రక్త మాంసాలతో రాక్షస వ్యాపారం!

మన మందే... తాపించండి... బాగా తాపించండి... మంచి లేదు... మానవత్వం లేదు... మన పంట పండాలి... బొక్కసాలు నిండాలి... తయారు చేసేది మనోళ్లే... సరఫరా కూడా వాళ్లే... అమ్మకాలూ మన సొంతోళ్లే చూసుకుంటారు.

Published : 10 May 2024 09:18 IST

సొంత ఆదాయాన్ని పెంచుకుంటూ.... ప్రజల ఆరోగ్యాన్ని గుంజుకుంటూ...
ఆంధ్రాలో కనీవినీ ఎరుగని రీతిలో మద్యం దందా
తయారీ, కొనుగోలు, సరఫరా, విక్రయాలపై... వైకాపా నేతల గుత్తాధిపత్యం
అడ్డగోలుగా జే బ్రాండ్ల తయారీ
రూ.లక్ష కోట్ల లావాదేవీలు నగదు రూపంలోనే
ఈనాడు, అమరావతి

మన మందే... తాపించండి... బాగా తాపించండి... మంచి లేదు... మానవత్వం లేదు... మన పంట పండాలి... బొక్కసాలు నిండాలి... తయారు చేసేది మనోళ్లే... సరఫరా కూడా వాళ్లే... అమ్మకాలూ మన సొంతోళ్లే చూసుకుంటారు... పేదలను పిండి... పీల్చి...పిప్పిచేసి... వారి ఆరోగ్యాన్ని నిలువునా దోచేసి... కుటుంబాలను రోడ్లమీదకు ఈడ్చి... వేల కోట్లు వెనకేసుకుందాం... గొప్ప పాలకులమని టముకేసుకుందాం... ఇది జగన్‌ విష చరిత్ర...


‘మద్యాన్ని ఐదు నక్షత్రాల హోటల్‌కు పరిమితం చేస్తాను’ అన్నప్పుడే అర్థం చేసుకోవాల్సింది!
చుక్కలు చూపించేందుకు ‘సిద్ధ’మయ్యారని..

‘జే బ్రాండ్లు’ తెచ్చినప్పుడే గ్రహించాల్సింది!
జనం ప్రాణాలతో చెలగాటమాడేందుకు ప్రతినబూనారని..

‘మ్యానిఫెస్టో’ను పవిత్ర గ్రంథాలతో పోల్చినప్పుడే తెలుసుకోవాల్సింది!
ప్రజల రక్తమాంసాలతో వ్యాపారం చేసేందుకు ప్రణాళికలు వేశారని..

మద్యం ధరలు షాక్‌ కొట్టేలా ఉండాలన్నప్పుడే గుర్తించాల్సింది!
వ్యాపారాన్ని గుత్తాధిపత్యంలో ఉంచుకుని సొంత బొక్కసం నింపుకుంటారని..

ఒక్క అవకాశం ఎంత పనిజేసింది?!


‘జే బ్రాండ్ల’ మద్యం విక్రయాల ద్వారా ప్రజల్ని పీల్చిపిప్పి చేసేసిన జగన్‌మోహన్‌రెడ్డి... అందులో సరికొత్త దోపిడీ పర్వానికి తెరలేపి తన సొంత బొక్కసాన్ని నింపుకున్నారు. మద్యం తయారీ, కొనుగోలు, సరఫరా, విక్రయాలు వంటివన్నీ గుత్తాధిపత్యంలో ఉంచుకుని పెద్ద ఎత్తున దోచుకున్నారు. తన ప్రధాన కోటరీతో పాటు పార్టీ ముఖ్య నాయకులు, వారి సన్నిహితులు, వైకాపాకు కరుడుగట్టిన మద్దతుదారులైన అధికారులను ముందుంచి ఈ మొత్తం దందా నడిపించారు. మద్యం దుకాణాలన్నిటినీ ప్రభుత్వమే నిర్వహించేలా నూతన విధానం తీసుకొచ్చారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ప్రభుత్వ పెద్దల సన్నిహితులు, అధికార పార్టీ కీలక నేతల్లో కొందరు వారి బినామీల పేరిట మద్యం సరఫరా కంపెనీలు ఏర్పాటుచేశారు. రాష్ట్రంలోని డిస్టిలరీలు, బ్రూవరీలను సామ దాన బేధ దండోపాయాలు ప్రయోగించి చేజిక్కించుకున్నారు. అక్కడ ‘జే బ్రాండ్లు’ తయారుచేశారు. వీటితో పాటు నిర్దేశించిన కమీషన్‌ చెల్లించేందుకు అంగీకరించిన కంపెనీలకు మాత్రమే సరఫరా ఆర్డర్లు ఇచ్చారు. ఇవి తప్ప గతంలో ప్రాచుర్యం పొందిన బ్రాండ్లేవీ ప్రభుత్వ దుకాణాల్లో దొరక్కుండా చేశారు. వినియోగదారులు కోరుకునేవి కాకుండా.. ప్రభుత్వం అమ్మేవి మాత్రమే కొనుక్కోవాల్సిన పరిస్థితి కల్పించారు. అక్కడ కూడా డిజిటల్‌ చెల్లింపులకు ఆస్కారం లేకుండా కేవలం నగదు లావాదేవీలనే నిర్వహించారు. ఇలా ఆది నుంచి అంతం వరకూ మొత్తం మద్యం వ్యాపారాన్ని గుప్పిట్లో పెట్టుకుని కనీవినీ ఎరగని రీతిలో దోచుకున్నారు. దీనికోసం జగన్‌ అండ్‌ కో అవలంబించిన మోడెస్‌ అపరెండీ (నేర పద్ధతి)ని పరిశీలిస్తే ఎవ్వరైనా నివ్వెరపోవాల్సిందే  మరోవైపు 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రధానంగా పేర్కొన్న ‘దశలవారీ మద్య నిషేధం’ హామీకి మంగళం పాడేశారు. 2024 ఎన్నికల నాటికి మద్యాన్ని అయిదు నక్షత్రాల హోటళ్లకు పరిమితం చేశాకే ఓట్లు అడుగుతానన్న ఆయన.. ఇప్పుడు ఊరూరా తిరుగుతూ ఓట్లు అడుగుతున్నారు. అసలు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు? ఆ నైతిక హక్కు, అర్హత ఎక్కడిది? దీన్ని బట్టి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే నిబద్ధత, నైతికత జగన్‌కు లేనేలేదని తేటతెల్లమైపోయింది.


కమీషన్ల రూపంలో రూ.కోట్లు దోచారు...

జగన్‌ అధికారం చేపట్టినప్పటి నుంచి గత ఐదేళ్లలో 14.41 కోట్ల కేసుల మద్యం (ఐఎంఎల్‌), 5.85 కోట్ల కేసుల బీర్లు విక్రయించారు. ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ బెవరేజస్‌ కార్పొరేషన్‌ (ఏపీఎస్‌బీసీఎల్‌) వివిధ కంపెనీల నుంచి మద్యం కొనుగోలు చేసి.. వాటిని ప్రభుత్వ దుకాణాల్లో విక్రయించింది. ఒక్కో కేసు మద్యానికి (ఐఎంఎల్‌) రూ.250 చొప్పున, ఒక్కో కేసు బీరుకు రూ.150 చొప్పున ప్రభుత్వ పెద్దలకు కమీషన్‌గా చెల్లించేందుకు అంగీకరించిన కంపెనీలకు మాత్రమే ఏపీఎస్‌బీసీఎల్‌ సరఫరా ఆర్డర్లు ఇచ్చారని, ఈలెక్కన ఐదేళ్లలో మద్యం కొనుగోలు ఆర్డర్లు ఇచ్చినందుకు రూ.3,170.20 కోట్లు, బీరు ఆర్డర్లకు రూ.877 కోట్లు.. మొత్తం రూ.4,047.70 కోట్లు వరకూ కమీషన్ల రూపంలో ‘ప్రభుత్వ పెద్ద’కు చేరాయనే ఫిర్యాదులున్నాయి.

  • జగన్‌ హయాంలో అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీల్లో ఒకటైన అదాన్‌ డిస్టిలరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌... వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు పెనక రోహిత్‌రెడ్డి బినామీ సంస్థ అనే ఫిర్యాదులున్నాయి. దీనికి సొంతంగా ఒక్క డిస్టిలరీ యూనిట్‌ కూడా లేదు. విశాఖ డిస్టిలరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, పీఎంకే డిస్టిలేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఏస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌లను సబ్‌ లీజు పేరిట ఆధీనంలోకి తీసుకుని ‘జే బ్రాండ్‌’ను ఉత్పత్తిచేశారు. వైకాపా ప్రభుత్వం కొత్త మద్యం విధానాన్ని అమల్లోకి తెచ్చిన రెండు నెలల తర్వాత 2019 డిసెంబరు 2న ‘అదాన్‌ డిస్టిలరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ సంస్థ హైదరాబాద్‌లో పురుడు పోసుకుంది. కాశీచయనుల శ్రీనివాస్‌, ముప్పిడి అనిరుధ్‌రెడ్డి డైరెక్టర్లుగా ఇది ఏర్పాటైంది. కాశీచయనుల శ్రీనివాస్‌... వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు పెనక రోహిత్‌రెడ్డి డైరెక్టర్‌గా కొనసాగిన శ్రేయాస్‌ బయోలాజికల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో కొన్నాళ్ల పాటు డైరెక్టర్‌గా కొనసాగారు. ముప్పిడి అనిరుధ్‌రెడ్డి... కొన్నాళ్ల క్రితం వరకు రాష్ట్ర ప్రభుత్వ ఐటీ సలహాదారుగా పనిచేసిన, సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడైన కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి తోడల్లుడు. ఏ కంపెనీ నుంచి ఎంత మద్యం కొనాలి? దుకాణాల్లో ఏ రోజు ఏ బ్రాండ్‌ల మద్యం అమ్మాలి? అన్నది రాజశేఖర్‌రెడ్డి ఆదేశాల మేరకే జరిగింది. కేవలం 25నెలల వ్యవధిలో ఏకంగా రూ.1,164.86 కోట్ల విలువైన మద్యం సరఫరాకు ఈ కంపెనీకి ఆర్డర్లు ఇచ్చారు. గత నాలుగున్నరేళ్లలో ఈ కంపెనీకి లభించిన సరఫరా ఆర్డర్లు లెక్కిస్తే ఆ విలువ చాలా ఎక్కువ ఉంటుంది. ఈ కంపెనీ సరఫరా చేసిన అదాన్స్‌ సుప్రీం బ్లెండ్‌ సుపీరియర్‌ గ్రెయిన్‌ విస్కీ, 9 సీ హార్సెస్‌ విస్కీ, ఏసీ బ్లాక్‌ రిజర్వు విస్కీ వంటివి ప్రభుత్వ దుకాణాల్లో ఎక్కువగా అమ్మారు.
  • నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రోస్‌ ఇండస్ట్రీస్‌ను వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డి తన గుప్పిట్లో పెట్టుకున్నారనే ఫిర్యాదులున్నాయి. ఈ కంపెనీకి 2019 అక్టోబరు 2 నుంచి 2021 నవంబరు మధ్య ఏకంగా రూ.1,863.12 కోట్ల విలువైన 1.16 కోట్ల కేసుల మద్యం సరఫరా ఆర్డర్లు ఇచ్చారు. ఈ కంపెనీ నుంచి వచ్చిన దారుహౌస్‌ ఎక్స్‌వో బ్రాందీతో పాటు ఇతర బ్రాండ్లను ప్రభుత్వ దుకాణాల్లో ఎక్కువగా అమ్మారు. వీటితో పాటు ఎంఎస్‌ బయోటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు, శర్వానీ ఆల్కో బ్రూవరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఎస్‌ఎన్‌జే సుగర్స్‌ అండ్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌ తదితర కంపెనీలకు ఎక్కువ ఆర్డర్లు లభించాయి.

కొత్త ప్రాంతాల్లోకి విస్తరణ

దశలవారీ మద్య నిషేధం అంటే దాని లభ్యతను తగ్గించాలి. కానీ జగన్‌ మాత్రం గతంలో బార్‌లు లేని ప్రాంతాల్లోనూ అవి ఏర్పాటు చేసుకునేందుకు వీలు కల్పించారు. కొత్తగా ఏర్పాటైన పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లోనూ వాటిని ఏర్పాటు చేయించారు. గతంలో నగర సరిహద్దుల నుంచి 5 కిలోమీటర్ల వరకూ, పట్టణ సరిహద్దుల నుంచి 2 కిలోమీటర్ల వరకూ మాత్రమే బార్‌లు పెట్టే వీలుండేది. నగరపాలక సంస్థల సరిహద్దుల నుంచి 10 కిలోమీటర్ల దూరం వరకూ, పురపాలక సంఘాల సరిహద్దుల నుంచి 3 కిలోమీటర్ల దూరం వరకూ బార్లు పెట్టుకునే అవకాశమిచ్చారు. దీంతో నగరాలు, పట్టణాలకు దూరంగా ఉన్న కొత్త ప్రాంతాల్లోనూ బార్లు వచ్చాయి. మద్యం లభ్యత విపరీతంగా పెరిగింది. పర్యాటక ప్రాంతాల్లో బార్‌ల ఏర్పాటుకు లైసెన్సులు ఇచ్చారు.


ఒక్క హామీ... వంద తూట్లు!

‘మద్యం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుందేమోకానీ.. దానివల్ల ప్రజలు ఎన్నోరెట్లు నష్టపోతున్నారు. అందుకే రేపటి మన ప్రజాప్రభుత్వం మద్యాన్ని నిషేధిస్తుంది’ అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన జగన్‌.. అధికారంలోకి రాగానే ఆ హామీని సమాధి చేశారు. అంతేనా... మరింత తాగేలా ప్రోత్సహించి డబ్బు కోసం ఏదైనా చేసేందుకు సిద్ధపడ్డారు.

ఏకంగా తాకట్టు పెట్టారు!

రాబోయే కొన్నేళ్లలో మద్యంపై వచ్చే ఆదాయాన్ని హామీగా చూపించి ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ బెవరేజస్‌ కార్పొరేషన్‌ (ఏపీఎస్‌బీసీఎల్‌) ద్వారా వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చారు. ప్రజలతో మరింత తాగించి, తద్వారా ఆదాయం సమకూర్చుకొని అప్పులు తీర్చటమే తమ ప్రభుత్వ విధానమని తేల్చేశారు. మద్యం వ్యాపారాన్ని విపరీతంగా విస్తరించారు. కొందరు వ్యసనపరులు ఇంట్లో వస్తువులు తాకట్టు పెట్టేసి మరీ మద్యం కొంటారు. అలాంటి తాగుబోతుల్నే తాకట్టు పెట్టేసి వారిపై అప్పులు తెచ్చిన ఘనత మాత్రం జగన్‌కే దక్కింది.

దశలవారీ మద్య నిషేధమంటే ఏటా మద్యం దుకాణాల సంఖ్యను క్రమంగా తగ్గించుకుంటూ రావాలి. కానీ 2020 మార్చి 22 నుంచి ఇప్పటివరకూ జగన్‌... ఒక్కటంటే ఒక్క దుకాణాన్నీ తగ్గించలేదు.  గత ఐదేళ్లలో రాష్ట్రంలో విక్రయాల విలువ ఏకంగా 43.72 శాతం పెరిగింది. రూ.9,150 కోట్ల విలువైన మద్యాన్ని అదనంగా విక్రయించారు. పర్యాటక కేంద్రాల పేరిట ఎక్కడికక్కడే పెద్ద ఎత్తున లిక్కర్‌ అవుట్‌లెట్లు ఏర్పాటు చేశారు. మద్యం విక్రయాలు పెంచేందుకు వాకిన్‌ స్టోర్‌లు నెలకొల్పారు.  బార్ల సంఖ్యను తగ్గించలేదు సరికదా... ఏకంగా 2025 ఆగస్టు 31 వరకూ కాలపరిమితి ఉండేలా లైసెన్సులు జారీచేశారు. తాజా మ్యానిఫెస్టోలో మద్య నిషేధం ప్రస్తావనే లేదు.

ధరలు పెంచి మరీ దోచారు!

మద్యం ధరలు పెంచినా.. తగ్గించినా తద్వారా ఆదాయం పెంచుకోవటమే జగన్‌ లక్ష్యమైంది. 2014-19 మధ్య తెదేపా హయాంతో పోలిస్తే.. గత ఐదేళ్ల జగన్‌ జమానాలో మద్యం విక్రయాల విలువ 65.14 శాతం పెరిగింది. తెదేపా పాలనలో కంటే వైకాపా పాలనలో రూ.49,047 కోట్ల విలువైన మద్యాన్ని అదనంగా విక్రయించారు.

మద్యం ఆదాయంతో... సంక్షేమమా?

మద్యంపై వచ్చే ఆదాయంతోనే చేయూత, అమ్మఒడి, ఆసరా వంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తామంటూ ఏకంగా చట్టమే చేశారు. బలహీనతను ఆసరాగా చేసుకుని పేదల నుంచి ఆదాయం పిండుకుని అదే డబ్బుతో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఇదే సంక్షేమ రాజ్యమని చెప్పడం జగన్‌కే చెల్లింది. వివిధ సంక్షేమ పథకాల కింద తాను ప్రజలకు పంపిణీ చేశానని జగన్‌మోహన్‌రెడ్డి చెప్పుకొంటున్న మొత్తం కంటే ఆయన తీసుకొచ్చిన ‘‘జే బ్రాండ్ల’’ వల్ల గత ఐదేళ్లలో ప్రజలు కోల్పోయిన, నష్టపోయిన సంపద విలువే ఎక్కువ. వైద్యచికిత్సల ఖర్చు రూపంలో ప్రజలు దాదాపు రూ.40 వేల కోట్లు నష్టపోయారు. ఉత్పాదకత దెబ్బతిని ఆయా కుటుంబాలు రూ.1.20 లక్షల కోట్లుపైనే ఆదాయాన్ని కోల్పోయాయి. ఇలా ఐదేళ్లలో ప్రజలు కోల్పోయిన, నష్టపోయిన మొత్తం సంపద విలువ రూ.3.14 లక్షల కోట్లు. లక్షల కుటుంబాలు కకావికలం అయ్యాయి.

కల్లె సుబ్బమ్మకు ఇచ్చిన మాట గుర్తులేదా జగన్‌?

‘‘కర్నూలు జిల్లా కంపమల్లమెట్ట గ్రామంలో మహిళలు వచ్చి నన్ను కలిశారు. మద్యం విచ్చలవిడిగా అందుబాటులోకి రావటంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కిష్టపాడు నుంచి వచ్చిన కల్లె సుబ్బమ్మ తాను తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నా... మద్యానికి బానిసైన తన భర్త పట్టించుకోవట్లేదని చెప్పారు. తనకు బతకాలని లేదంటూ కన్నీరు పెట్టుకుంది. ఆమె పరిస్థితి చూశాక నాకు తీవ్ర ఆవేదన కలిగింది. రేపటి మన ప్రజా ప్రభుత్వం మద్యాన్ని నిషేధించి.. నీ కష్టాన్ని తీరుస్తుందమ్మా అని సుబ్బమ్మకు భరోసా ఇచ్చా. మద్య నిషేధం చారిత్రక అవసరం’’ - ప్రతిపక్ష నేత హోదాలో చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర సందర్భంగా 2017 నవంబరు 18న డైరీలో జగన్‌మోహన్‌రెడ్డి రాసుకున్నారు. ఐదేళ్లు అధికారం చెలాయించినా మద్య నిషేధం చేయని మీకు కనీసం కల్లె సుబ్బమ్మకు ఇచ్చిన మాటైనా గుర్తుందా?


రూ.15వేల కోట్ల ఆర్డర్లు... వారి కంపెనీలకే

గత ఐదేళ్ల పాలనలో రూ.1.24 లక్షల కోట్ల విలువైన మద్యాన్ని జగన్‌ ప్రభుత్వం విక్రయించింది. ఎక్సైజ్‌ సుంకం, అదనపు ఎక్సైజ్‌ సుంకం, వ్యాట్‌ తదితర పన్నుల రూపంలో ప్రభుత్వానికి రూ.1.06 లక్షల కోట్ల మేర లాభం మిగిలింది. మిగిలిన రూ.18 వేల కోట్లు వ్యాపార నిర్వహణ కోసం ఖర్చయ్యింది. అందులో దాదాపు రూ.15వేల కోట్లు వివిధ కంపెనీల నుంచి మద్యం కొనుగోలుకు వెచ్చించారు. ఇందులో అత్యధిక శాతం ప్రభుత్వ పెద్దల సన్నిహితుల కంపెనీలకే చేరింది. ఏపీఎస్‌బీసీఎల్‌ వద్ద 100కు పైగా మద్యం సరఫరా కంపెనీలు నమోదై ఉండగా... వాటిలో 16 కంపెనీలకు మాత్రమే అత్యధిక ఆర్డర్లు ఇచ్చారు.


విష రసాయనాలున్నాయంటే..  ఎదురు దాడి

ఆంధ్రప్రదేశ్‌లో అమ్ముతున్న ‘‘జే బ్రాండ్ల’’లో పైరోగలాల్‌, ఐసోపులెరిక్‌ యాసిడ్‌, డై ఇథైల్‌ థాలేట్‌ వంటి హానికారక రసాయనాలున్నట్లు చెన్నైలోని ఎస్‌జీఎస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ల్యాబ్‌లో చేయించిన పరీక్షల్లో తేలిందని, అవి తాగటం ప్రాణాంతకమని ప్రతిపక్ష తెదేపా, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు నివేదికలు బయటపెట్టారు. అప్పుడైనా లోపాల్ని సరిదిద్దుకుని మద్య నిషేధం అమలు చేయకపోగా ‘‘ప్రభుత్వానికి మద్యం ఆదాయాన్ని తగ్గించేందుకు ప్రతిపక్షాలు విషపూరిత కుట్రకు తెరలేపాయి. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవాలనేదే వాటి ఉద్దేశం’’ అంటూ ప్రతిపక్షాలపై అసెంబ్లీలోనే జగన్‌ ఎదురుదాడికి దిగారు.


నగదు లావాదేవీల లోగుట్టు ఏంటి?

రాష్ట్రంలో చిన్న చిల్లర దుకాణం వద్ద చూసినా డిజిటల్‌ లావాదేవీలు ఉంటాయి. కానీ జగన్‌ ప్రభుత్వం గత ఐదేళ్లలో రూ.1.24 లక్షల కోట్ల విలువైన మద్యాన్ని కేవలం నగదు రూపంలోనే అమ్మింది. మొదట్లో మూడున్నరేళ్లపాటు అసలు డిజిటల్‌ చెల్లింపులకు చోటే కల్పించలేదు. గతేడాది ప్రభుత్వ దుకాణాల్లో డిజిటల్‌ చెల్లింపుల విధానాన్ని ప్రవేశపెట్టినా అది ఎక్కడా అమలుకు నోచుకోలేదు. ఈ మొత్తం దందాలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్న ఫిర్యాదులున్నాయి. ప్రభుత్వంలోని కీలక పెద్దకు అవినీతి సొత్తంతా చేరుతోందని, నల్లధనం పోగుపడుతోందని ప్రతిపక్షాలు తొలి నుంచీ గగ్గోలు పెడుతున్నాయి. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తున్నాయి.


దిల్లీ కుంభకోణంలో.. ఆంధ్రా కోణం!

  • దిల్లీ మద్యం కుంభకోణం అభియోగాలు ఎదుర్కొంటున్న ట్రైడెంట్‌ కెమ్‌ఫర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు, ఏపీలోని అదాన్‌కు మధ్య విడదీయరాని సంబంధముంది. దిల్లీ మద్యం కుంభకోణం కేసులో వైకాపా పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడైన పెనక శరత్‌చంద్రారెడ్డిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కొన్నాళ్ల క్రితం అరెస్టుచేసింది. ఈ కుంభకోణంలో ఆయనే చక్రం తిప్పారని.. దిల్లీ మద్యం వ్యాపారంలో 30 శాతం ఆయన గుప్పిట్లోనే ఉందని ఈడీ వెల్లడించింది. ట్రైడెంట్‌ కెమ్‌ఫర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో పాటు మరికొన్ని బినామీ సంస్థల ద్వారా ఈ వ్యవహారాలు నడిపించారని పేర్కొంది. అదాన్‌ డిస్టిలరీస్‌ వ్యవస్థాపక డైరెక్టర్లలో ఒకరైన కాశీచయనుల శ్రీనివాస్‌ ఈ ట్రైడెంట్‌ కెమ్‌ఫర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లోనే గతంలో సీఎఫ్‌వోగా పనిచేశారు.
  • ట్రైడెంట్‌ కెమ్‌ఫర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలో 99.99 శాతం వాటాలు ఆర్‌పీఆర్‌ సన్స్‌ అడ్వయిజర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరిట ఉన్నాయి. ఆర్‌పీఆర్‌ సన్స్‌ కంపెనీలో విజయసాయిరెడ్డి అల్లుడు పెనక రోహిత్‌రెడ్డి 2021 ఏప్రిల్‌ 21న డైరెక్టర్‌గా చేరారు. ఆయనతో పాటు పెనక వెంకట రామ్‌ప్రసాద్‌రెడ్డి, పి.సుశీలరాణి డైరెక్టర్లుగా ఉన్నారు.
  • పెనక రోహిత్‌రెడ్డి డైరెక్టర్‌గా ఉన్న శ్రేయాస్‌ బయోలాజికల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో కాశీచయనులు శ్రీనివాస్‌లు 2021 జూన్‌ 19 వరకూ డైరెక్టర్‌గా కొనసాగారు. అందులో డైరెక్టర్‌గా ఉన్న సమయంలో ఆయన అదాన్‌ డిస్టిలరీని స్థాపించారు.
  • శ్రేయాస్‌ బయోలాజికల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌... దిల్లీ మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైడెంట్‌ కెమ్‌ఫర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ చిరునామాలు ఒకటే. హైదరాబాద్‌లోని మియాపూర్‌ సర్వే నంబరు 66, 67 చిరునామాలతో ఈ రెండు కంపెనీలు రిజిస్టరై ఉన్నాయి.
  • ట్రైడెంట్‌ కెమ్‌ఫర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో పెనక శరత్‌ చంద్రారెడ్డి 2007 ఫిబ్రవరి 21 నుంచి 2016 మే 27 వరకు డైరెక్టర్‌గా ఉన్నారు. ఆయన సోదరుడు, ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు పెనక రోహిత్‌రెడ్డి 2010 జనవరి 27 నుంచి 2018 మార్చి 9 వరకు డైరెక్టర్‌గా కొనసాగారు. ఇప్పుడు వారిద్దరూ సాంకేతికంగా ఆ కంపెనీలో డైరెక్టర్లుగా లేకపోయినా... దిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి దాఖలు చేసిన కస్టడీ రిపోర్టులో ట్రైడెంట్‌ సంస్థ శరత్‌చంద్రారెడ్డికి చెందిన గ్రూప్‌ కంపెనీగా గతంలో ఈడీ పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని