Crime News: దిల్లీలో దారుణం.. నడిరోడ్డుపై 16 ఏళ్ల బాలికను కత్తితో పొడిచి హత్య..!

ఓ బాలికపై (Minor Girl) యువకుడు అనేకసార్లు కత్తితో పొడిచి చంపిన ఘటన దేశ రాజధాని దిల్లీలో (Delhi Crime) చోటుచేసుకుంది.

Updated : 29 May 2023 15:08 IST

దిల్లీ: దేశ రాజధాని (Delhi) దిల్లీలో దారుణం చోటుచేసుకుంది. 16 ఏళ్ల బాలికను ఓ యువకుడు అత్యంత పాశవికంగా పొడిచి చంపిన ఘటన కలకలం సృష్టించింది. అందరూ చూస్తుండగానే బాలికపై దాదాపు 20 సార్లు కత్తితో పొడిచాడు. అంతటితో ఆగని ఆ మానవ మృగం.. పెద్ద బండరాయితో బాలిక తలపై పలుసార్లు మోదాడు. ఇంత దారుణం జరుగుతున్నప్పటికీ.. అక్కడ ఉన్న ఒక్కరు కూడా అడ్డుకోకపోవడం గమనార్హం. ఈ వ్యవహారం మొత్తం అక్కడి సీసీటీవీల్లో (CCTV) రికార్డు అయ్యింది.

దిల్లీ రోహిణి ప్రాంతంలోని షాబాద్‌ డెయిరీ ప్రాంతానికి చెందిన ఓ పదహారేళ్ల బాలిక.. సాహిల్‌ అనే 20 ఏళ్ల యువకుడితో స్నేహంగా ఉంటోంది. ఈ క్రమంలో ఇటీవల వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అయితే, ఆదివారం సాయంత్రం ఓ స్నేహితురాలి ఇంట్లో పుట్టినరోజు వేడుకకు ఆ బాలిక బయలుదేరింది. ఇదే సమయంలో ఆమె వెంట వెళ్లిన ఆ యువకుడు.. బాలికపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. వీధిలో జరుగుతున్న ఈ దారుణాన్ని పలువురు చూసుకుంటూ వెళ్తున్నప్పటికీ, ఎవ్వరూ అతడిని నిలువరించడానికి ప్రయత్నించలేదు.

స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు షాబాద్‌ డెయిరీ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. దిల్లీ డీసీపీ సుమన్‌ నాల్వా మాట్లాడుతూ సాహిల్‌ను తొందరలోనే అరెస్టు చేస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు.

మరోవైపు ఈ ఘటనను దిల్లీ మహిళా కమిషన్‌ తీవ్రంగా పరిగణించింది. దిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ స్వాతి మాలివాల్‌  ట్విటర్‌లో స్పందించారు. ‘‘దిల్లీ షాబాద్‌ డెయిరీ వద్ద ఓ అమాయక బాలిక హత్యకు గురైంది. దిల్లీలో నేరగాళ్లకు అడ్డూ అదుపులేకుండా పోయింది. దీనిపై పోలీసులకు నోటీసులు జారీ చేశాము. అన్ని హద్దులను దాటేశారు. నా కెరీర్‌లో ఇంత ఘోరాన్ని నేను చూడలేదు’’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని