MLC Ananthababu: నేనే చంపేశా..

మాజీ కారు డ్రైవర్‌ సుబ్రమణ్యాన్ని తానే హత్య చేశానని ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌ (అనంతబాబు) అంగీకరించినట్లు కాకినాడ జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు వెల్లడించారు. ప్రాథమిక విచారణ, అనంతబాబు వాంగ్మూలం, ఇప్పటి వరకు సేకరించిన సాంకేతిక ఆధారాలను బట్టి ప్రాథమిక దర్యాప్తులో ఆయన్ను నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశామని చెప్పారు. నిందితుణ్ని కాకినాడ స్పెషల్‌ మొబైల్‌ జేఎఫ్‌సీఎం కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి, రిమాండుకు పంపామన్నారు. సోమవారం రాత్రి జిల్లా పోలీసు కార్యాలయంలో ఏఎస్పీ శ్రీనివాస్‌తో కలిసి ఎస్పీ మీడియాతో మాట్లాడారు.

Updated : 24 May 2022 09:58 IST

పోలీసుల ఎదుట అంగీకరించిన వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు
మాజీ డ్రైవర్‌ హత్య కేసులో అరెస్టు వివరాలు వెల్లడించిన కాకినాడ జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు

ఈనాడు, కాకినాడ: మాజీ కారు డ్రైవర్‌ సుబ్రమణ్యాన్ని తానే హత్య చేశానని ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌ (అనంతబాబు) అంగీకరించినట్లు కాకినాడ జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు వెల్లడించారు. ప్రాథమిక విచారణ, అనంతబాబు వాంగ్మూలం, ఇప్పటి వరకు సేకరించిన సాంకేతిక ఆధారాలను బట్టి ప్రాథమిక దర్యాప్తులో ఆయన్ను నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశామని చెప్పారు. నిందితుణ్ని కాకినాడ స్పెషల్‌ మొబైల్‌ జేఎఫ్‌సీఎం కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి, రిమాండుకు పంపామన్నారు. అర్ధరాత్రి 1.15గంటల సమయంలో అనంతబాబును రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించారు. సోమవారం రాత్రి జిల్లా పోలీసు కార్యాలయంలో ఏఎస్పీ శ్రీనివాస్‌తో కలిసి ఎస్పీ మీడియాతో మాట్లాడారు. విచారణ కొనసాగుతోందని, హత్య కేసులో ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇంకేమైనా జరిగిందా అన్న విషయంపై దర్యాప్తు కొనసాగిస్తామన్నారు. ఏలూరు రేంజ్‌ డీఐజీ పాలరాజు పర్యవేక్షణలో ఆరు బృందాలను ఏర్పాటు చేసి, వేగంగా దర్యాప్తు జరిపి, ఎమ్మెల్సీని అరెస్టు చేసినట్లు చెప్పారు. డీజీపీ గంట గంటకు కేసును పర్యవేక్షించారనీ.. రాష్ట్రప్రభుత్వం, సీఎం నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని ఆదేశించారనీ వెల్లడించారు. ఎస్పీ చెప్పిన వివరాలివీ.

ఎమ్మెల్సీ అహం దెబ్బతింది..

సంఘటన జరిగిన రోజు (19న) సుబ్రమణ్యం ఇంటి నుంచి 8 గంటల ప్రాంతంలో బయటకు వచ్చాడు. మిత్రులతో కలిసి మద్యం కొన్నాడు. శ్రీరామ్‌నగర్‌ ఏరియాలో ఓల్డ్‌ నవభారత్‌ స్కూలు ప్రాంగణంలో రాత్రి 10.15 వరకు మద్యం తాగారు. ఆ తర్వాత రోడ్డుపైకి వచ్చేసరికి అదే సమయంలో ఎమ్మెల్సీ అనంతబాబు తన కారులో అటుగా వచ్చారు. సుబ్బును పిలిచించి వాహనంలోకి ఎక్కించుకున్నారు. మిగతా మిత్రులు వెళ్లిపోయారు. అదే వాహనంలో ముందుకు వెళ్లి, టిఫిన్‌ కట్టించుకుని.. 10.30 సమయంలో తిరిగి ఎమ్మెల్సీ నివాసం వైపు వెళ్లారు. నీ పెళ్లి సమయంలో ఇచ్చిన అప్పులో ఇంకా రూ.20 వేలు తిరిగివ్వలేదని అనంతబాబు అడగటంతో ఇచ్చేస్తానని సుబ్రమణ్యం చెప్పాడు. ‘నువ్వు ప్రవర్తన మార్చుకుని బాగుంటే నా దగ్గర పనిలో పెట్టుకోమని మీ అమ్మ అడుగుతోంది. నీ దగ్గర మద్యం వాసన వస్తుంది. నీలో మార్పు రాలేదు’ అని ఎమ్మెల్సీ అనడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇంటి వద్ద కారు ఆగి దిగాక.. నీ పద్ధతి బాగాలేదంటూ కొట్టడానికి అనంతబాబు ముందుకొస్తే.. తాగిన వ్యక్తిని ఎందుకన్నా కొడతావు అని సుబ్రమణ్యం ఎదురుతిరిగాడు. దీంతో అనంతబాబు అహం దెబ్బతిని మెడ పట్టుకుని వెనక్కి నెట్టాడు. ఆ వేగానికి సుబ్రమణ్యం అపార్ట్‌మెంట్‌ డ్రైనేజీ గట్టుపై పడటంతో తలకు గాయమైంది. నన్నే కొడతావా అని కోపంతో అతను మళ్లీ తిట్టడంతో అనంతబాబు రెండోసారి బలంగా కొట్టారు. దీంతో గ్రిల్స్‌కు తగిలి తలకు మళ్లీ గాయమైంది. అనంతబాబు అతణ్ని వాహనంలో ఎక్కించుకుని రెండు ఆసుపత్రులకు వెళ్లగా అవి మూసివేసి ఉన్నాయి. కారులో వస్తుండగా సుబ్రమణ్యానికి ఎక్కిళ్లు రావడంతో అనంతబాబు నీళ్లిచ్చారు. అవి తాగాక కొంతసేపటికి ఉలుకూపలుకూ లేకపోవడంతో పరీక్షించగా శ్వాస ఆగిపోయిందని గుర్తించారు. చనిపోయాడని భావించి, ఆ షాక్‌ నుంచి ఎలా బయటపడాలో ఆలోచించారు. 

ప్రమాదంగా చిత్రీకరించాలని భావించి..

సుబ్రమణ్యం తాగి, నాలుగైదుసార్లు ప్రమాదాలు చేశాడు. తాగిన ప్రతిసారీ యాక్సిడెంట్‌ చేస్తే..  ఆసుపత్రిలో చికిత్స చేయించి, కుటుంబానికి అప్పగించేవారు. దీన్ని కూడా అలాగే ప్రమాదంలా సృష్టిస్తే అనుమానం రాదని అనంతబాబు భావించారు. స్థానిక జి కన్వెన్షన్‌ సెంటర్‌లో ప్రమాదం జరిగినట్లుగా చిత్రీకరించాలని చూశారు. అక్కడ ట్రాఫిక్‌ ఉండటంతో, డంపింగ్‌ యార్డు ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ సుబ్రమణ్యం మృతదేహాన్ని కింద పడుకోబెట్టి ప్రమాదంలో గాయపడినట్లు చూపడానికి చెట్టుకొమ్మతో తొడలు, చేతులు, భుజం, వీపుపైన కొట్టారు. తర్వాత అక్కడున్న తాడుతో మృతదేహాన్ని కట్టేసి వాహనంలో ఎక్కించారు. అక్కడ్నుంచి తిరిగివస్తూ 12.30 ప్రాంతంలో మృతుడి తల్లికి ఫోన్‌ చేసి.. సుబ్బుకు ప్రమాదం జరిగినట్లు నాకు సమాచారం వచ్చింది, నేను అక్కడికి వెళ్తున్నానని నమ్మబలికారు. కాసేపాగి మళ్లీ వారికి కాల్‌ చేసి, నేను మృతదేహాన్ని తీసుకువస్తున్నానని చెప్పారు. ఇంటికి రాగానే మృతదేహాన్ని చూసిన కుటుంబసభ్యులు అది ప్రమాదం కాదని అనుమానించారు. ఎమ్మెల్సీని నిలదీయడంతో ఆయన కారు వదిలి వేరే ద్విచక్రవాహనంపై అక్కడి నుంచి పరారయ్యారు. మృతుడి తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు సర్పవరం ఠాణాలో కేసు నమోదు చేశాం’ అని ఎస్పీ వివరించారు.

ఏయే సెక్షన్ల కింద కేసులు?

సాక్ష్యాధారాలు తారుమారు చేసే ప్రయత్నంలో మృతదేహంపై గాయాలు చేయడం, హత్య, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కింద సెక్షన్లు మార్చి అనంతబాబును అరెస్టు చేశామని ఎస్పీ చెప్పారు. అవసరమైతే మరోసారి పోలీసు కస్టడీకి తీసుకుని విచారిస్తామన్నారు. రూ.20 వేల కోసమే హత్య చేశాడా? వివాహేతర సంబంధాల నేపథ్యమా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు వాస్తవాల ప్రకారమే దర్యాప్తు ఉంటుందనీ.. ఇదే ఫైనల్‌ కాదని సమాధానమిచ్చారు. 

సుబ్రమణ్యం కుటుంబానికి తెదేపా రూ.5 లక్షల ఆర్థిక సాయం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: హత్యకు గురైన వైకాపా ఎమ్మెల్సీ డ్రైవర్‌ సుబ్రమణ్యం కుటుంబ సభ్యులకు తెదేపా అధినేత చంద్రబాబు రూ.5లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. మృతుడి కుటుంబ సభ్యులకు న్యాయం చేసేందుకు ఎస్సీ సంఘాలతో కలిసి కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.


రోజంతా హైడ్రామా

ఈనాడు, కాకినాడ: మాజీ కారు డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబును నాలుగు రోజుల హైడ్రామా అనంతరం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ వ్యవహారం అంతా అత్యంత గోప్యంగా ఉంచారు. అనంతబాబు పోలీసు కస్టడీలో ఉన్నారని ఆదివారం నుంచి ప్రచారం సాగుతున్నా పోలీసులు ధ్రువీకరించలేదు. ఈ సమాచారం కోసం జిల్లా ఎస్పీ కార్యాలయం, సాయుధ దళ కార్యాలయం, కాకినాడ జీజీహెచ్‌, న్యాయస్థానాల ప్రాంగణాల వద్ద సోమవారం ఉదయం నుంచి మీడియా ప్రతినిధులు నిరీక్షించారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ కార్యాలయంలోకి వెళ్తున్న అదనపు ఎస్పీ శ్రీనివాస్‌ను మీడియా ప్రశ్నించడంతో అనంతబాబు పోలీసు కస్టడీలోనే ఉన్నారని, విచారణ జరుగుతోందని వెల్లడించారు. సోమవారం సాయంత్రం సర్పవరం పోలీసుస్టేషన్‌కు, అక్కడి నుంచి  కాకినాడ జీజీహెచ్‌కు తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం అనంతబాబును న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఇదే సమయంలో ఎస్పీ మీడియాకు ఈ కేసు వివరాలను వెల్లడించారు.

‘అనంతబాబు గారు నేరం చేసినట్లు అంగీకరించారు’

హత్య కేసులో నిందితుడని ప్రాథమికంగా రుజువైనా.. ఎమ్మెల్సీ అనంతబాబుకు పోలీసులు రాచమర్యాదలు చేసినట్లు సమాచారం. మీడియాతో కేసు పూర్వాపరాలు వెల్లడిస్తున్నప్పుడు సైతం ‘ఎమ్మెల్సీ అనంతబాబు గారు నేరం చేసినట్లు అంగీకరించారు’ అని ఎస్పీ వ్యాఖ్యానించడం గమనార్హం. అరెస్టు చేసి తరలించినప్పుడు వీఐపీకి ఇచ్చిన ప్రాధాన్యం ఇవ్వడం విస్మయం గురి చేసింది. ఎస్పీ మీడియా సమావేశం మినహా మరే వివరాలు బయటకు పొక్కకుండా గత కొద్దిరోజులుగా పోలీసులు మౌనం పాటించడం వెనుక రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గడమే కారణమన్న వాదన వినిపించింది.


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని