కన్నప్రేమకు ఉరేసిన పరువు

మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడిని ప్రేమించడంతోపాటు తాము కుదిర్చిన సంబంధం రద్దయ్యేందుకు కారణమైందన్న కోపంతో ఓ యువతిని కన్నతండ్రి, సోదరుడు, మరో ముగ్గురు రక్త సంబంధీకులు కలసి దారుణంగా హతమార్చారు.

Published : 28 Jan 2023 06:36 IST

ప్రేమించిందని కుమార్తెను చంపిన తండ్రి, సోదరుడు

మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడిని ప్రేమించడంతోపాటు తాము కుదిర్చిన సంబంధం రద్దయ్యేందుకు కారణమైందన్న కోపంతో ఓ యువతిని కన్నతండ్రి, సోదరుడు, మరో ముగ్గురు రక్త సంబంధీకులు కలసి దారుణంగా హతమార్చారు. అనంతరం మృతదేహాన్ని దహనం చేసి అవశేషాలను కాలువలో పడేశారు. ఈ నెల 22న జరిగిన ఈ హత్యకు సంబంధించి అయిదుగురు నిందితులను శుక్రవారం అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. పింప్రి మహిపాల్‌ గ్రామానికి చెందిన 22 ఏళ్ల శుభాంగీ జోగ్‌దండ్‌ బ్యాచిలర్‌ ఆఫ్‌ హోమియోపతిక్‌ మెడిసిన్‌ అండ్‌ సర్జరీ(బీహెచ్‌ఎంఎస్‌) మూడో ఏడాది చదువుతోంది. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడిని ప్రేమించింది. దీన్ని శుభాంగి కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. మరో వ్యక్తితో ఆమెకు వివాహం నిశ్చయించారు. శుభాంగి అతడికి ఫోన్‌ చేసి తన ప్రేమ విషయం చెప్పడంతో వివాహం రద్దైంది. ఆమె వల్ల కుటుంబ పరువు పోతోందని ఆగ్రహించిన తండ్రి, సోదరుడు, బాబాయి, మరో ఇద్దరు బంధువులు కలసి 22న రాత్రి ఆమెను పొలానికి తీసుకెళ్లారు. తాడు గొంతుకు బిగించి ఊపిరాడకుండా చేసి చంపారు. అనంతరం సాక్ష్యాధారాలు ధ్వంసం చేసే ఉద్దేశంతో మృతదేహానికి నిప్పుపెట్టారు. అవశేషాలను సమీపంలోని కాలువలో పడేశారు. శుభాంగీ కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని