
ఉద్యోగం కోసం మొక్కుకున్నాడు.. ప్రాణాలిచ్చాడు
చెన్నై: ఉద్యోగం వస్తే దానం చేస్తాననో, కొండకు నడిచొస్తాననో, ఇతరులకు సాయపడతాననో మొక్కుకుంటారు. కానీ తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి వింత మొక్కుబడి ప్రాణాలు తీసుకునేలా చేసింది. పోలీసుల కథనం మేరకు.. ఆ రాష్ర్టంలోని కన్యాకుమారి జిల్లాకు చెందిన నవీన్ (32) వ్యక్తి చాలా ఏళ్లుగా ఉద్యోగం సంపాదించడం కోసం కష్టపడుతున్నాడు. ఈ క్రమంలో తనకు ఉద్యోగం వస్తే తన ప్రాణాలను దేవుడికి సమర్పిస్తానని, దేవుడిలో కలిసిపోతానని మొక్కుకున్నాడు.
ఈ నేపథ్యంలో పదిహేను రోజుల కిందట నవీన్కు ఓ బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. రెండు వారాలు ఉద్యోగం చేసిన నవీన్ శుక్రవారం కేరళలోని తిరువనంతపురంలో రైల్వేస్టేషన్ సమీపంలో విగతజీవిగా కనిపించాడు. రైలు పట్టాలపై పడుకున్న అతడిపై నుంచి రైలు పోవడం వల్ల మృతి చెందినట్లు పోలీసులు నిర్ధరించారు. సమాచారం అందుకున్న కన్యాకుమారి జిల్లాలోని నాగర్కోయిల్ రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడు వేసుకున్న దుస్తుల్లో ఉన్న సూసైడ్ నోట్ ఆధారంగా అతడి మొక్కుబడి విషయం వెలుగులోకి వచ్చింది. నవీన్ ఆత్మహత్య చేసుకున్నాడా? లేక హత్య జరిగిందా? అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.