Crime News: పాడేరు వద్ద లోయలో పడిన ఆర్టీసీ బస్సు.. ఇద్దరి మృతి

అల్లూరి జిల్లాలోని పాడేరు ఘాట్‌రోడ్డులో ఆదివారం సాయంత్రం  ఘోర ప్రమాదం జరిగింది.

Updated : 20 Aug 2023 22:18 IST

పాడేరు: అల్లూరి జిల్లాలోని పాడేరు ఘాట్‌రోడ్డులో ఆదివారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు లోయలో పడిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. 30 మందికి గాయాలయ్యాయి. వీరిలో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. విశాఖపట్నం నుంచి పాడేరు వెళ్తున్న పాడేరు డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు ఘాట్‌ రోడ్డు వ్యూ పాయింట్‌ వద్ద అదుపు తప్పి ఏడు పల్టీలు కొట్టి.. 50 అడుగుల లోయలోకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు.

లోయలో పడిన బస్సు వద్దకు చేరుకుని క్షతగాత్రులను కాపాడేందుకు స్థానికులు తీవ్రంగా శ్రమించారు. అతి కష్టం మీద ప్రయాణికులను ప్రధాన రహదారిపైకి తీసుకొచ్చారు. పాడేరు వైపు నుంచి వస్తున్న మరో ఆర్టీసీ బస్సులో క్షతగాత్రులను పాడేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇటీవల కురిసిన వర్షాలకు చెట్టు కొమ్మలు రోడ్డుపైకి వాలిపోవటం, రహదారి పక్కన రక్షణ గోడలేకపోవడమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు ఆరోపించారు. ఘటనాస్థలిలో సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ కూడా లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.

చంద్రబాబు దిగ్భ్రాంతి

ఆర్టీసీ బస్సు ప్రమాదంపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సు లోయలో పడిపోయిన ఘటనలో ఇద్దరు చనిపోవడంపై విచారం వ్యక్తం చేశారు. తీవ్రంగా గాయపడిన బాధితులకు మెరుగైన చికిత్స అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. సత్వర చర్యల ద్వారా బాధితులకు సాయం చేయాలని విజ‌్ఞప్తి చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని, ప్రమాద ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం: మంత్రి అమర్నాథ్‌ 

పాడేరు ఆసుపత్రిలో క్షతగాత్రులను మంత్రి అమర్నాథ్‌ పరామర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు, క్షతగాత్రులకు రూ. లక్ష పరిహారం ఇస్తామని ఆయన ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు