తిరుమల ఘాట్‌రోడ్డులో వాహనం బోల్తా

తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మొదటి ఘాట్‌రోడ్డులో సోమవారం జరిగిన ప్రమాదంలో 13 మంది గాయపడ్డారు.

Published : 30 May 2023 05:40 IST

13 మందికి గాయాలు

తిరుమల, తిరుపతి (వైద్యం), న్యూస్‌టుడే: తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మొదటి ఘాట్‌రోడ్డులో సోమవారం జరిగిన ప్రమాదంలో 13 మంది గాయపడ్డారు. కర్ణాటకలోని కోలార్‌కు చెందిన భక్తులు టెంపో వాహనంలో తిరిగి వస్తుండగా, ఆరో మలుపు వద్ద వాహనం అదుపుతప్పి రక్షణగోడను ఢీకొని బోల్తా పడింది. 13 మందికీ గాయాలయ్యాయి. క్షతగాత్రులను తిరుపతిలోని ప్రభుత్వ రుయా ఆసుపత్రికి తరలించారు. తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి స్పందించి భక్తులకు మెరుగైన చికిత్స అందించేలా చూడాలని అధికారులకు సూచించారు. వరుస ప్రమాదాలపై నివేదిక ఇవ్వాలని నిఘా, భద్రతాధికారులను ఆదేశించారు. డ్రైవర్‌ అనుభవరాహిత్యం వల్లే ప్రమాదం జరిగిందని తిరుమల ట్రాఫిక్‌ డీఎస్పీ కొండయ్య తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ విశ్రాంత ఎస్సై నాగరాజు మీడియాతో మాట్లాడుతూ ‘‘38 ఏళ్లు పోలీసుశాఖలో పనిచేసి, ఎస్సైగా రిటైర్‌ అయ్యాను. హైవేల్లో ప్రమాదం జరిగినా పది నిమిషాల్లో వెళ్లి క్షతగాత్రులను కాపాడేవాడిని. మేం ప్రమాదానికి గురైతే... అంబులెన్సులు రావడానికే గంటన్నరకు పైగా పట్టింది. అందరినీ 108లో గొర్రెల్ని కుక్కినట్లు కుక్కి రుయాకు తీసుకొచ్చారు. అక్కడ సకాలంలో చికిత్స అందించకుండా, ఆలస్యం చేశారు. ఇదేనా ఇక్కడి ప్రభుత్వం తీరు?’ అని ప్రశ్నించారు.

తిరుమల మొదటి ఘాట్‌రోడ్డులోనే సోమవారం రాత్రి జరిగిన మరో ప్రమాదంలో వైయస్‌ఆర్‌ జిల్లాకు చెందిన భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్‌ బయటకు దూకేయడంతో పక్కన ఉన్న ప్రయాణికుడు వాహనాన్ని రక్షణగోడకు ఢీకొట్టించి ఆపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని