‘నేను చనిపోతే కుమార్తెను నా భార్య సరిగా చూసుకోదు.. అందుకే!’

కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తండ్రి కుమార్తెతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటన యాదగిరిగుట్ట పట్టణంలో

Published : 02 Apr 2022 01:40 IST

యాదగిరిగుట్టలో ఆరేళ్ల కుమార్తెతో సహా తండ్రి ఆత్మహత్య

యాదగిరిగుట్ట పట్టణం: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తండ్రి కుమార్తెతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటన యాదగిరిగుట్ట పట్టణంలో శుక్రవారం చోటు చేసుకుంది.యాదగిరిగుట్ట సీఐ జానకిరెడ్డి, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌ చందానగర్‌కు చెందిన చెరుకూరి సురేశ్‌ (40)కు భార్య, ఆరేళ్ల కుమార్తె శ్రేష్ఠ ఉన్నారు.  గురువారం ఉదయం సురేశ్‌ తన కుమార్తెను తీసుకొని యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారి దర్శనానికి వెళ్లారు. స్థానికంగా ఉన్న మయూరి గ్రాండ్‌ హోటల్‌లో ఒక గదిని అద్దెకు తీసుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి 12:40 గంటలకు హోటల్‌ బిల్డింగ్‌పై నుంచి కుమార్తెతో కలిసి సురేశ్‌ కిందకు దూకారు. గమనించిన స్థానికులు, హోటల్‌ నిర్వాహకులు అక్కడికెళ్లి చూడగా అప్పటికే ఇద్దరూ మృతి చెందారు. 

సమాచారం అందుకున్న యాదగిరిగుట్ట పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాలను పరిశీలించారు. ఘటనాస్థలి వద్ద దొరికిన సూసైడ్‌ నోట్‌ ఆధారంగా.. సురేశ్‌ లింగంపల్లి బీఎస్ఎన్‌ఎల్‌ కార్యాలయంలో సబ్‌ డివిజినల్‌ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు. తాను చనిపోతే తన కూతురిని భార్య సరిగా చూసుకోదనే కారణంతో కుమార్తెతో కలిసి ఆత్మహత్య చేసుకున్నట్లు నోట్‌లో వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ జానకిరెడ్డి తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని