సంక్షిప్త వార్తలు(4)

మహారాష్ట్ర కొల్హాపుర్‌ జిల్లాలోని కాగల్‌ ప్రాంతానికి చెందిన ప్రకాశ్‌ బాలసో మాలి (42)... సొంత భార్య, పిల్లలను హత్యచేశాడు. భార్యపై అనుమానంతోనే ఈ ఘాతుకానికి తెగబడ్డాడు. నిందితుడు తన భార్య

Updated : 30 Sep 2022 06:25 IST

అనుమానంతో భార్యను... అనాథలవుతారని పిల్లలను చంపేశాడు

మహారాష్ట్ర కొల్హాపుర్‌ జిల్లాలోని కాగల్‌ ప్రాంతానికి చెందిన ప్రకాశ్‌ బాలసో మాలి (42)... సొంత భార్య, పిల్లలను హత్యచేశాడు. భార్యపై అనుమానంతోనే ఈ ఘాతుకానికి తెగబడ్డాడు. నిందితుడు తన భార్య గాయత్రి (37)తో తరచూ గొడవపడేవాడు. బుధవారం వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే అతడు భార్య గొంతు నులిమి చంపేశాడు. సాయంత్రం తన పిల్లలు ఇంటికి వచ్చేంతవరకూ భార్య శవాన్ని ఎదురుగా పెట్టుకుని కూర్చున్నాడు. పోలియోతో బాధపడుతున్న తన కొడుకు (ఎనిమిదో తరగతి) ఇంటికి రాగానే.. అతడి గొంతు నులిమేశాడు. పదకొండో తరగతి చదువుతున్న కూతురు రాత్రి 8 గంటలకు ఇంటికి చేరగా, తలపై రోకటితో గట్టిగా బాది ఆమెను కూడా చంపేశాడు! ఆ తర్వాత పోలీసుల వద్దకు వెళ్లి లొంగిపోయాడు. తనను అరెస్టుచేస్తే.. పిల్లల్ని చూసుకునేందుకు ఎవరూ ఉండరన్న కారణంతోనే వారిని కూడా చంపేసినట్టు నిందితుడు తెలిపాడు.


కట్నం కోసం కోడలికి నిప్పు!

బిహార్‌ బక్సర్‌ జిల్లాలో ఓ అత్తింటివారు కట్నం కోసం కోడలిని హింసించి, నిప్పంటించిన ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. యూపీలోని గాజీపుర్‌కు చెందిన అంజలీ రాయ్‌, బిహార్‌లోని కమార్‌పుర్‌ గ్రామానికి చెందిన యువకుడు సూర్యదేవ్‌ రాయ్‌లకు గత నవంబరులో పెళ్లయింది. తర్వాత కొద్దిరోజులకే రూ.5 లక్షల కట్నం తీసుకురావాలని అంజలిని అత్తింటివారు వేధించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే వారు ఆమెకు నిప్పు అంటించినట్టు తెలుస్తోంది. మంటల్లో చిక్కుకున్న అంజలి తాగడానికి మంచినీరు ఇవ్వాలని ప్రాధేయపడినా.. అత్తింటివారు నిరాకరించారు. ‘నువ్వే ఒంటికి నిప్పంటించుకున్నావని చెప్పు’ అని నిందితులు డిమాండ్‌ చేయడం వీడియోలో వినిపిస్తోంది.


కామంతో కళ్లు మూసుకుపోయి.. 11 ఏళ్ల కుమార్తెపై అత్యాచారం!

అసోంలోని నాగావ్‌ జిల్లాకు చెందిన ఓ తండ్రి... కామంతో కళ్లు మూసుకుపోయి తన 11 ఏళ్ల వయసున్న కూతురిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు! చివరిసారిగా ఈనెల 20న ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టి, ఇంటి నుంచి పారిపోయాడు. విషయం తెలుసుకున్న చిన్నారి తల్లి పోలీసులను ఆశ్రయించింది. ఎట్టకేలకు నిందితుడిని పట్టుకున్న పోలీసులు... అతడిని న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. నిందితుడు గతంలోనూ ఇదే నేరంపై అరెస్టయి, బెయిల్‌పై బయటకు వచ్చాడు.


భార్యపై కోపంతో బిడ్డను హత్యచేసిన తండ్రి

భార్యతో గొడవపడిన ఓ వ్యక్తి... ఆ కోపంలో సొంత కూతురిని పొలంలోని నీటి కుంటలో పడేసి హత్యచేశాడు. అనంతరం తన కుమార్తెను ఎవరో కిడ్నాప్‌ చేశారంటూ పోలీసులకు కట్టుకథ చెప్పాడు. అనుమానంతో వారు గుచ్చిగుచ్చి ప్రశ్నించడంతో నిజం కక్కాడు. నిందితుడిని జగన్నాథ్‌ ధాక్నేగా గుర్తించిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని