Tirupati: శ్రీకాళహస్తిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మిట్టకండ్రిగ వద్ద కారు, లారీ ఢీకొన్నాయి.

Updated : 09 Jul 2023 16:05 IST

శ్రీకాళహస్తి: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) చోటుచేసుకుంది. మిట్టకండ్రిగ వద్ద కారు, లారీ ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఆరుగురు దుర్మరణంచెందారు. తిరుపతి నుంచి శ్రీకాళహస్తి(Srikalahasthi)కి ఏడుగురు ఎర్టిగా వాహనంలో బయల్దేరి వెళ్తుండగా ఓ లారీ అదుపుతప్పి బలంగా ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. కారులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడిని చికిత్స నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ ఘటనలో మృతులంతా ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. గాయపడిన భరత్‌ అనే వ్యక్తిని ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. అతడి నుంచి వివరాలు సేకరించి బంధువులకు సమాచారం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మృతులను రమేశ్‌, నరసింహమూర్తి, రాజ్యలక్ష్మి, శ్రీలత, అక్షయ, వెంకటరమణమ్మగా గుర్తించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం శ్రీకాళహస్తికి వెళ్లి వాయులింగేశ్వర స్వామి దర్శనం పూర్తి చేసుకొని తిరిగి విజయవాడ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ క్రమంలోనే తిరుపతి నుంచి శ్రీకాళహస్తికి వెళ్తుండగా మిట్టకండ్రిగ వద్ద ఎదురుగా వస్తున్న లారీని కారు ఢీకొట్టింది. అతి వేగమే ఈ దుర్ఘటనకు కారణమని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని