
Covid Vaccine: టీకా వేసుకోకున్నా.. వేసుకున్నట్లు ధ్రువపత్రాలు
నలుగురిని అరెస్టు చేసిన కాలాపత్తర్ పోలీసులు
చార్మినార్, న్యూస్టుడే: కొవిడ్ టీకా వేసుకోకున్నా.. వేయించుకున్నట్లు ధ్రువపత్రాలు తయారు చేసి, విక్రయిస్తున్న ముఠాకు చెందిన నలుగురిని కాలాపత్తర్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. చరవాణులు, కొన్ని ధ్రుపత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఇన్స్పెక్టర్ సుదర్శన్, డీఐ విక్రమ్సింగ్తో కలిసి చార్మినార్ ఏసీపీ భిక్షంరెడ్డి వివరాలు వెల్లడించారు. కాలాపత్తర్లోని అలీబాగ్కు చెందిన మహ్మద్ సైఫ్(19) సరూర్నగర్లోని ఓ వ్యాక్సినేషన్ కేంద్రంలో డేటా ఎంట్రీ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. ఇతర రాష్ట్రాలు, విదేశాలకు వెళ్లే వారికి టీకా వేసుకున్నట్లు నిర్ధారణ పత్రాలు తప్పనిసరి కావడంతో.. ఆ అవకాశాన్ని అక్రమార్జనకు మార్గంగా మార్చుకున్నాడు. అదే ప్రాంతానికి చెందిన మిత్రులు షరీఫ్ అలియాస్ సమీర్(22), మహ్మద్ అస్లం(21), మహ్మద్ ఫరీద్(22) ముఠాగా ఏర్పడ్డారు. ఆధార్కార్డు ఆధారంగా ధ్రువప్రతాలు సృష్టిస్తున్నారు. ఇలా వీరి నుంచి ఏడుగురు ధ్రువపత్రాలు పొందినట్లు కాలాపత్తర్ పోలీసులకు సమాచారం అందింది. ఇన్సెక్టర్ సుదర్శన్, డీఐ విక్రమ్సింగ్ బృందం రంగంలోకి దిగి నలుగురిని అదుపులోకి తీసుకొని, రిమాండ్కు తరలించింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు.