Vijayawada: అందరికీ అండగా నిలిచే ఆ వైద్యుడి ఇంట విషాదం

అడిగిన ప్రతి ఒక్కరికీ తన వంతు సాయాన్ని, సహకారాన్ని అందిస్తున్నారాయన... అమరావతి పాదయాత్రతో పాటు అనేక కార్యక్రమాలకు పలు రూపాల్లో

Updated : 28 Sep 2022 06:49 IST

అమెరికాలో రోడ్డు ప్రమాదం

తానా బోర్డు డైరెక్టర్‌ భార్య, ఇద్దరు కుమార్తెలు మృతి

విజయవాడ సిటీ, పామర్రు గ్రామీణం, న్యూస్‌టుడే: అడిగిన ప్రతి ఒక్కరికీ తన వంతు సాయాన్ని, సహకారాన్ని అందిస్తున్నారాయన... అమరావతి పాదయాత్రతో పాటు అనేక కార్యక్రమాలకు పలు రూపాల్లో సాయం చేశారు. ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడంలో, సేవా కార్యక్రమాల్ని నిర్వహించడంలో ముందుంటూ సమాజానికి తమ వంతు సహకారాన్ని అందిస్తున్న అమెరికాలోని ప్రవాసాంధ్ర వైద్యుడి ఇంట విషాదం నెలకొంది. ఆయన భార్య, ఇద్దరు కుమార్తెలు రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ విషయం తెలిసి కృష్ణా జిల్లాలోని వైద్యుడి బంధువులు, స్నేహితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికాలోని టెక్సాస్‌ వాలర్‌ కౌంటీలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) బోర్డు డైరెక్టర్‌ భార్య వాణి, ఇద్దరు కుమార్తెలు నిఖిల లక్ష్మి(17), మేఘనాదేవి(19) దుర్మరణం చెందారు. కృష్ణా జిల్లా పామర్రు మండలం కురుమద్దాలికి చెందిన కొడాలి నాగేంద్ర శ్రీనివాస్‌ గుంటూరు వైద్య కళాశాలలో వైద్యవిద్యను పూర్తిచేశారు. 1995లో ఉన్నత విద్యను చదవడానికి అమెరికా వెళ్లారు. అక్కడ పీడియాట్రిక్‌ కార్డియోవాస్క్యులర్‌ అనస్థీషియాలజిస్ట్‌గా పనిచేస్తూ హ్యూస్టన్‌లో స్థిరపడ్డారు. 2017 నుంచి తానా బోర్డు సభ్యుడిగా ఉన్నారు. భార్య వాణి ఐటీ ఉద్యోగి. పెద్ద కుమార్తె మేఘనాదేవి వైద్యవిద్య, రెండో కుమార్తె నిఖిల లక్ష్మి 11వ తరగతి చదువుతున్నారు. కళాశాల నుంచి పెద్దమ్మాయిని ఇంటికి తీసుకొచ్చేందుకు నాగేంద్ర శ్రీనివాస్‌ భార్య వాణి, చిన్న కుమార్తె వెళ్లారు. తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న కారును మరో వ్యాను ఢీకొనడంతో ముగ్గురూ చనిపోయారు. మేఘనాదేవి, నిఖిల లక్ష్మి ఇద్దరూ కూచిపూడి, భరతనాట్యం నేర్చుకున్నారు. విజయవాడ బృందావన కాలనీలో నివసిస్తున్న వారి బంధువు కొడాలి నాగేశ్వరరావు మాట్లాడుతూ... శ్రీనివాస్‌ కుటుంబంలో ఈ దుర్ఘటన సంభవించడాన్ని తట్టుకోలేక పోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. హ్యూస్టన్‌లో శనివారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కురుమద్దాలిలోని నాగేంద్ర శ్రీనివాస్‌ బంధువులు ప్రమాదం గురించి తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యారు.


రోడ్డు ప్రమాదంపై నాట్స్‌ దిగ్భ్రాంతి

ఈనాడు, అమరావతి: అమెరికాలోని వాలర్‌ కౌంటీలో జరిగిన రోడ్డుప్రమాదంలో డాక్టర్‌ కొడాలి నాగేంద్ర శ్రీనివాస్‌ భార్య, ఇద్దరు కుమార్తెలు మరణించడంపై నాట్స్‌ (ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ) దిగ్భ్రాంతి వెలిబుచ్చింది. నాట్స్‌ బోర్డు డైరెక్టర్‌గా పనిచేసిన శ్రీనివాస్‌ కుటుంబంలో చోటు చేసుకున్న విషాదఘటన తమను కలచివేసిందన్నారు. ఆయనకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. నాట్స్‌తో శ్రీనివాస్‌ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని