ధీమా లేదు.. బీమా రాదు!

జగన్‌ అంటే రివర్స్‌ కదా...  అధికారం అప్పగిస్తే అల్లకల్లోలం చేశారు... సాఫీగా సాగుతున్న పద్ధతిని సంక్లిష్టం చేశారు..! కౌలు కార్డులంటూ కష్టాలు తెచ్చారు... విత్తనాలు లేవు... విత్తమూ ఇవ్వలేదు...  బీమా దక్కలేదు.. పంటలకు, జీవితాలకు ధీమా కల్పించలేదు... ప్రాణాలు వదిలేసినా...

Updated : 09 May 2024 08:34 IST

జగన్‌  హయాంలో చితికిన కౌలు బతుకు
కౌలు కార్డులివ్వలేదు... సాగుకు దన్నుగా నిలవలేదు
తెదేపా హయాంలో ఏడాదికి రూ.4 వేల కోట్ల పంట రుణాలు
అందులో సగమైనా ఇవ్వని వైకాపా సర్కారు

జగన్‌ అంటే రివర్స్‌ కదా...  అధికారం అప్పగిస్తే అల్లకల్లోలం చేశారు... సాఫీగా సాగుతున్న పద్ధతిని సంక్లిష్టం చేశారు..! కౌలు కార్డులంటూ కష్టాలు తెచ్చారు... విత్తనాలు లేవు... విత్తమూ ఇవ్వలేదు...  బీమా దక్కలేదు.. పంటలకు, జీవితాలకు ధీమా కల్పించలేదు... ప్రాణాలు వదిలేసినా... అయ్యో..! అన్న పాపాన పోలేదు!! పైగా ఇతరులకంటే గొప్పగా చేశామంటూ అబద్ధాల వల్లెవేత!

జగన్‌ గద్దెనెక్కింది మొదలు కౌలు రైతుకు అన్నీ కష్టాలే. రాయితీ  పథకాలు లేవు. పెట్టుబడి సాయం అందలేదు. తెదేపా హయాంలో (2019 వరకు) భూమి యజమాని పట్టా పుస్తకం నకలు చూపించి వేలిముద్ర వేస్తే కౌలు రైతుకు రాయితీ విత్తనాలిచ్చేవారు. వైకాపా వచ్చాక అది తీసేశారు. గత ప్రభుత్వంలో ఏడాదికి రూ.4వేల కోట్లకుపైగా పంట రుణాలు ఇప్పించేవారు. జగన్‌ అందులో సగమైనా ఇవ్వలేదు. రైతు భరోసా రూపంలోనే రూ.9,639 కోట్లు ఎగ్గొట్టారు. వైకాపా అధికారం చేపట్టిన నాటి నుంచి వస్తే వరదలు... లేదంటే కరవు. కూలీనాలీ చేసుకుని సంపాదించుకున్న సొమ్ముతోపాటు అప్పులు తెచ్చి పెట్టుబడి పెడితే... తిరిగి పైసా చేతికి దక్కక అల్లాడిన వారు లక్షల్లో ఉన్నారు. కౌలు రైతులు అధికంగా ఉండే ఉమ్మడి గోదావరి జిల్లాలు, గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో పరిస్థితి మరింత దారుణం. సర్కారు అస్తవ్యస్త విధానాలతో కౌలు రైతుల్లో సగటున 5% మందికైనా ప్రభుత్వ పథకాలు అందలేదు. ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు సాయం అందించడంలో మోకాలొడ్డిన ఘనత జగన్‌కే దక్కుతుంది.

గుర్తింపే లేదు... కార్డులిచ్చేందుకూ కొర్రీలు

కౌలు రైతులకు 11 నెలల కాలానికి పంట సాగుదారు హక్కు (సీసీఆర్‌సీ) కార్డులు ఇచ్చి ప్రభుత్వ ప్రయోజనాలన్నీ వర్తింపజేస్తామంటూ 2019లో జగన్‌ సర్కారు ప్రత్యేక చట్టం తెచ్చినా ఒనగూరిందేమీ లేదు. వారికి కార్డులు ఇవ్వడానికి అనేక కొర్రీలు పెట్టింది. పదేళ్ల కిందటి లెక్కల ప్రకారమే రాష్ట్రంలో 24 లక్షల మంది కౌలు రైతులు ఉన్నట్లు అంచనా. ఇందులో వీరిలో కార్డులు అందుకునే వారు సగటున ఏడాదికి 5 లక్షల మంది మాత్రమే. అందులోనూ ఎకరమో... అర ఎకరమో భూమి ఉన్న వారే అధికం. దాంతో సొంత    భూమిపై దక్కే ప్రయోజనాలనే కౌలు కార్డుల కింద ఇచ్చినట్లు చూపిస్తున్నారు. కార్డులు అందకపోవడంతో లక్షల మంది కౌలు రైతులకు... రాయితీ విత్తనాలను, పంట రుణాలను ఇవ్వలేదు. సున్నా వడ్డీని దూరం చేశారు. రైతు భరోసాకు మొండిచేయి చూపారు. పంట నష్టపోతే పెట్టుబడి సాయం అందివ్వలేదు. పంటల బీమాను వర్తింప చేలేదు. అష్టకష్టాలు పడి సాధించిన దిగుబడులను అమ్ముకోవడానికి వస్తే... కార్డు లేదంటూ తిరస్కరించారు. ఆత్మహత్య చేసుకున్న బాధిత కుటుంబాలకు రూ.7 లక్షల పరిహారమూ ఇవ్వడంలేదు.

పెట్టుబడి సాయానికీ అర్హులు కారట... 

జగన్‌ అధికారంలోకి వచ్చాక వరదలు లేదంటే కరవు వేధిస్తున్నాయి. దీనికి పెట్టుబడి సాయంగా సగటున ఎకరానికి రూ.4 వేల నుంచి రూ.5 వేలు ఇస్తున్నారు. ఈ కొద్దిపాటి మొత్తానికి కూడా కౌలు రైతులు అర్హులు కాలేకపోతున్నారు. ఐదేళ్లలో జగన్‌ సర్కారు రాష్ట్రంలోని మొత్తం రైతుకు ఇచ్చిన మొత్తం పెట్టుబడి రాయితీ రూ.3,261 కోట్లు. ఇందులో కౌలు రైతులకు దక్కింది రూ.253 కోట్లు మాత్రమే. ఇది 7.75% మాత్రమే కావడం గమనార్హం.

నిరుపేదలు, కూలీలే అధికం

కౌలుదారుల్లో 95%పైగా నిరుపేద కూలీలే. వ్యవసాయ పనులు చేస్తూ సంపాదించిన మొత్తాన్ని పెట్టుబడిగా పెడుతున్నారు. ఎకరా కౌలుకు తీసుకుని సాగు చేస్తే.. పిల్లల చదువులకైనా ఉపయోగపడతాయని ఆశ. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితులతో వారికి అప్పులే మిగులుతున్నాయి. వాటిని తీర్చడానికి మళ్లీమళ్లీ కౌలు చేస్తూ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఇలాంటి వీరిని ఉదారంగా ఆదుకోవాలనే ఆలోచన కూడా జగన్‌ సర్కారుకు లేకపోయింది.

ఐదేళ్లలో సరాసరిన 4.48% మందికే రైతు భరోసా

ఐదేళ్లలో రూ.9,639 కోట్ల ఎగవేత

జగన్‌ ప్రసంగం మొదలు పెడితే చాలు తమది రైతు సంక్షేమ ప్రభుత్వమంటూ అబద్ధాలను వల్లె వేయడంలో దిట్ట. రాష్ట్రంలో 15.36 లక్షల మంది కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తామని 2019లో జగన్‌ లేఖలు రాశారు. ఆయన మాటల ప్రకారమే ప్రతి రైతు కుటుంబానికి రూ.13,500 చొప్పున ఏడాదికి రూ.2,073 కోట్లు, ఐదేళ్లకు రూ.10,365 కోట్లు ఇవ్వాలి. కానీ, రాష్ట్రంలో 24 లక్షల మంది కౌలు రైతులుంటే... ఏడాదికి సరాసరిన 1,07,627 మందికి చొప్పున ఐదేళ్లలో రూ.726 కోట్లు మాత్రమే ఇచ్చారు. రైతుబిడ్డనని చెప్పే జగన్‌ కౌలు రైతులకు రూ.9,639 కోట్లు ఎగ్గొట్టారు. ఆర్‌బీకేలకు వెళ్తే... అక్కడ సీసీఆర్‌సీ కార్డు ఇస్తారన్న జగన్‌ హామీ నీటిమీద రాతే అయింది. పైగా.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లోని కొందరు కౌలు రైతులకే రైతు భరోసా వర్తింపజేశారు.

ఏడాదికి 80 వేల మంది అటవీ భూముల హక్కుదారులకు రూ.108 కోట్ల చొప్పున రైతు భరోసా ఇస్తున్నారు. అదీ వాస్తవ సాగుదారులకు దక్కడం లేదు. అధిక శాతం మందికి మొండి చేయి చూపిస్తున్నారు.

ఉచిత బీమా హుళక్కే?

జగన్‌ అధికారంలోకి వచ్చాక పంటల బీమాను అంతుచిక్కని రహస్యంగా మార్చేశారు. నిబంధనలేమిటో, నిపుణులెవరో, ఎవరికిస్తున్నారో చెప్పే వారే ఉండరు. కౌలు రైతుల విషయంలో మరింత మోసం చేశారు. నాలుగేళ్లలో పంటల బీమా పరిహారంగా మొత్తం రూ.7,087 కోట్లు చెల్లిస్తే... అందులో 3,54,378 మంది కౌలు రైతులకు దక్కింది రూ.731 కోట్లే కావడం గమనార్హం. సాగు చేస్తున్న మొత్తం భూవిస్తీర్ణంలో సగం పండిస్తున్న వీరికి బీమా పరిహారంలో ఇస్తున్న వాటా 10% మాత్రమే. ఈ పథకం వర్తించే వారి సంఖ్య ఏడాదికి సగటున 88 వేలే.

పంట రుణాల్లేవు... వడ్డీ రాయితీకి ‘సున్నా’

ఏపీలో ఏడాదికి రూ.1.48 లక్షల కోట్ల పంట రుణాలు ఇస్తున్నారు. రాష్ట్రంలో కనీసం 50% విస్తీర్ణంలో కౌలు రైతులు పంటలు వేస్తున్నారనుకున్నా... రూ.74 వేల కోట్ల రుణాలు వారికే దక్కాలి. వాస్తవానికి ఇలా జరగడం లేదు. దీంతో అధిక వడ్డీలకు ప్రైవేటుగా అప్పులు తెచ్చుకుని, వారంతా రుణాల ఊబిలో కూరుకుపోతున్నారు. 2019-20 సంవత్సరంలో రూ.2,304 కోట్లు ఇవ్వగా... తర్వాత ఏడాది రూ.1,000 కోట్లకే పరిమితం చేశారు. 2021-22లో రూ.1,744 కోట్లు, 2022-23లో రూ.1,566 కోట్లు, 2023-24లో రూ.1,675 కోట్ల రుణాలే కౌలు రైతులకు దక్కాయి. సున్నా వడ్డీ మాటే లేదు.

ఈనాడు, అమరావతి


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని