JEE Advanced: నేడు జేఈఈ అడ్వాన్స్‌డ్‌

దేశంలోని 23 ఐఐటీల్లో వచ్చే విద్యా సంవత్సరం (2023-24) బీటెక్‌ సీట్ల భర్తీకి ఆదివారం జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష నిర్వహించనున్నారు.

Updated : 04 Jun 2023 08:14 IST

తెలుగు రాష్ట్రాల నుంచి పోటీపడనున్న 35 వేల మంది

ఈనాడు, హైదరాబాద్‌: దేశంలోని 23 ఐఐటీల్లో వచ్చే విద్యా సంవత్సరం (2023-24) బీటెక్‌ సీట్ల భర్తీకి ఆదివారం జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష నిర్వహించనున్నారు. జేఈఈ మెయిన్‌లో కటాఫ్‌ మార్కులు పొంది ఉత్తీర్ణులైన 2.50 లక్షల మంది అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాయడానికి అర్హులు కాగా...వారిలో సుమారు 1.90 లక్షల మందే పోటీపడనున్నారు. వారిలో తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 35 వేల మంది ఉంటారని అంచనా. ఆన్‌లైన్‌ విధానంలో ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్‌-2 పరీక్ష జరుపుతారు. రెండు పేపర్లు రాసిన వారిని మాత్రమే ర్యాంకింగ్‌కు పరిగణనలోకి తీసుకుంటారు. ఈసారి కొత్త సిలబస్‌ ఆధారంగా పరీక్ష ఉంటుంది. ఆ సిలబస్‌ను 2021 నవంబరులోనే వెల్లడించారు. పరీక్ష ఫలితాలను ఈనెల 18న వెల్లడిస్తారు. అడ్వాన్స్‌డ్‌ ర్యాంకు ఆధారంగా ఐఐటీలే కాకుండా దేశవ్యాప్తంగా మరికొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు ప్రవేశాలు కల్పిస్తాయి. గత విద్యా సంవత్సరం (2022-23) అన్ని ఐఐటీల్లో 16,598 సీట్లు అందుబాటులో ఉండగా...ఈసారి మరో 200 వరకు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. సుమారు 42 వేల మందిని జోసా కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అర్హత కల్పిస్తారు.

ఎన్ని మార్కులకో తెలియని పరీక్ష..

పరీక్ష అంటే ఎన్ని మార్కులకు ఉంటుందో ముందుగానే విద్యార్థులకు తెలుస్తుంది. ఉదాహరణకు జేఈఈ మెయిన్‌ 300 మార్కులకు, నీట్‌-720, ఎంసెట్‌-160,  గేట్‌ 100 మార్కులకు పరీక్ష జరుపుతారు. అందుకు భిన్నంగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఉంటుంది. పరీక్ష రాసే వరకు ఈసారి ఎన్ని మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుందో తెలియదు. ఒక్కోసారి ఒక్కోవిధంగా మార్కులు ఉంటాయి. ఉదాహరణకు 2021, 2022లలో 360, 2020లో 396, 2019లో 372 మార్కులకు పరీక్ష జరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని