నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం

అక్కా.. పాపను ఆడిస్తానంటూ తీసుకెళ్లిన కామాంధుడు నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని ఒక గ్రామంలో చోటుచేసుకుంది. ..

Published : 27 Nov 2020 09:32 IST

విజయనగరం : అక్కా.. పాపను ఆడిస్తానంటూ తీసుకెళ్లిన కామాంధుడు నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని ఒక గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డిగ్రీ మధ్యలో ఆపేసిన గ్రామానికి చెందిన ఓ యువకుడు (19) పక్కింటి ఆవరణలో ఆడుకుంటున్న చిన్నారిని తన ఇంట్లో ఆడిస్తానంటూ బుధవారం ఉదయం 11 గంటల సమయంలో తీసుకువెళ్లాడు. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో పాప నానమ్మ తిరిగి ఇంటికి తీసుకొచ్చింది. అప్పటి నుంచి కడుపునొప్పిగా ఉందంటూ ఏడుస్తుండటంతో తగరపువలస, అక్కడి నుంచి జిల్లా కేంద్రాసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ పరీక్షలు చేసిన వైద్యులు అత్యాచారం జరిగిందని గురువారం నిర్ధరించారు. దీనిపై ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు భోగాపురం ఎస్‌ఐ మహేష్‌ తెలిపారు. డీఎస్పీ త్రినాథరావు, సీఐ శ్రీధర్‌, దిశ పోలీస్‌స్టేషన్‌ ఎస్సై రామకృష్ణ విచారణ జరుపుతున్నారు. బాలికకు మెరుగైన వైద్యం అందించాలని బాలల సంక్షేమ సమితి (సీడబ్ల్యూసీ) జిల్లా అధ్యక్షుడు వి.లక్ష్మణ్‌ కోరారు. బాధిత బాలికను గురువారం సీడబ్ల్యూసీ సభ్యులు పరామర్శించారు. అనంతరం దిశ పోలీస్‌స్టేషన్‌ డీఎస్పీ త్రినాథ్‌ను కలసి కేసు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇటువంటి ఘటన జిల్లాలో జరగడం దురదృష్టకరమని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని