Chennai: మహిళ తలపై కొట్టి.. రోడ్డుపైకి లాక్కెళ్లి..!

తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. పట్టపగలు నడిరోడ్డుపై ఓ మహిళ తలపై కొట్టి ఆమె స్పృహ తప్పగానే రోడ్డుపైకి కొంతదూరం లాక్కెల్లి చోరీ చేశాడు ఓ దుండగుడు.

Published : 17 Mar 2023 01:22 IST

చెన్నై: పట్టపగలు నడిరోడ్డుపై ఓ మహిళ తలపై కొట్టి దొంగతనానికి పాల్పడిన ఘటన తమిళనాడులోని తిరుచ్చిలో ఆలస్యంగా వెలుగుచూసింది.  ఆమె స్పృహ కోల్పోగానే రోడ్డుపై నుంచి ఫుట్‌పాత్‌పైకి లాక్కెల్లి  చోరీకి ఒడిగట్టాడు ఆ దుండగుడు. ఇదంతా అక్కడున్న సీసీటీవీలో నిక్షిప్తమైంది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

పోలీసుల కథనం ప్రకారం.. తమిళనాడులోని అన్నా యూనివర్సిటీలో బాధితురాలు సీతాలక్ష్మి(53) ప్రొఫెసర్‌గా పని చేస్తోంది.  ఆమె ఓ ప్రైవేటు పాఠశాల సమీపంలో ఆదివారం ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తోంది. దొంగతనానికి అదే అదునుగా భావించిన నిందితుడు సెంథిల్‌కుమార్‌ ఆమె తలపై చెక్క పలకతో కొట్టేశాడు. దీంతో ఆమె స్పృహతప్పి పడిపోయింది. ఆమె కాళ్లు పట్టుకొని పుట్‌పాత్‌పైకి కొంతదూరం లాక్కెళ్లి... ఆమె ద్విచక్రవాహన తాళాలు స్వాధీనం చేసుకున్నాడు. ఆమె ఫోన్‌ను సైతం దొంగిలించి అక్కడ నుంచి పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుణ్ని గుర్తించి వెంబడించారు. ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న నిందితుడు పోలీసులను గమనించి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ రోడ్డు మధ్య విభాగినిని ఢీకొట్టాడు. దీంతో అతడి కాలికి గాయమైంది. పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని