పీఎఫ్‌ఐ కేసు గుట్టు తేల్చడంపై ఎన్‌ఐఏ దృష్టి

పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా(పీఎఫ్‌ఐ) పేరిట సేవా కార్యక్రమాల ముసుగులో ఉగ్రకుట్రకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో అరెస్టయిన నలుగురు నిందితుల్ని జాతీయ దర్యాప్తు బృందం(ఎన్‌ఐఏ) కస్టడీకి తీసుకుంది. గుంటూరులోని

Updated : 29 Sep 2022 05:41 IST

మూడు రోజుల కస్టడీకి నలుగురు నిందితులు

ఈనాడు, హైదరాబాద్‌: పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా(పీఎఫ్‌ఐ) పేరిట సేవా కార్యక్రమాల ముసుగులో ఉగ్రకుట్రకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో అరెస్టయిన నలుగురు నిందితుల్ని జాతీయ దర్యాప్తు బృందం(ఎన్‌ఐఏ) కస్టడీకి తీసుకుంది. గుంటూరులోని పొత్తూరివారిపేటకు చెందిన అబ్దుల్‌రహీమ్‌, ఆనందపేటకు చెందిన అబ్దుల్‌ వహీద్‌ అలీ హజ్రత్‌జున్ను, షహీద్‌నగర్‌కు చెందిన షేక్‌ జఫరుల్లాఖాన్‌, కర్నూలు ఖడక్‌పురాకు చెందిన అబ్దుల్‌ వారిస్‌లను మూడు రోజుల కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లిలోని ఎన్‌ఐఏ కేసుల ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం ఆదేశాలిచ్చింది. ఈ క్రమంలో బుధవారం నిందితులను చంచల్‌గూడ జైలు నుంచి ఎన్‌ఐఏ బృందం తమ కస్టడీకి తీసుకొంది. దేశవ్యాప్తంగా 20కిపైగా రాష్ట్రాల్లో ఈ నెల 22న ఈడీ బృందాలతో కలిసి ఎన్‌ఐఏ ఏకకాలంలో దాడులు చేసిన సంగతి తెలిసిందే. పీఎఫ్‌ఐ కీలక నేతల ఇళ్లు, కార్యాలయాల్లో జరిగిన ఈ సోదాల్లో దర్యాప్తు బృందాలు పలు కీలక పత్రాలను, డిజిటల్‌ డివైజ్‌లను స్వాధీనం చేసుకున్నాయి. ఆ వివరాలను విశ్లేషించేందుకే ఈ నలుగుర్ని ఎన్‌ఐఏ కస్టడీకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే పీఎఫ్‌ఐ కార్యకలాపాలకు నిధులు ఎక్కడి నుంచి సమకూర్చుకున్నారనే అంశాన్ని గుర్తించాల్సి ఉంది. మరోవైపు ఉగ్ర శిక్షణ శిబిరాల నిర్వహణ గుట్టు తేలాల్సి ఉంది. దసరా సందర్భంగా దేశవ్యాప్తంగా అలజడులు సృష్టించేందుకు కుట్ర జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో తాజా కస్టడీకి ప్రాధాన్యం ఏర్పడింది. ఈ నిందితులను విచారిస్తే కీలక సమాచారం లభిస్తుందని ఎన్‌ఐఏ భావిస్తోంది.

హైదరాబాద్‌ కార్యాలయంలో దొరికిన ఆధారాల విశ్లేషణ

ఆంధ్రప్రదేశ్‌లో నలుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్న రోజే హైదరాబాద్‌లోనూ ఎన్‌ఐఏ బృందాలు సోదాలు నిర్వహించాయి. చాంద్రాయణగుట్టలోని పీఎఫ్‌ఐ కార్యాలయంలో పలు పత్రాల్ని, డిజిటల్‌ డివైజ్‌లను స్వాధీనం చేసుకున్నాయి. కర్నూలులో అరెస్టయిన అబ్దుల్‌ వారిస్‌ నుంచి రాబట్టిన సమాచారం ఆధారంగానే చాంద్రాయణగుట్ట కార్యాలయంలో సోదాలు జరిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆ కార్యాలయంలో దొరికిన ఆధారాలను సమగ్రంగా విశ్లేషించే పనిలో దర్యాప్తు సంస్థ నిమగ్నమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని