‌బాబు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ సామాజిక హోదా, జీవన సరళి, విద్య, ఆదాయపు పన్ను తదితర వివరాలను పరిగణనలోకి తీసుకుని నిందితులను వర్గీకరించి ప్రత్యేక సదుపాయాలు కల్పించాల్సి ఉందన్నారు. భాస్కరరెడ్డి సమాజంలో గౌరవనీయమైన వ్యక్తి అని, రాజకీయాల్లో ఉంటూ పేదలకు అండగా ఉంటున్నారన్నారు. ఆయనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని, ప్రత్యేక వసతులు అవసరమని పేర్కొన్నారు. దీంతో న్యాయమూర్తి ఏకీభవించారు. భాస్కరరెడ్డి బెయిల్‌ పిటిషన్‌ పైనా విచారణ జరిగింది. ఆయన తరఫున ఇ.ఉమామహేశ్వరరావు వాదనలు వినిపించారు. కౌంటరు దాఖలు చేయాలని సీబీఐని ఆదేశిస్తూ కోర్టు విచారణను జూన్‌ 5కు వాయిదా వేసింది.

కస్టడీ పొడిగింపు

వివేకా హత్య కేసు నిందితులు ఎర్ర గంగిరెడ్డి, వై.సునీల్‌యాదవ్‌, గజ్జల ఉమాశంకర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డిలు శుక్రవారం సీబీఐ కోర్టు ముందు హాజరయ్యారు. కోర్టు వారి జ్యుడిషియల్‌ కస్టడీని 16 వరకు పొడిగించింది. దస్తగిరి హాజరు నుంచి మినహాయింపు పొందారు. ఈ కేసులో సీబీఐకి సహకరించేందుకు అనుమతివ్వాలంటూ వివేకా కుమార్తె సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై శివశంకర్‌రెడ్డి, ఉమాశంకర్‌రెడ్డిల తరఫు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసు విచారణను ప్రాసిక్యూషన్‌ చూసుకుంటుందని, ఇందులో ఇతరులకు అవకాశం ఇవ్వరాదన్నారు. ఇందులో భాస్కరరెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డిలు కౌంటర్లు దాఖలు చేయలేదు. దీనిపై సునీత తరఫు వాదనల నిమిత్తం కోర్టు విచారణను ఈనెల 5కు వాయిదా వేసింది.

వివేకా లేఖపై విచారణ వాయిదా

మరణానికి ముందు వివేకా రాసిన లేఖను నిన్‌ హైడ్రిన్‌ పరీక్షకు పంపడానికి అనుమతించాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం సీబీఐ కోర్టు విచారణ చేపట్టింది. లేఖను పరీక్షకు పంపడంపై గంగిరెడ్డి, సునీల్‌ యాదవ్‌లు అభ్యంతరం వ్యక్తం చేశారు. సీబీఐ తదుపరి వాదనల నిమిత్తం విచారణను ఈనెల 5కు వాయిదా వేసింది. వివేకా లేఖను నిన్‌ హైడ్రిన్‌ పరీక్షకు పంపి బలవంతంగా రాయించిన వారి వేలి ముద్రలను కనిపెట్టడానికి సీబీఐ ప్రయత్నిస్తోంది. అయితే ఈ పరీక్షలో చేతిరాత దెబ్బతింటుందని సీఎఫ్‌ఎస్‌ఎల్‌ చెప్పడంతో లేఖ నకలును రికార్డుల్లో ఉంచుకుని, లేఖను పరీక్షకు పంపడానికి అనుమతించాలని సీబీఐ కోరిన విషయం విదితమే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని